Pages

Friday, December 30, 2011




స్వాగతం...క్రొత్త సంవత్సరానికి స్వాగతం

Sunday, December 18, 2011

ప్రయాగ, అయోధ్య, నైమిశారణ్యం.... యాత్ర













ప్రయాగ ,,, అయోధ్య ,,, నైమిశారణ్యం,,,, (ఈ మధ్య ఒక 25రోజులు చేసిన మా తీర్థ యాత్రలగురించి వ్రాసిన వ్యాసాలలో ఇది మూడవది, ఆఖరుది. మా ఆనందం అందరితోనూ పంచుకోవాలనే తపన...అందుకీ ప్రయత్నం......)

ఉదయం అయిదుగంటలు దాటాక మా పన్నెండుమంది బృందం కాశీనుంచి బయల్దేరింది.. మేమంతా పరస్పరం బంధువులమే బీరకాయ పీచు. బృందావనం, కాశీ ఐన తర్వాత ప్రయాగ, అయోధ్య, నైమిశారణ్యం కలిసి ప్రయాణించామన్నమాట. ముందుగా మా మితృని ద్వారా కాశీనుంచి. ఒక "ట్రావెలర్" వేన్ కుదుర్చుకున్నాము.. అందులో పదముగ్గురు కూర్చోవచ్చు.. మీటర్ లెక్కన మాట్లాడాము..కారు 15 తేదీ బయల్దేరే ముందు మా రథసారధి హిందీలో ఉవాచ.."స్పీడో మీటర్ చాలూ నహీఁ సాబ్, కరాబ్ హో గయా".. మేమూ కూసింతసేపు "అబ్ క్యా కరనా హైఁ" అని హిందీలో బాధపడినవారమై.. "చలో" అనక తప్పిందికాదు. దారిలో ఉన్న సైను బోర్డులు, మైలు రాళ్ళూ ఆధారంగా దూరాలు కొల్చుకుంటూ, రథచోదకుడు చెప్పినదాన్ని మా అంకెలతో సరిపెట్టుకుని, ..బేరాలాడి..,మొత్తానికి డబ్బులు సెటిల్ చేసి, వాణ్ణి అక్కడ హిందీలోనే వదిలేసి ఇబ్బందిలేకుండా మన తెలుగుబండి ఎక్కామనుకోండి..
సరే
విషయానికొద్దాము.....

