Pages

Wednesday, September 24, 2014

రాజమండ్రి - 8 -- రాజమండ్రి - స్మార్ట్ సిటీ …

రాజమండ్రి - స్మార్ట్ సిటీ …
రచన: డి.వి. హనుమంతరావు


అప్పుడే వర్షం వెలిసింది. అని సంబరపడుతున్నాను..
“ఏమండీ .. కందిపచ్చడి చేస్తాను.. కారం లేని ఎండు మిరపకాయలు తెండి”అంది .
“మిరపకాయలంటే కారం కోసమేగా.. కారం లేకుండా ఎలా ఉంటాయోయ్ ?” కొంచెం ఇదయ్యాను.
“మీదో మట్టి బుర్ర .. “ అని మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని
“ఎందుకుండవ్ ? మీకేం తెలుసు ? ఉంటాయ్. వెళ్లి తెండి“అంది
నాది మట్టిబుర్ర అన్నప్పుడు .. కామోసు అనుకున్నా కాని మంగళ సూత్రాలు కళ్లకద్దుకున్నాక నా బుర్ర గట్టి పడ్డట్టనిపించింది
“ఇదిగో, ఇక్కడున్నట్టు రావాలి, వెడల్పుగా,లావుగా నల్లగా ఉంటాయి, అవిఅయితే కారం ఉండవు. జాగ్రత్తగా చూసి తెండి .. లేపోతే ఏవో ఒకటి అంటకట్టేస్తాడు, మీరసలే ఓ  మాలోకం.. ఉంటే కూరొడియాలు కూడా తెండి ”
“బాగుంటుందోయ్, వంకాయ పచ్సిపులుసా? అందులో వడియాలు చాలా బాగుంటాయ్, మా అమ్మ చేసేది కూడాను.”
“మీది మతిమరుపు మేళం.. నేనూ చేసాను, మరిచిపోతారు” ..
మంగళ సూత్రాలు తీసింది కాని, మరీ అంత పెద్ద తప్పుకాదనుకుందో, లేక ఇందాకటి  కళ్లకద్దుకోడానికి దీనికీ సరిపెట్టేసిందో కాని.. ఇప్పుడు మాత్రం ...కద్దుకోకుండానే  లోపలెట్టేసుకుంది.


సరే బయల్దేరాను.. దేవీ చౌక్ దాకా వెళ్దామని .. మా అపార్ట్ మెంట్ ఉత్తర ముఖంగా ఉంటుంది. .. కాంపౌండ్ లో ఉన్న మా ఆంజనేయస్వామికి ఒక మ్రొక్కు మ్రొక్కి , నేను సాధారణంగా ఈశాన్య దిక్కుగా బయల్దేరి తూర్పుకి తిరుగుతాను..విజయంతో తిరిగి రావాలని… అదో సెంటి మెంట్ .. అలాగే కొంచెం దూరం వెళ్లి రైట్ కు తిరిగాను.. అంటే బాల విజ్ఞానమందిర్ వీధిలోకి.. అలావెళ్తే అక్కడో  రాజకీయ నాయకుడి ఇల్లు ఉంది. ఆ  ఇంటి మీదుగా వెళ్తే గణనాయకుడి గుడి వస్తుంది.  స్కూటర్ దిగకుండానే అక్కడ శిరస్సు వంచడం ఓ అలవాటు. ..కానీ ఈలోగా కారంలేకుండా ఉన్న మిరపకాయలు, వీలైతే పచ్చిపులుసులోకి కూరొడియాలు తేడానికి  కార్యార్థినై వెళ్తున్న నన్ను .. ఒక రక్షక భటుడు అటకాయించాడు..


