Pages

Saturday, December 18, 2010

శ్రీ హనుమద్ర్వతం

శ్రీ మారుతాత్మజాయనమః

శ్రీ రామచంద్రుడు దుష్ట సంహారము అయ్యాక సీతా సమేతుడై అయోధ్య చేరాడు. పట్టాభిషిక్తుడయ్యాడు..వనవాసకాలంలో పరిచయమైన తపోధనులకు కృతఙ్ఞతలు తెలపాలని జానకీ మాత సంకల్పించింది. సర్వాంతర్యామి..."సరే" అన్నాడు...ఏర్పాట్లు చక చకా జరిగిపోయాయి...అంతా తానై నిర్వహిస్తున్నాడు హనుమ......ఆ రోజు రానే వచ్చింది. శ్రీ రాముని దర్శించవచ్చునన్న కుతూహలం...ముని జనుల కోలాహలం....తపోవనం తరలివచ్చింది. ఋషులందరూ మాధ్యాహ్నిక సంధ్యావందనాదులకు సరయూనదికి తరలారు.
హనుమ వుత్సాహంగా అంతటా కలయ తిరుగుతున్నాడు....నదికి వెళ్ళిన ఋషి మండలి రాలేదు...కాలంగడుస్తున్నది...అమ్మ దృష్టి హనుమ పైననే....పుత్రవాత్సల్యము...
"ఇంకా మునిబృందము రాలేదు..వేళ మించుతున్నది...ఈ పసివానికి ఆకలౌతున్నదేమో..ముందు ఇతనికి భోజనం పెట్టేయనా" అని తర్కించుకుంటూ రాఘవుని అడిగింది..."సరే"అన్నాడు మృదుభాషి.....
"హనుమా!అన్నం పెట్టనా అమ్మా!" అంది సీతమ్మ. అమ్మ అడిగితే కాదనగలడా హనుమ...వెంటనే వచ్చి కూర్చున్నాడు. అమ్మ స్వయంగా వడ్డిస్తున్నది...హనుమ తింటున్నాడు...అమ్మ పెడ్తోంది, ఇతడు తింటున్నాడు...అన్నపురాసులు తరిగిపోతున్నాయి.అమ్మ పెట్తోంది...హనుమ తింటున్నాడు. అయ్యో ఇతని ఆకలి తీరటంలేదే అని అమ్మ కంగారు పడ్తోంది.అమ్మ పెట్తోంది కదా అని తింటున్నాడు హనుమ...మెండుగా వండిన పదార్థాలు నిండుకుంటున్నాయి...చాలు అని అతను అనడం లేదు...బిడ్డకు ఆకలి తీరడంలేదు అని గాభరా పడి శ్రీరాముని దగ్గరకు వెళ్ళి జానకి చెప్పింది
అది శివస్వరూపం...నువ్వుఎంత పెట్టినా ఆతడు వద్దనడు...లేవమని వినయంగా చెప్పు"అన్నాడు కోదండపాణి. "హనుమా! ఇక లేస్తావా నాయనా!" అమ్మ అనగానే సంతృప్తిగా త్రేన్చి "అలాగే తల్లీ!" అని లేచాడు హనుమ..
(నేను పిల్లవాడిగా వున్నప్పుడు..పిల్లల పత్రిక చందమామ లోచదివాను: గుర్తుతో వ్రాసినది కనుక యథాతధంగా వుండదు...) *****

శ్రీరాముడు అవతరిస్తున్నాడని తెలిసి తానూ హనుమగా అవతరించాడుపరమేశ్వరుడు...నేనూ వస్తానందిట ఆదిశక్తి...నువ్వెందుకు తోకలాగఅన్నాడట...సాంబశివుడు. అయితే తోకగానే వస్తానందిట...అందుకేహనుమద్వాలం అంత శక్తి సమన్వితం.
తులసీదాసు తన రామచరిత మానసంలో శివుడి రామభక్తి అద్భుతంగా ఆవిష్కరిస్తారు.
******
హనుమ సముద్రం దాటే సమయంలో వానరులతో--మనోవేగంతో శ్రీరామ బాణంలా దూసుకుపోతానంటాడు...సుందరకాండ ప్రారంభంలో...సాధనామార్గంలో ప్రవేశించేవారికి ఇంద్రియ జయంఅవసరం.అందుకే మైనాకుడిచ్చే ఆతిథ్యం సున్నితంగా తిరస్కరించాడు....సురసామాతపెట్టిన పరీక్షను బుద్ధితో గెలిచాడు...ఛాయాగ్రాహికి వజ్రఘాతం రుచి చూపాడు...రావణపాలిత లంకా నగరాన్ని...రామదూతగాప్రవేశించి ఒక వానరశ్రేష్టుడు....శ్రీరామ విజయానికి నాందీ ప్రస్తావన చేసాడు..