కాశీ
నుంచి ప్రయాగ చేరేసరికి ఉదయం సుమారు పది అయింది.. డైరెక్ట్ గా త్రివేణి సంగమానికి వెళ్ళాము.. హరిజగన్నాధశాస్త్రిగారు ప్రయాగలో పేరున్న పురోహితులు.. తెలుగువారు. ప్రస్తుతం వయసురీత్యా పెద్దవారవడం వలన వారి కుమారులు అక్కడ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు... వారితో ముందుగానే ఫోనులో మాట్లాడాం కనుక వారు చెప్పిన ప్రకారము రేవులో వారిని కలిసాము. సంగమస్నానానికి చిన్న నావలో పంపించారు.
నది
మధ్యలోకి వెళ్తుంటే తెల్లటి పక్షులు గుంపులు గుంపులుగా నదీజలాల అలలలో తేలియాడుతూ నయనానందకరంగా కనపడ్డాయి.. పడవల్లోకివచ్చి అమ్మిన కారప్పూస ప్యాకట్టులలోని కారప్పూస నీటిపైన జల్లి .. "దాఁ" "దాఁ" అని పిలిస్తే తెల్లటి నీటి అలలపై పాలనురుగుల్లాంటి రెక్కలు విప్పుకుని ఎగురుతూ వచ్చి కారప్పూస పలుకుల్ని నీటిలో మునగకుండానే కరుచుకు పోతాయి.
ఇంకా
ముందుకుపోయాక సంగమము.. శివుని జటాజూటం నుంచి..వెలువడ్డ గంగమ్మ ప్రక్క స్వచ్ఛంగా .. తెల్లగా ... చలాకీగా సాగుతూ ఉంటుంది ... కిష్టయ్యను సేవించడం వలన నల్లబడ్డదా అన్నట్టు నల్లని యమున గంగను జేర సంకోచంగా వస్తున్నట్టు రెండవ ప్రక్కనుంచి మెలమెల్లగా వస్తుంది. తెల్లటి శివయ్యా.. నల్లటి కిష్టయ్య.. తెల్లటి గంగమ్మ .. నల్లటి యమునమ్మ.. దృశ్యం నయన మనోహరము.. అంతర్వాహిని సరస్వతి కాళ్ళకు చల్లగా తగులుతుంది ... త్రివేణి సంగమం భరతభూమికి క్షేత్రమాహత్మ్యము కల్పిస్తున్నది.. కనపడే రెండునదులు --కనపడనిది ఒకటి... నదుల త్రివేణీ సంగమంలో .. దానికి ప్రతీకగా....కనపడని ఒక పాయ కనపడే రెండు పాయలతో అల్లబడిన నల్లని వేణిని దానం చేస్తారు.. కురులు సంగమంలో వదిలితే నీటిపై తేలకుండా క్రిందకు పోవడం అక్కడ విశేషం...
వేణీ
దానానికి ముందు దంపతులు చేసే పూజ తంతు భలే బావుంటుంది... అది వయసులో ఉన్నవాళ్ళు చేస్తే ఫరవాలేదు.. వయసు పెరిగిన వాళ్ళు చేస్తే..చూడముచ్చట. వయసురీత్యా రకరకాల ఆకారాలు... రకరకాల కేశ సంపదలు...దృష్టి మాంద్యాలు.. భార్యా భర్తలు కాళ్ళకు పారాణి పరస్పరం దిద్దాలన్నా, ఒళ్ళో భార్యని కూర్చోబెట్టుకుని ఆమెకు జడ వేయాలన్నా--అసలు వళ్ళో భార్యామణిని కూర్చోబెట్టుకోవలన్నా వయస్సు భారం, సహకరించని అవయవాలు .. ఏదో చేయాలన్న ఆరాటం .. సరిగా చేయలేకపోతున్నామనే అసంతృప్తి. రక రకాల జంటలను ఏక తాటిపై నడిపించే ప్రయత్నంలో బ్రహ్మగారు.. చోద్యం చిత్రీకరించే కేమెరాలు, హేండీకామ్ లు పట్టుకుని కూడా వచ్చిన బందుగుల కోలాహలం..... సందడిగా రేవుదగ్గర కార్యక్రమాలు ముగించుకుని.. భోజనాదులు పూర్తి చేసుకుని...
శంకరమఠం
.. తర్వాత లలితాదేవి ఆలయం చూసాము. ఇది శక్తిపీఠం.. చెయ్యిపడిన ప్రదేశం.. ఒక నూతిలో పడినదట.. గర్భగుడిలో నూయి..దానికి పూజాదికములు... తర్వాత బడే హనుమాన్.. పెద్ద విగ్రహం. మహిరావణుని చంఫి రామలక్ష్మణుల తన భుజాలపై తెచ్చిన హనుమ సుందర రూపం.. పడుకున్న భంగిమలో ఉంటుంది.. పూలమాలలతో నిండి మోము మాత్రం చూపే స్వామి మరునాటి ఉదయం పూర్తిగా దర్శనమిచ్చాడు... ఆనందభవన్ (నెహ్రూగారి జన్మస్థలి) బయటినుంచే చూసాము.
రాత్రికక్కడ ఆగి మరునాటి ఉదయమే అయోధ్యకు బయల్దేరాము. అయోధ్యలో సరయూనదీ జలాలు కేవలం మార్జనమే చేసుకున్నాము.. విపరీతమైన రక్షణ వలయంలో ఉన్న బాలరాముణ్ణి చూసాము.. మనదేవుణ్ణి మనం చూడడానికి విపరీతమైన ఆంక్షలు.. బాల్ పెన్, జేబు దువ్వెన తో సహా అక్కడ అనుమతించరు.. రామదర్శనమంటే అంత కష్టమా... అంత సులభంగా దొరుకుతాడా శ్రీరాముడు. క్రొత్త దేవాలయానికి పాలరాతి కట్టడములు తయారవుతున్నాయి.. ఎన్నో దేశాలభక్తులు తమ సంసిద్ధతకు ప్రతీకగా ఇటుకలు సమర్పించారు.. కోర్టు అనుమతి దొరకగానే 24 గంటల వ్యవధిలో శ్రీరాముని దివ్యధామం సిద్ధమౌతుందట.. దానికి సిమ్మెంట్, కాంక్రీటు అక్కరలేని అధునాతన పద్ధతిలో నిలబెట్తారట.. రామాలయ నిర్మాణ పూర్తయ్యేవరకు భోజనం చేయనని సరయూనదీ జలాలతో సంకల్పించి.. పదహారు సంవత్సరాలనుండి కేవలం పాలు పళ్ళ తీసుకుంటూ దీక్షలో ఉన్న ఒక స్వామీజీని చూసాము. అయోధ్య యాత్ర ముగించుకుని నైమిశారణ్యం బయల్దేరాం.
లక్నోకు
సుమారు వంద కిలోమీటర్ల దూరంలో నైమిశారణ్యం. అక్కడ వనమే భగవత్స్వరూపం.. అన్ని పురాణాలలోను నైమిశారణ్య ప్రస్తావన ఉంటుంది.. సుదర్శనం యొక్క నేమి (అంచు) వలన ఏర్పడ్డ తటాకం చక్రతీర్థం ఉంది.. దాని చుట్టూ ఉన్న అరణ్యం నైమిశారణ్యం అని ఒక కథ.. అక్కడ గోమతి నది.. మేం నైమిశారణ్యం చేరే సమయానికి చీకటి పడింది.. బాలాజీమందిర్ లో ఉన్న మాతాజీ మాకు ఆశ్రయమిచ్చారు.. మా బృందానికి నాలుగు విశాలమైన గదులు ఏర్పాటు చేసారు.. రాత్రికి మాకు భోజనం ఏర్పాటు చేసారు.. ఆప్యాయంగా పలకరించారు.. మరునాటి ఉదయం గోమతిలో స్నానం చేసి... వ్యాసగద్దె, సూతగద్దె,దేవరాజేశ్వరమందిరం, ఆనందమయి ఆశ్రమం,సేతుబంధరామేశ్వరం, మొదలైనవి చూసాము.. మాతాజీ ఆధ్వర్యవంలో సత్యనారాయణ వ్రతం చాలా చక్కగా తృప్తిగా చేసుకున్నాము.. రుద్రావర్తము అని ఒక ప్రదేశం ఉంది. .. అక్కడ నీటిలో పాలు అభిషేకిస్తే పాలు నీటిలో కలవకుండా క్రిందకువెళ్ళిపోతాయట.. అడుగున శివమూర్తి ఉన్నదట...చూడలేకపోయాము. రాత్రికి కూడా ఉన్నాము.. మరునాడు... ఉదయకాంతులలో ,, మంచుకురుస్తుండగా వనశొభ మనస్సుకు ఏదో తెలియని ఆనందాన్నిచ్చింది..
మాతాజీ
దగ్గర శలవు తీసుకుని బృందావనమాదిగా నైమిశారణ్యం వరకు అనుభవమైన మధురానుభూతుల మనస్సులో భద్రపరచుకుని లక్నో సాయంత్రానికి చేరాము.. అక్కడనుండి లక్నో టు యశ్వంతపూర్ ఎక్స్ ప్రెస్ లో స్వస్థల ప్రస్థానం...