ఖంగుతిన్నాను. మరీ రాజమండ్రిలో ఓ మూలకున్న మా శ్రీరామనగర్ లోకి రక్షక భటులు రావడం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆరా తీసా.. ఊళ్లోకి పర్యటనకు వచ్చిన ఓ మంత్రిణిగారు పాపం ఇడ్లీ తినడానికి ముచ్చట పడ్డారు .. ఓ రెండు  ఇడ్లీ వాచ్ మన్ తో తెప్పించుకు తినొచ్చుగా .!..లేపోతే ఏదో హోటల్ లోకి మారువేషంలో వెళ్లి  తినొచ్చు కదా, ఆవిధంగా ప్రజల్లోకి వెళ్తే  ప్రజలు ఒక జత ఇడ్లీలు తిండానికి ఎన్ని డబ్బులిస్తున్నారో తెలిసేది…
ఠాఠ్ ! అలాక్కాదు, మా ఇంట్లో ఇడ్లీ వేడిగా వేయిస్తానని (వేయించడం అంటే వేపుడు కాదుఅని మనవి, అదీ కాక ఇడ్లీ వేయిస్తే బాగోదు కూడాను ..) .. బ్రేక్ ఫాస్ట్ కు రమ్మని గణనాయకుని వీధిలో ఉన్నసదరు రాజకీయ నాయకుడుగారు మంత్రిణి గారిని ఆహ్వానించారు.. ఆ జత  ఇడ్డెన్ల కోసం పాపం సదరు ఆవిడ వీరింటికి వచ్చారు.. సదరు ఆవిడ సదరు జత ఇడ్డెన్లూ తింటుంటే ఎలా ఉంటుందో చూడాలని చోటా నాయకులు, కార్యకర్తలు వచ్చారు. ఇడ్లీ చల్లారకుండా మన పేపర్లో ఆ న్యూస్ రావాలంటూ వివిధ పేపర్లవాళ్లు పంపించిన విలేఖర్లు వచ్చారు.. ఆ ఇడ్లీన్యూస్ బాగా కవర్ చేస్తే ఇక్కడ మంత్రిగారికి తినడానికి ఇడ్లీ కనపడకపోయినా అక్కడ అన్ని టి.విల్లోనూ గ్రాఫిక్స్ ఉపయోగించి ఆవిర్లొచ్చే ఇడ్లీలా తర్జుమా చేసి  వేడిగా కనపడేటట్లు కవర్ చేయడానికి టి.వి వాళ్లొచ్చారు. ఇడ్లీ తింటున్న మంత్రిణిగార్ని-  అభిమానించే  ప్రజలు చూడకూడదని, ఆ ఇడ్లీ నేపథ్యంలో (టి.వి. భాషొచ్చేస్తోందిరోయ్ ) ఏ అవాంచనీయ సంఘటనలు జరక్కుండా పోలీస్ బందో బస్తన్నమాట ఇది … నేను అట్టి విషయ సేకరణలో ఉండగా, చేతిలో లాఠీతో ఆ ప్రక్క వీధికి అన్నట్టు నన్నయ్య వీధిలోకి నన్ను మళ్లేసాడు రక్షక భటుడు.


సరే ఆ వీధిలోకి స్కూటర్ తిప్పి సాయిబాబా గుడి దాకా వెళ్లకుండానే.. ఎవరో చెప్పారు.. ఎదర రోడ్డు అడ్డంగా తవ్వేసారట అని. ఎందుకటా అని క్వచ్చిస్తే (సారీ ఇంగ్లీష్ లో బాంటుందని ఇలా వ్రాసా ) ..  ప్రశ్నించా…కార్పొరేషన్ కు క్రొత్త ప్రభుత్వం, క్రొత్త పుష్కరాలు, క్రొత్త ఫండ్స్ అందుకని క్రొత్త  పైపు లైనులు వేస్తున్నారట.... అన్నారు.
“అదిరిందయ్యా చంద్రం.. “అని నాకు నేనే జోకు వేసుకుని ప్రక్కవీధిలోకి తిరిగా…


అక్కడ పాత ప్రభుత్వం వారు వేసిన పాత పైపులైను లీక్ అయి పుష్కలంగా నీరు బయటికొచ్చేసి, గోదావరి నదిలా పొంగిపొర్లుతోందని,.. అడ్డంగా గొయ్యి తీసి .. అందులోకి దిగి మరీ రిపేర్ చేస్తున్నవారు కనపడ్డారు..


ఏంచేస్తాం .. ప్రక్క వీధిలోకి త్రిప్పి కొంచెం వెళ్ళగానే బి.యస్.యన్.యల్ వారు ఎదిగిన చెట్లు దూరశ్రవణం యొక్క ప్రగతికి నిరోధకాలని కొట్టేసి .. ట్రాఫిక్ నిరోధకాలుగా రోడ్డుకి అడ్డంగా వేసారు.. కొమ్మలు చేవదేరి ఉన్నాయి. రిస్క్ తీసుకోవడం క్షేమదాయకం కూడా కాదు. ఈ వయసులో ఎముక- ‘...విరిగిపోతే అతకదు మల్లా’ అని మూగమనసులోని పాటలో ఆలోచించినవాడినై ప్రక్కవీధిలోకి తిరిగా, సారీ త్రిప్పా స్కూటర్ ..