ఒకసారి వానరులంతా బంతిభోజనాలు చేస్తున్నారట. విస్తట్లో ఉస్తికాయలువడ్డింపబడ్డాయి...అవి వంకాయ పోలికలో రేగిపండుసైజులో వుంటాయి.అది పట్టుకొని ఒక వానరం తినబోతే పట్టుజారి పైకి యెగిరింది..అది చూసినఆ కోతి తనుకూడా చిన్నగా యెగిరింది...దాని ప్రక్కనవున్న మరోకోతిఇంకొంచెం యెగిరింది..అలాఒకదాన్ని చూసి మరొకటి, మరొకదాన్ని చూసిమరొకటీ....అందర్నీ చూసిన హనుమ తానూ వినయంగా కొంచెం యెగిరి కూర్చున్నాడట. సభామర్యాద కోసం..(ఇదీ పాత చందమామల్లోనే చదివా)

లంకలో సీతమ్మను చూసిన హనుమ, అమ్మకు ధైర్యం చెప్తాడు.".శ్రీరాముడువస్తాడమ్మా నీ చెర విడిపిస్తాడు" అంటాడు...అంతావిన్న సీతమ్మకు సందేహంకలుగుతుంది..."గరుత్మంతునితో సమానమైన నీవంటే శతయోజనవిస్తీర్ణమైనసాగరాన్ని దాటి వచ్చావు...మిగతా వానర సైన్యం అలా రాగలరా" అంటే "సుగ్రీవ సైన్యంలో నాతో సమానులైనవారు, నన్ను మించినవారేనమ్మాఅందరూ...నాకన్నా తక్కువవాడొక్కడు లేడమ్మా.."అంటాడు. "ఇలాంటి దూతకార్యాలకు నాలాంటి సామాన్యులను పంపిస్తారుకాని అధికుల్ని పంపరుకదమ్మా..." అదీ హనుమ వినయసంపద..

రామరావణ యుద్ధం జరుగుతుండగా ఇంద్రజిత్ ప్రయోగించిన బ్రహ్మాస్త్రంతోరామ లక్ష్మణ సహా అందరూ మూర్ఛిల్లుతారు..ఆ రాక్షసమాయ విభీషణునియేమీ చేయదు..బ్రహ్మానుగ్రహము వలన హనుమనూ యేమీ చేయదు...ఆ పరిస్థితులలో యెవరు యెలా వున్నారో చూడాలని వీరిరువురూయుద్ధభూమిలో పరిశీలిస్తారు...వందలాదిగా తగిలిన బాణాల ధాటికిజాంబవంతుడు బాగా గాయపడి, మూలుగుతూ కనపడతాడు...."అయ్యా!ప్రాణాలతో వున్నావా?" అని పలకరిస్తాడు విభీషణుడు...అతని స్వరాన్నిబట్టి విభీషణుని గుర్తించిన జాంబవంతుడు---హనుమంతుడు జీవించియేవున్నాడు కదా?--అంటాడు. దానికి విభీషణుడు "రామలక్ష్మణుల సహాఇంతమంది వుండగా హనుమ క్షేమమడుగుతావేమిటి" అంటే దానికిజాంబవంతుడు---

తస్మిన్ జీవతి వీరే తు హత మప్యహతం
బలమ్హనుమత్యుజ్ఝితప్రాణే జీవన్తోపి వయం హతాః----

హనుమంతుడొక్కడు జీవించివుంటే మనసేనలన్నీ మృతులైనా బ్రతికున్నట్టేఅలా కాకుండా అతడు విగత జీవుడైతే మనం బ్రతికున్నా నిర్జీవులమే" అంటాడు.అదీ హనుమ శక్తి...