మన
ఇంటిలో లాగున ఎక్కడా ఉండదు.. ఇబ్బందులు ఉంటాయి.. నచ్చని భోజనాలు తప్పవు.. మెచ్చని బసలో కాపురాలు తప్పవు..బలహీనతను ఆసరాగా తీసుకుని ఆటో రిక్షా మొదలుకుని దైవసాన్నిధ్యం వరకు తటస్థపడుతూ దోచే దొంగలుంటారు.. ఇచ్చినడబ్బులకి చేయవలసిన సేవలందించని దొర (దొంగ) ప్రభుత్వాల వైఫల్యాలు ప్రతిచోటా కనపడుతూనే ఉంటాయి. రైలు పెట్టెలలో కనీస శుభ్రత పాటించని మనలాంటి ప్రయాణీకులు... టిక్కట్..రిజర్వేషన్ లేకుండా దర్జాగా ప్రయాణించే ప్రభృతులు.. వారిని ఏమీ అనని రైల్వే అధికారులు...

ఇవన్నీ
మరచిపోవాలి.. కేవలం భగవంతుణ్ణే భావించాలి.. ఆయననే ధ్యానించాలి... ఆయననే సేవించాలి.. అప్పుడే కష్టాలు మనసుకి పట్టని స్థితి వస్తుంది .. స్థితిలో మనసులో కొలువైఉన్న భగవంతుని అనుభవం తథ్యం... మనం నమ్మి "ఏమిటయ్యా ఇది స్వామీ" అనకుండానే ఆయన సాయం ఏదో రూపంలో మనకి అందుతుంది.. పొందిన అనుభవం మన గొప్ప అనుకోకుండా ఆయన దయ అని తెలుసుకోగలిగితే అదే భగవత్సాక్షాత్కారం....