అందువలననే అనితరసాధ్యమైన లంకా నగరాన్ని చేరి, సీతమ్మను చూసి,రావణబలాన్ని అంచనా వేసి, తిరిగి వచ్చి శ్రీ రామునికి సీతమ్మక్షేమం చెప్పినహనుమను చూసి...ఇంత మహోపకారము చేసిన నీకివ్వడానికి నాదగ్గరయేముందయ్యా నా కౌగిలింత తప్ప అని అక్కునజేర్చుకున్నాడు ఆజానుబాహుడు.సీతమ్మకు తక్క అన్యులకు లభ్యముకాని ఆ పరిష్వంగ భాగ్యం హనుమయ్యకుమాత్రమే లభించింది.

బుద్ధిర్బలం యశో ధైర్యం నిర్భయత్వమరోగతాఅజాడ్యం వాక్పటుత్వంచ హనుమాత్స్మరణాద్భవేత్
(మార్గశీర్ష శుద్ధ త్రయోదశి అంటే రేపు(19.12.10) హనుమద్ర్వతం.)

Friday, December 10, 2010

హాస్య భాషణలు వారి నోటనే


బారిష్టర్ పార్వతీశం' నవల నాటకంగా రేడియోలోధారావాహికంగా వచ్చింది.. బారిష్టర్ కోర్సు చదవడానికి పార్వతీశం లండన్ వెళ్తాడు..కూడా రుబ్బురోలుతో సహా అన్నీ పట్టుకు వెళ్తాడు...ఓడలో ప్రయాణం...ముందు తనవూరినుంచి రైల్లో బయలుదేరతాడు...పట్టుకు వెళ్ళిన మడతమంచం యెక్కడ పెట్టాలా అని ఆలోచించి..అలారమ్ చైన్ కు తగిలిస్తాడు కష్టపడి..రైలాగిపోతుంది. గార్డుగారుపరుగెట్టుకొస్తారు..."ఎవరిదీ మంచం?"..పార్వతీశంఆ మంచం తీయడు,సరికదా "ఏం? అంత బాగుందేమిటి?" అంటాడు. ఈ ఆఖరి మాట పాత్రధారి శ్రీ నండూరి సుబ్బారావు గారి స్వరంలో ఎంత హాస్యభరితంగావుందో మరవలేం...ఈ హాస్యభరిత నవలారచయిత శ్రీ మొక్కపాటి నరసింహశాస్త్రి గార్ని ఒక సభలో సన్మానిస్తూ 'వీరి రచనలు చాలా హాస్యాస్పదంగా వుంటా' యన్నారుట.రాజమండ్రీ గౌతమీగ్రంధాలయంలో జరిగిన సభలో అనుకుంటా వారుఈవిషయం నవ్వుతూ చెప్పారు.

రాజమండ్రీలో 1962 లో అని గుర్తు..తెలుగురచయితల సభలుజరిగాయి..మా నాన్నగారికి ఆహ్వానం వచ్చింది..వారితో నన్నూతీసుకువెళ్ళారు...గొప్పగొప్ప రచయితలను చూసే అదృష్టం కలిగింది.సర్వశ్రీ విశ్వనాధ,వెంపరాల, మునిమాణిక్యం, నోరి నరసింహశాస్త్రి, గిడుగు, మొక్కపాటి,, బెజవాడ గోపాలరెడ్డి..మొదలైనవారు చాలామంది వచ్చారు...ఓ రోజు మునిమాణిక్యంగారు మాట్లాడారు.
"నేను ఈ నెల జీతం అలవాటు ప్రకారము మా ఆవిడకి యిచ్చాను. లెక్క చూసుకుని 'ఏమండీ? ఈ నెల తక్కువ యిచ్చారేమండీ?" అంది. "వాళ్ళు తీసుకున్నారే" అన్నా. "ఎవరండీ?" అంది. "అదేనే, ఆఫీసువాళ్ళు" అన్నా. "ఎందుకండీ?""యుద్ధం చేస్తున్నారు కదా? అందుకని." "ఎవరు చేస్తున్నారు ? ఎవరితోచేస్తున్నారు?దానికీ మీ దగ్గర డబ్బులు తీసుకోవడానికి ఏమిటి సంబంధం?" అని ఆరా తీయసాగింది."అదేనోయ్!
మన దేశం వాళ్ళు చైనా వాళ్ళతో యుద్ధం చేస్తున్నారు కదా? మరి ఖర్చవుతుందికదా?" అని వివరించా. "అంత పెద్దదేశం చైనా వాళ్ళతో మనవాళ్ళు యుద్ధం చేస్తారా? దానికి ఖర్చవుతుందా? అందుకని మీ జీతం కోస్తారా?" అన్నింటికీ అవునంటూ బుర్ర వూపా...అప్పుడు
మా ఆవిడ "యుద్ధం చేయడానికి డబ్బుల్లేకపోతే మీలాంటి వాళ్ళ పొట్ట కొట్టడమెందుకండీ...అంత డబ్బుల్లేని వెర్రిముండా గవర్నమెంట్
యుద్ధం చేయకపోతే వచ్చే నష్టమేమిటిట?" మా ఆవిడ లాజిక్ కి అవాక్కయి- ఇదిగో ఇలా వచ్చేసా!" అని హర్షధ్వానాలమధ్య ముగించారు.