Sunday, December 11, 2011

తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు


తెలుగు బ్లాగు స్వంతదారుగా (dvhrao.blogspot.com) తెలుగు బ్లాగుల దినోత్సవ శుభసమయాన తెలుగు బ్లాగులు నిర్వహిస్తున్న సహబ్లాగర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేసుకుంటున్నాను.....

Friday, December 9, 2011

కాశీ ప్రయాణం ... కాశీ - 2






సంకట మోచన హనుమాన్ ఆలయం.. తులసీదాస్ నిర్మించిన ఆలయం.. శైవ వైష్ణవ బేధాలు విపరీతంగా ఉన్నప్పుడు జన్మించిన తులసీదాస్ కారణ జన్ముడు... హనుమ సాక్షాత్కారంపొంది ఆ స్వామి సహాయంతో శ్రీరామదర్శనం పొందిన గోస్వామి తులసీదాస్ శ్రీరామచరితమానస్ గ్రంథం వ్రాసారు.. అందులో సాక్షాత్తూ శివుడు శ్రీరామకథను పార్వతికి వినిపిస్తాడు.. స్థానికులు మాటలాడే అవధీ భాషలో ఆ గ్రంథాన్ని వ్రాయడం ఒక విశేషం. అది ఆ మహనీయుని సామాజిక స్పృహ..అక్కడ పండితపామరులు సైతం శ్రీరామచరితమానస్ నిత్యం పఠిస్తారు... అలవోకగా గానంచేస్తారు...బిల్వదళాలపై సిందూరంతో "శ్రీరామ" అని వ్రాసి కాశీవిశ్వనాథుని పూజిస్తారు ఈ నాటికీ.. కార్తీక శుద్ధ చతుర్థినాడు బిందుమాధవుని బిల్వదళాలతోనూ, కాశీవిశ్వనాథుని తులసీదళాలతోను అర్చించడం శివునికి విష్ణువుకీ అబేధమని చెప్పడానికే.. ఆ పూజ బిందుమాధవుని ఆలయంలో చూసే భాగ్యం కలిగింది. సంకటమోచన హనుమాన్ ఆలయం లోపలకి వెళ్తుంటే కిష్కింధలోంచి ప్రయాణమే. కోతులు ఆప్యాయంగా పలకరిస్తూనే ఉంటాయి. ఓ కోతి నా అంత ఎత్తుగా లేచి నాదగ్గరగా వచ్చి నా చేతిలో స్వామికోసం తీసుకెడుతున్న దండ లాక్కోబోయింది.. నే నివ్వనని పెనుగులాడా.. ఆ దండలోని ఓ పుష్పాన్ని పట్టుకు పోయింది...ఆ కోతి. కాశీలో శివునితో సమానంగా హనుమ విగ్రహాలు ప్రతిష్టింప బడ్డాయేమో అనిపిస్తుంది... మణికర్ణికా ఘట్టంలో దేవతలు సయితం మధ్యాహ్న సమయంలో గంగా స్నానం చేస్తారుట. ఆ సమయంలో అక్కడ స్నానం చేసాము.. తిలభాండేశ్వరుని, గౌడీ మాతను దర్శించాము. ఎవరో ఇల్లాలు వంగనారు పోస్తే లింగనారు వచ్చింది అని చెప్పబడే జంగంబాడీలోని శివమూర్తులను చూసాము ... లోలార్క కుండ్ లో స్నానం ఓ ఆనందానుభూతి. అక్కడకు దగ్గరలోని అస్సి ఘాట్ లో తులసీదాసుకు హనుమ దర్శన మిచ్చినచోటు, గోస్వామి పాదుకలు మొ.నవి చూసాను. హనుమాన్ ఘాట్ దగ్గర కంచి పీఠానికి దగ్గరలో ప్రఖ్యాత సంగీత విద్వాంసుడు ముత్తుస్వామి దీక్షితార్ యొక్క గురువుగారి సమాధి ఉంది. ఆ గురువుగారు దీక్షితార్ చిన్నవయసులో ఉన్నప్పుడు వారుండే గ్రామానికి వెళ్ళి తలిదండ్రులను అడిగి దీక్షితార్ ను తనతో తీసుకువచ్చారట.. తన దగ్గర సంగీతం నేర్పడమే కాకుండా శిష్యునిచేత శ్రీచక్రార్చన చేయించెడివారు.. ముత్తుస్వామి దీక్షితులు ఒకసారి తనకు అమ్మ దర్శనభాగ్యం లేదా అని గురువుగార్ని అడిగారు.. సాధన చెయ్యరా అన్నారుట గురువుగారు.. ఒక రోజు గంగాస్నానం చేస్తూ ముత్తుస్వామి దీక్షితార్ రెండు మునకలు వేసి మూడవ మునక వేసి లేచే టప్పటికి అతడి చేతిలో ఒక వీణ ఉన్నదట.. ఆశ్చర్యచకితుడయి శిష్యుడు పైకి చూసేసరికి మెట్లమీదుగా గురువుగారు దిగుతూ "ఏరా అమ్మ అనుగ్రహించిందా" అన్నారుట.. అద్భుతమైన వీణను చూపించాడు శిష్యుడు పరవశంతో... (కమాను సాధారణంగా క్రిందభాగానికి వంగి ఉంటుందట కాని ఆ వీణకమాను పైకి ఒంగి ఉందట.. ఆ వీణ ఇప్పుడు చెన్నైలో ఉన్నదట..) గురువుగారు నవ్వి శిష్యుని భుజం ఆప్యాయంగా తట్టి నదిలో స్నానానికని దిగారు... "వస్తానురా" అని శిష్యునికి అక్కడినుంచే చెప్పి జలసమాధిలో తనువు చాలించారు.. ఆయన పార్థివ శరీరాన్ని కాశీలో తర్వాత సమాధి చేసారు. కార్తీక పున్నమి ఉత్తరాదిని "దేవదీపావళి"గా జరుపుకుంటారు...