ప్రముఖ రచయిత భమిడిపాటి రాధాకృష్ణ గారు వారి చివరిరోజులలో జన్మస్థలమైన రాజమండ్రి వచ్చేసారు.అదే మా ఊరు కూడా. వార్ని మా హాసం క్లబ్ వార్షికోత్సవానికి అతిథిగా వుండ కోరుతూ వారి అనుమతికై వారింటికి వెళ్ళాము. 'స్నానం చేస్తున్నారు,కూర్చోండి'అని ఆహ్వానించారు వారి శ్రీమతి...ఉదయం 11-30 దాటుతోంది...ఈలోగా రా.కృ.గారు వచ్చారు. వస్తూనే...'నేను అన్ని పేపర్లూ చదివేటప్పటికి ఈ టైమవుతుంది. రోజూ పేపర్లు చదివాకనే స్నానం చేస్తా..ముందు చెయ్యను..'. మా Q మార్కు ముఖాలు చూసి...'అవునండీ..ఆ పేపర్లనిండా చావు కబుర్లేకదండీ మరి'..చిరునవ్వుతో చెప్పారు. మాకు మాత్రం నవ్వు ఆగలేదు. .
వీరి తండ్రిగారు హాస్యబ్రహ్మ భమిడిపాటి కామేశ్వరరావుగారు.మనిషి కొంచెం సీరియస్ గా వుండేవారట...జోక్ వేసినప్పుడు కూడా అంతే. పైగాజోక్ వేసేవాడు జోక్ వేస్తూ నవ్వితే, వడ్డించేవాళ్ళు ఒక చేత్తో తింటూ వడ్డించినట్టు వుంటుందంటారుశ్రీ రావుగారు.
రా.కృ.గారు కాలేజీలో చదువుకొనే రోజుల్లో ఒకసారి మునిమాణిక్యం వారు వీరింటికి వచ్చారట. టీచర్ ట్రైనింగు శ్రీ ము.నగారు
రాజమండ్రిలో చేసారు. ముందు గదిలో శ్రీ కా.గారూ ఈయనా ఏదో ముచ్చటించుకుంటున్నారు. మధ్యలోము.న.గారు బయటికి వెళ్ళబోయారుట...అప్పుడు కా.గారు వార్ని వారిస్తూ...'మేష్టారూ! మీరు సిగరెట్లకోసం అయితే వెళ్ళకండి'అన్నారు. ఆయనకు సిగరెట్
అలవాటు. 'వుండండి చెప్తాను' అని 'కృష్ణా! మేష్టారికి నీదగ్గర సిగరెట్టు ఒకటి యియ్యరా!' అని కొడుకునడిగారట రావుగారు.
'అయ్యో అలా అడిగేసారు అబ్బాయి ఏమన్నా అనుకుంటాడేమో అని న.గారంటే 'అబ్బే!ఎందుకనుకుంటాడు. ఈ మధ్య..జామాకులు
అవీ నమలుతున్నాడు.' అన్నారటహాస్యబ్రహ్మ...ఈ విషయం చెప్పి'నాన్నగారి అబ్సర్వేషన్ అమోఘము.'అని తండ్రిని తలచుకున్నారు
రా.కృ గారు. రా.కృ.గారుతర్వాత మానేసారట పాపం, యేమిటీ సిగరెట్సా ? కాదట!..మరీ?...జామాకులుతినడం...
రంగస్థలంనుండి వచ్చిన ఈ నాటి నటులు చాలామంది రా.కృగారు కాని భ.కా.గారు కాని వ్రాసిన నాటికలతోనే నటప్రవేశము చేస్తూవుంటారు అనడం అతిశయోక్తి కాదు. తాను వ్రాసిన 'కీర్తిశేషులు'నాటకానికి ఉత్తమ రచనబహుమతి వచ్చిందని తండ్రిగార్కి చెప్తే...'ఒహో!
నీకన్నాచెత్తగా వ్రాసే రచయితలున్నారన్నమాట.' అన్నారట ఆయన. పిల్లల్ని ప్రత్యక్షంగా పొగడరు కొందరు తండ్రులు..
రా.కృ.గార్కి లెక్కలు ఇంట్రెస్ట్. ఆ అభిమానంతోనే లెక్కల్లో కృషి చేసారు..తెలుగు అక్షరాలలో అ మొదలుకుని క్ష వరకూ గుణింతాలు, ద్విత్వాలు,సంయుక్తాలు అన్నింటికి సంఖ్యలు ఇచ్చుకుంటూ వస్తే, క్ష పూర్తయ్యేసరికి మొత్తం 29 లక్షలు అయిందట...
వాటి ఆధారంగా మన పేరుని విశ్లేషించి భవిషత్ చెప్పేవారు రా.కృగారు..ఎందరో సినీమా వారికికూడా చెప్పారు...
మన వ్యావహారిక నామాలు కాకతాళీయంకాదని అవి భగవన్నిర్ణయాలు అంటారు రా.కృ గారు. వీరు సినీమాలకు రచనలు చేసినా ..ఆ సినీమాలోక ప్రభావం తనవారిమీద పడనీయలేదు....ఓ సారి వీరి ఇంటజరిగిన ఓ శుభకార్యానికి మహానటి భానుమతిగార్ని పిలిచారట.
ఏవో కారణాలవలన ఆమె రాలేక పోయి..తర్వాత వీరింటికి మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చారు. వీరి శ్రీమతి తలుపు తీసి
'కూర్చోండి వస్తారు' అని 'ఎవరు వచ్చారు అని చెప్పను'అని అడిగారట..తనను తెలియనివారు తెలుగునేల వుండరు అన్న తన
నమ్మకం ఈ రోజు వమ్మైంది అని రా.కృ గారితోభానుమతిగారు అన్నారట. గత మాసంలో శ్రీ రాధాకృష్ణగారి జయంతి.