గంగానదీ తీరంలో ఉన్న ప్రతి ఘాట్ లోనూ దీపాలు పెట్తారు.. విద్యుద్దీపాలతో అలంకరిస్తారు. బాణసంచా విపరీతంగా కాలుస్తారు... ఆ వెలుగుల ఉత్సవాన్ని పడవ చేసుకుని గంగానదిలో తిరుగుతూ చూసి ఆనందించాము. "కాశీలో ప్రతి ఇసుకరేణువూ శివలింగమే" అంటారు గురువుగారు... నేను ఇక్కడ వ్రాసిన కాశీ విశేషాలు శ్రీశర్మగారి నోట విన్నవే.. శివుడుకూడా లెక్కించలేడట కాశీలో ఉన్న శివలింగాల్ని... "కాశీ" అని అంటే చాలు కైవల్యమే,,,,పరమ శివునికి ఈ క్షేత్రమంటే పరమప్రీతి.. ప్రళయకాలంలో కూడా తన త్రిశూలంతో ఈ క్షేత్రాన్ని పైకెత్తి పట్టుకుంటాడట...కాశీలో మరణం జన్మరాహిత్యమే.. ఇక్కడ మరణించిన జీవులకు పరమేశ్వరుడు కుడి చెవిలో తారకమంత్రం ఉపదేశిస్తాడట.. అమ్మ తన పమిటతో ఆ జీవునికి విసురుతుందట.. గణపతి, కుమారస్వామి పరిచర్యలు చేస్తారట.... కాశీ మరణంవలన సంసార పాశబద్ధులై జననమరణచక్రంలో పడికొట్టుకునే ఆ జీవుల పాశాలను అమ్మ విప్పేస్తే పరమేశ్వరుడు వారికి కైవల్యప్రాప్తి కలిగిస్తాడు... తన అంతర్ దృష్టి తో ఆ విషయం చూసి గ్రంథస్థం చేశారు రామకృష్ణపరమహంస. కాశీ ఒక్కటే మహా శ్మశానంగా చెప్పబడుతున్నది... ఆనందంగా శివుడు ఇక్కడ విహరిస్తూ ఉంటాడు.. ప్రతి పూజాసంకల్పంలోనూ, స్నాన సంకల్పాలలోనూ "ఆనందకాననే మహా శ్మశానే" అని పండితులు అదే చెప్తారు.. అలా వింటూ ఉంటే ఏదో ఆనందానుభూతి... ఈ యాత్రలో సన్యాసి జీవనం గడుపుతున్న ఒక స్వామి ఓరోజు కనపడ్డారు. అప్పుడు నేను గురువుగారితో ఉన్నాను. గురువుగారు వారికి తెలుసు. ఆయన గత చాలా కాలంగా కాశీలో ఉంటున్నారు. ఆయన ప్రసంగ వశాత్తు చెప్పారు. కాశీలో ఎన్నో రహస్యాలున్నాయిట. లలితాంబ ఆలయం గంగ ఒడ్డున ఉన్నది.. అక్కడ రాత్రిళ్ళు ధ్యానం చేస్తే విశ్వనాథుని సేవించడానికి గంగానదిలోంచి వచ్చే దివ్యయోగినులు దివ్యలోకాలనుంచి రావడం దృశ్యమౌతుందట. నాగకన్యలు నిత్యమూ ఓంకారేశ్వరుని అర్చిస్తారట... దత్తాత్రేయులవారు ఆ పుణ్యభూమిలో నిత్యమూ విహరిస్తారట.. భావజగత్తునుండి చూస్తే ఇలాంటి అద్భుతాలు కన్నులకు గోచరమవుతాయట. ఏవిధమైన నమ్మకంలేకుండా ఆ దివ్యక్షేత్రంలో దేశదిమ్మరిలా తిరిగినా జన్మరాహిత్యం తధ్యం.. అన్నారాయన...మనకి కనపడవేమిటి అనే ప్రశ్న సహజం. కాని మనకున్న అర్హత ఏమిటి? అని అనిపించదు..... తపించాలి.. తపిస్తే.... తపిస్తే....ఆయన అనుగ్రహం.... మనక్షేత్రాలు కేవలం విహార ప్రదేశాలు కాదు... అవి దివ్యానుభూతులు కలగజేసే దివ్యధామాలు. ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే ఆ దివ్యక్షేత్ర దర్శనం పూర్తి చేసుకుని గురువుగారు శ్రీ షణ్ముఖశర్మగారిదగ్గర శలవు తీసుకుని 15వతేదీ ఉదయం పన్నెండుమంది గల మా చిన్నిబృందం traveller van లో ప్రయాగ బయల్దేరింది.