హైదరాబాదులో వున్నప్పుడు ఓ ఉగాదినాడు శ్రీ దివాకర్ల వెంకటావధానిగార్కి పండితసన్మానం చేసారు..నిర్వాహకులు వారిని ఆహ్వానిస్తూ శ్రీ అవధానిగార్నిపుంభావ సరస్వతిగా ప్రస్తావించారు...వీరు మాట్లాడుతూ "ఇలాగేనండి..చాలామంది నన్ను పురుషాకృతి దాల్చిన సరస్వతీ దేవిగా సంభావిస్తారు.సంగీతం, సాహిత్యం అమ్మవారికి స్తనద్వయమండి...పురుషాకృతిలో వాటికి అభావంకదండీ..అంచేత వీరు చెప్పేది నా పట్ల నిజమే అనిపిస్తుందండి...సంగీతం,సాహిత్యం నాకు యేం వచ్చండి మరి?" నిర్వాహకులను నిరుత్సాహపరచకుండా తర్వాత మరల సర్ది చెప్పారనుకోండి.



Sunday, December 5, 2010

ఉపవాసమా? అంటే





వెంకట్రావ్! నీరసంగా కనపడుతున్నావు. ఉపవాసమా యేంటి?


అవునోయ్ గుర్నాధం? కార్తీక సోమవారం కదా...ఇదేఆఖరువారం కూడాను...మరి నువ్వు లేవా?


ఉపవాసాలా..నేనా...థ్రాష్.. మా ఆవిడవుంటుంది..వద్దన్నా వినదు. అయినా వెంకట్రావ్! అసలు


ఉపవాసమంటే ఏమిటి? భగవంతుడికి దగ్గరగా వుండడం..అంతేకాని భోజనం మానేయడం కాదు.


అది తెలుసుకోరు మీలాంటి వాళ్ళు...ఏమిటో మీ ఛాదస్తం.