Tuesday, December 6, 2011

కాశీ ప్రయాణం...కాశీలో ... 1





శ్రీ సామవేదం వారికి కాశీ అంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరమూ కాశీ వచ్చి ప్రవచనాలు చేస్తూ ఉంటారు..
సాధారణంగా కార్యక్రమాలు హైదరాబాదులోని మిత్ర బృందం నిర్వహణలో జరుగుతూ ఉంటాయి. .
ముందు ఏర్పాటు ప్రకారము మేము కూడా బృందావనంనుండి కాశీ నవంబర్ అయిదవతేదీకి చేరాము.
కేదరఘాట్ లో ఉన్న కుమార స్వామి మఠంలో మా బస. ఆరవ తేదినుంచి ప్రవచనాలు అక్కడనే. ఈసారి
"సూత సంహిత" విషయం.. కాశీ రావడం మా దంపతులకు ఇది మూడవ సారి. మూడుసార్లూ
శ్రీ షణ్ముఖశర్మగారి ప్రవచనాలు వినడానికే వచ్చాము. మొదటిసారి శ్రీ శర్మగారితో కలసి ప్రయాణము చేసాం ...
అదో అదృష్టం... మా ప్రమేయం లేకుండా కాశీ క్షేత్రంతో మాకు అనుబంధం ఏర్పడుతోంది...

కేదార్ ఘాట్ లో గంగా స్నానం ఉన్నన్నాళ్ళూ (మధ్యలో ఆరోగ్యరీత్యా నేను కొన్ని మిస్సయ్యాను) చేసాము.
కేదార్ నాథుని దర్శించాము. వెళ్ళగానే కాలభైరవుణ్ణి దర్శనం చేసుకుని "వచ్చా"మని చెప్పుకున్నాము..
అక్కడనే దండపాణి ఆలయం ఉంది.. ఐతే విశ్వనాథుని ఆలయానికి వెళ్తుంటే డుంఠి గణపతికి దగ్గరలో
ఉన్న దండపాణి్ ప్రాచీనమైనదట.. తర్వాత ఆస్వామిని దర్శనం చేసుకున్నాము కాలభైరవుని
దగ్గరలో కృత్తివాసేశ్వరుని, మహామృత్యుంజయుని చూసాము.