నిజమే! ఇలాంటి గుర్నాధాలు అలాంటి వెంకట్రావులు మనకి తారసపడుతూనే వుంటారు.... ఇంత


వేదాంతం తెలుగు వాళ్ళమేచెప్పగలము...(మిగతా వారి సంగతి అంతగా నాకు తెలియదనుకోండీ).


దేముడికి దగ్గరగా వుండాలంటే ఏమిటి ?తిరుమలే వెళ్ళామనుకుందాం! ముందు మనం చూసేది


దేముణ్ణికాదు... ముందు బస తర్వాత ఫుడ్..తర్వాత తిరుగు ప్రయాణానికి యేర్పాటు అన్నీ


అయ్యాకనే దర్శనం అంతేకదా..అప్పుడు తోసుకుంటూ..తోసుకుంటూ ఆ క్యూలంబడి పోయి పోయి


గర్భగుడిలో వాలంటీర్లు...నడవండి..నడవండి అంటూ తొయ్యడం...యిక చాలు రండమ్మాఅని లాగడం...


'నడవండీ', 'చాలురండి' .. ఈ రెండుశబ్దాల నడుమ పెరుమాళ్ళ దర్శనం..రెండు ఆలోచనల మధ్య


చిద్దర్శనంలాగా...అయిందా!... లేదా!... ఏమో!.....ఆ కాసేపూ ఓ దివ్యానుభూతి.వెంటనే మాయ


కప్పేస్తుంది..."చూడనీయవయ్యా. బొత్తిగా ఇక్కడే త్రిప్పేసారు..పాపం మూటకట్టుకుంటున్నారు "...


మన సంస్కారాన్నిబట్టి రకరకాలుగా అభిప్రాయాలని కసిగా వెడలగక్కి...హుండీలో మ్రొక్కుబడులు...


అమ్మయ్యా పాపాలు పోయాయి...(మళ్ళీ క్రొత్తవి చెయ్యొచ్చు అన్నమాట)...అందరికీ అసంతృప్తే..


వెంకన్నబాబు అంటే గుడిలో వున్న వెంకన్నబాబుదర్శనం సరిగా కాలేదని....


ఓ సారి శ్రీవారి సేవా కార్యక్రమానికి వారంరోజులు వెళ్ళాము నేనూ మా శ్రీమతీ. అక్కడుండగా మా


శ్రీమతికి జ్వరం వచ్చింది.మేమున్న 'రామ్ బగీచా' వాళ్ళకి విషయంచెప్పి ఎవరైనా డాక్టరుంటారా


దగ్గరలో అని అడిగా టిటిడి హాస్పటల్ కి వెళ్ళమన్నాడు...ఎలావెళ్ళాలి అన్నా...అదిగో అక్కడ


ఆమ్బులేన్సే వుంది వెళ్ళి చెప్పు, వస్తాడన్నాడు...ఈ చిన్నదానికి ఆంబులెన్సా.....వస్తాడో రాడో


అని సందేహిస్తూనే ఆ ఆంబులెన్స్ డ్రైవరును అడిగా! వెంటనే వచ్చాడు..మమ్మల్ని హాస్పిటల్ కి


తీసుకువెళ్ళాడు. తానే ఓ.పీ వ్రాయించాడు..డాక్టరు దగ్గరకి కూడా వచ్చాడు..ఆయన మందులు


యిచ్చి..యింజషన్ చేసేదాకా దగ్గరున్నాడు.అరగంట వుండివెళ్ళమన్నారు డాక్టరు.. అప్పుడు మళ్ళా


యెవరైనా పిలుస్తారేమో అని చెప్పి; నర్సుతో చెప్తే తిరిగి వెళ్ళడానికి యింకో ఆంబులెన్స్ యేర్పాటు


చేస్తారని కూడా చెప్పి; అప్పుడు వెళ్ళాడు ఆ డ్రైవర్. తర్వాత అక్కడవున్ననర్సు ఇంకో ఆంబులెన్స్ కు


చెప్పారు....ఎవరూ కూడా డబ్బులు ఇస్తానన్నా పుచ్చుకోలేదు......స్వామి లఘుదర్శనమా..


మహాలఘా..వాళ్ళు లాగేసారా .....వీళ్ళు తోసేసారా అన్నీ మరచిపోయాము....ఎవరు ఎవరిదగ్గర


వున్నారు..దేముడి దగ్గర మనమా...మన బాగోగులు అనుక్షణం చూస్తూమనదగ్గర ఆయనా? ..


ఉచిత భోజనాలు దగ్గర...ఎంతమందో అలా వస్తూనే వుంటారు.. సాపడుతూనే వుంటారు...ఎంత వైభవం


...మొదటి రోజు మేం సేవా కార్యక్రమంలో వుండగాఓ ఆలయ వుద్యోగి అక్కడికి వచ్చాడు.మాట తీరూ అదీ


చూస్తే ఒక ఆకర్షణ..అతడు జనాంతికంగా అన్నాడు..మీరు ఇక్కడ భక్తులకు భోజనం వడ్డించే ఈ సేవ


స్వామి అనుగ్రహం వలన దొరికింది.కాలికి చెప్పులు లేకుండా,ఓ పవిత్ర కార్యక్రమంగా భావించి వడ్డించండి


అనిచెప్పాడు..క్రింద నిజానికి సాంబారూ అవీ పడి కొంచెం ఇబ్బందిగా వున్నా మేంఇద్దరమూ చెప్పులు


లేకుండానే వడ్డించాము పవిత్ర భావంతో...మేంవచ్చేసేరోజు అతడు మళ్ళీ వచ్చాడు...ఆ రోజు బుధవారం..


ఆ రోజు స్వామికిమూలవిరాట్ నుండి ఒక పవిత్రసూత్రం తీసుకువచ్చి ముందు మంటపంలో(రాములవారి


మేడ అంటారు)వేంచేసివున్న ఉత్సవమూర్తులకు కట్టి, ఆ ఉత్సవమూర్తులకు అభిషేకంచేస్తారట...కార్యక్రమం


పూర్తయ్యాక అపురూపమైన ఆపవిత్రసూత్రంప్రసాదభావంతో ముఖ్యులైనవారు స్వీకరిస్తారట...ఆ అభిషేకానికి


ఇందాక ప్రస్తావించిన ఉద్యోగి వెళ్ళి ఆ పవిత్ర సూత్రంముక్కతెచ్చి...మా ఇద్దర్నీ పిలిచి మాకు ఇచ్చాడు...


యెందుకంటే చెప్పులువదలి సేవ చేసామని. అంతేకాదు మూలవిరాట్ పాదాల మీది అక్షతలు మా చేతిలో


వుంచాడు...మన కదలికలు సదా కనిపెట్టే స్వామి దగ్గర మనం వుండాలా? ఉండగలమా?.


సరే పూమాలలు తయారుచేసే చోటికి సేవకై వెళ్ళాము.ఎన్ని పూలు..యెన్నెన్ని పూలు... బస్తాలతో వచ్చి


పడిపోతూనే వుంటాయి. దేశం నలుమూలలనించీ భక్తులు సమర్పించినవే స్వామి పూలవనంలోవి కావు..


ఒక్కోగజమాల ఒక గంటసేపు స్వామి గళసీమ నలంకరిస్తుందట..మేమందించే యేఒక్క పుష్పమైనా మా


కబురు స్వామి చెవిని వేసినా చాలు కదా...మనస్సులో ఏదో చెప్పలేని ఆనందం..యేదో మధురాతి


మధుర భావం ....అదంతా శ్రీనాథునివైభవమేకదా....


వైకుంఠ క్యూకాంప్లెక్సులో టిఫిన్ భక్తులకు అందించేసేవ. గోవిందుని దివ్యనామ సంకీర్తనతో పరవశించే


భక్తకోటికి సేవచేయగలిగే అవకాశము ఆస్వామి కల్పించిందే కదా..పాపనాశనం జలధారలలో,


కపిలతీర్థంలోని తీర్థజలాలలో, వికసించిన పూలతోటలలో, చెట్టుచేమలలో, కొండంతా తిరుగాడే


భక్త జనుల కోలాహలంలో....యెలుగెత్తి అరచే గోవిందనామంలో యెక్కడ లేడు - కొండంతా ఆ


యేడుకొండలవాని వైభవం కనపడుతూనే వుంటుంది..అలా చూడగలగడమే ఆయన దగ్గరగా వుండడం...


ఉపవసించడం.... కాదంటారా