మహామృత్యుంజయుని ఆలయంలో వెనుక భాగాన ధన్వంతరీ కూపం. కలియుగం ప్రవేశించే
సమయంలో తనదగ్గరనున్న మూలికాసంపత్తిని కూపంలో వేసి ధన్వంతరి అవతారం
చాలించేడని పురాణ కథనం.. నూతిలోని జలం ఔషధ విశేషాలుగలదని తీర్థసేవనం చేస్తారు.. చేసాము.
వారాహీ దేవతను దర్శించాము.. ఆమె కాశీకి రక్షణ శక్తి. ఆమెను నేరుగా చూడకూడదు.. చూడలేము..
పైన ఏర్పాటు చేసిన కిటికీల్లోనుండి చూస్తే అమ్మ పాదాలు దర్శనమౌతాయి.

ఓంకారేశ్వరుని చూసాము.. ''కారేశ్వరుడు(బ్రహ్మ); ''కారేశ్వరుడు (విష్ణు); ''కారేశ్వరుడు (రుద్ర)
మూడు శివాలయాలు ఓంకారేశ్వరునిగా పురాణకాలంనుంచి ప్రసిద్ధి.. కాశీ మూడు ఖండాలుగా చెప్పబడుతున్నది.
ఓంకార ఖండము, కేదార ఖండము, కాశీ ఖండము. ఓంకార ఖండములోగల ప్రాచీన శివాలయాలు ప్రస్తుతము
ముస్లిముల నివసించే ప్రాంతంలో ఉన్నాయి. ఒక ఆలయం ఐతే ముస్లిముల గోరీల మధ్యలో గుట్టమీద ఉంది..
మూడు ఆలయాలు జీర్ణావస్థలో ఉన్నాయి. వీటి ప్రాశస్త్యము తెలిసిన శ్రీ షణ్ముఖ శర్మగారు పరిస్థితికి
చాలా ఆవేదన చెందారు. "ఒక ఆలయం నూతనంగా కట్టి విగ్రహ ప్రతిష్ట చేయడంకన్నా ఒక జీర్ణాలయ పునరుద్ధరణ
విశేష ఫలితాన్నిస్తుం"దని చెప్తూ గతంలో కాశీ వచ్చినప్పుడు ఉపన్యాసములలో ఆలయాలు పునరిద్ధరించాల్సిన
ఆవశ్యకతను ప్రస్తావించారు.. వారివంతుగా అధికమొత్తంలో సాయమందించారు. అప్పుడు స్పందించి ఎంతో మంది
తమ వంతు సాయాన్ని అందించారు.. స్పూర్తితో అప్పేశ్వరశాస్త్రిగారనే కాశీవాసి నడుంకట్టారు. అధికార అనధికార
ప్రభృతులను కలిసి అనుమతులు మంజూరుచేయించుకున్నారు,, స్థానికులను ఒప్పించారు. శారీరిక
మానసిక శ్రమ పడ్డారు..కాని ఆనందంగా భరించారు... మూడింటిలోనూ ఇప్పుడు "" కారేశ్వరుని ఆలయాన్ని
నవ్యాంగ సుందరంగా చేసి నవంబరు 5వతేదీ శ్రీ శర్మగారి చేతులమీదుగా కుంభాభిషేకం జరగటానికి కారకులయ్యారు.
మత్సోదరీ పార్క్ వద్దగల ఓంకార క్షేత్రం కాశీ యాత్రికులకు అవస్యం దర్శనీయం...

విశ్వనాథుని మందిరమునకు గేట్ నెం.1లోంచి వెళ్తే దారిలో సాక్షిగణపతి ఉంటాడు... చుట్టూ షాపులు పెట్టేసారు...
జాగ్రత్తగా చూస్తే కాని దర్శనమీయడు...అక్కడనుండి ముందుకెళ్తే డుంఠి గణపతి దర్శనమౌతుంది..
కాని పోలీసు వారు అక్కడ మనల్ని ఆపాదమస్తకము తడిమికాని పంపించారు.. వారి అభిమానం
భరించమంటున్నది చట్టం. ఐతే హడావుడిలో డుంఠి గణపతిని చూడకుండా వెళ్ళే ప్రమాదముంది...
డుంఠి గణపతికి మ్రొక్కి.. లోపలకు వెళ్తే అన్నపూర్ణమ్మ.. కాశీలో తిండికి లోటులేకుండా కాచే చల్లని తల్లి.
అమ్మను చూసి కొంచెం ముందుకు వెళ్తే విశ్వనాథుని దర్శనం...

జ్యోతిర్లింగము... తురుష్కులు దండయాత్రకు వస్తున్నారని విని విశ్వనాథుని సేవించుకుంటున్న
అర్చకులు, ఋషులూ అక్కడ విగ్రహానికి హాని కలుగకూడదని, ఇంకోచోట భద్రపరచే ఉద్దేశ్యముతో పెకలించబోయారు.
కాని విశ్వనాథుడు కదలలేదు.. ఏంచేయాలో తెలియని భక్తులు "మా ప్రాణాలు తీసికాని స్వామిని
ముట్టనివ్వ" మని ఆస్వామిని కౌగలించుకుని ఉండిపోతే.. అప్పుడు విగ్రహములో కదలిక వచ్చింది.. వెంటనే
విగ్రాహాన్ని పెకలించి ప్రక్కనున్న నూతిలో దాచారు... తురుష్కులు వచ్చి ముట్టడించారు. చేయదలచిన
విధ్వంసం చేసి నిష్క్రమించారు.. తర్వాత పునః ప్రతిష్ట చేద్దామంటే స్వామి నూతిలో కనపడలేదు.
రాణీ అహల్యాబాయికి స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి తాను కూపంలో ( అదే ఙ్ఞానవాపిగా చెప్పబడుతున్నది)
లుప్తమయ్యానని, గుడి కట్టించి ఇంకో లింగాన్ని ప్రతిష్ట చేయమని ఆదేశించాడట... ప్రకారం అన్నీ ఏర్పాటులు చేసి
లింగాన్ని తెచ్చి ప్రక్కగా పెట్టి గర్భగుడి మధ్యభాగంలో ప్రతిష్ట చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారుట. అంతా అయ్యాక
లింగప్రతిష్ట చేద్దామంటే ముందు పెట్టిన స్థలంలోంచి స్వామి కదలలేదట.. స్థలమే తనకి ఇష్టమైనదని
అక్కడే అలాగే దాన్ని ఉంచి అర్చించమని స్వప్నంలో అహల్యాబాయికి చెప్పాడట స్వామి. కారణంగా గర్భగుడిలో
ప్రక్కకు ఉంటాడు విశ్వనాథుడు.. ముందుగా ప్రతిష్టింపబడిన నందీశ్వరుడు మామూలుగా ఎదురుగానే ఉంటాడు.
కాశీ విశ్వనాథుణ్ణి ఇక్కడ ఎవరైనా స్వయంగా అభిషేకించుకోవచ్చు.. భక్తుల అభిషేకజలాలతో తనిసిన అభిషేక ప్రియుడు
తన శిరో భాగాన్ని మాత్రమే చూపుతూ ఉంటాడు.. అంతే విగ్రహమనుకున్నాను.. కాని సారి నీరు అర్చకులు
తీసేసినప్పుడు - ఓహ్!! పూర్తి స్వామి కన్నులపండువగా దర్శనమిచ్చాడు... సుమారు 3అడుగుల సుందరమూర్తి....
కొంచెం దూరంగా అమ్మ విశాలాక్షి శోభాయమానంగా భక్తులను అనుగ్రహిస్తూ ఉంటుంది. తల్లిని చూసాము... శక్తిపీఠం.
శక్తిపీఠం, జ్యోతిర్లింగం ఒకే చోట ఉండడం విశేషం.

క్షేత్రపాలకుడు బిందుమాధవుని దర్శనమైంది.. ఆలయానికి దగ్గరలో త్రైలింగస్వామి సమాధి.. త్రైలింగ స్వామి
తెలుగువాడు. 286 సంవత్సరాలు జీవించి కాశీ క్షేత్రంలో కదలాడిన మహానుభావుడు.. యోగానంద,
రామకృష్ణ పరమహంసలాంటి మహనీయులకు స్పూర్తిప్రదాత.. కాశీలో కదలని శివుడు విశ్వనాథుడైతే
కదిలే శివుడీతడని పరమహంస అనేవారట. దిగంబరంగా కాశీ వీధులలో తిరిగెడి వారట.
నాటి పాలకులు పరాయిదొరలు. ఇతనిపై కేసు పెట్టి శిక్షించబోతే త్రైలింగస్వామి తన మహిమ వారికి ఎరుకపరచాడు.
దానితో ఆయన జోలికి వెళ్ళడానికి భయపడేవారట.

(ఇంకా ఉంది మరి,,,,,,,)