ముందు ఓ పెద్ద పంది, దానివెనకాల ఆ పందిని తరుముతూ అంతే  పెద్ద శరీరంగల ఒక ఆసామీ చేతిలో ఉరితాడులావేసిన కర్రతో పరుగెడుతూ అడ్డం పడ్డాడు .. తప్పించుకుంటూ ఉంటే కూడా పిల్ల పందులు బిల బిలమంటూ వచ్చేస్తున్నాయి… వాటిని తప్పించుకోడానికి స్కూటర్ కొంచెం కష్టపడి నిల దొక్కుకుంది. గవర్నమెంట్ మారాక మా వీధుల్లో పందులు కొంచెం విచ్చల విడిగానే తిరుగుతున్నాయి. సరే ఆ రాజకీయాలు, గొడవలూ మనకేల? పవిత్రమైన ఓటేసేసాం.ఓటు హక్కు వినియోగించేసుకున్నాము,,మిగతా విషయాలు మనకవసరమా చెప్పండి .. మళ్ళీ ఇంకో ప్రక్కకి తిప్పా..


ఇంతలో ఫోన్ మ్రోగింది..
“హలో”
“హలో”
“మీరేనా ఎక్కడున్నారు?”
“దార్లో ఉన్నాను”
“ఇవతల పచ్చడి ఆగిపోయింది.. తొందరగా రండి, మళ్లీ కరెంట్ పోతుంది’
“కరెంటాఫీసుకు  ఫోన్ చేయ లేదా మరి.. :
“ఆ వెటకారమా, .. మీరొచ్చాక చంద్రబాబు నాయుడికి ఫోన్ చేద్దురుగానిలెండి .. నోరు మూసుకుని  రండి త్వరగా “,..
మంగళ సూత్రాల చప్పుడు వినపడింది.. పాపం అద్దుకుంటున్నట్టుంది, ఎంతైనా పతివ్రతగదా..
మా ఆవిడ మాటలు, దానితో మంగళ సూత్రాల చప్పుడు అన్నీ ముందు కుడి చెవిలోంచి, తర్వాత ఎడమ చెవి దగ్గరున్న ఫోన్ లోంచి సైమల్టేనియస్ గా వినపడుతున్నాయి, స్టీరియో అఫెక్ట్ తోటి..
“అయినా ఇక్కడున్నట్టు రమ్మన్నానుగా ఇంతసేపు ఏంచేస్తున్నారు?” అని ముందు కుడి చెవిలోనూ, తర్వాత ఎడమ చెవిలోని ఫోన్ లోనూ .. స్టీరియో…అఫెక్ట్ తో మాట్లాడింది మా ఆవిడ..
చుట్టు చూసా .. జ్ఞానోదయం అయింది… నాకు ప్రక్కన మా అపార్ట్ మెంట్ ‘సాయి అభయ ఎంక్లేవ్’ దర్శన మైంది ..
“అయినా ఇక్కడున్నట్టు రమ్మన్నానుగా …”
“ఇక్కడున్నట్టే ఉన్నానోయ్ …”
ఏ వీధిలోంచి .. ఏ వీధిలోకి తిరుగుతున్నానో తెలియక .. అలా అలా తిరిగి
ఇంకా ఇక్కడే ఉన్నట్టున్నాను..


[స్మార్ట్ సిటీ కాబోతున్నరాజమంద్రిలో ఒక అనుభవం .. సరదాకొంచెం కలపి]



Friday, September 5, 2014

రాజమండ్రి-7 -- రాజమండ్రిలో అప్పట్లో నేను పోషించిన హోటల్స్ …


రాజమండ్రిలో అప్పట్లో నేను పోషించిన హోటల్స్ …  


ఆ రోజుల్లో  మా వయసు వాళ్లం హోటల్ కు వెళ్ళాలంటే స్వతంత్రంగా వెళ్ళేవాళ్ళం కాదు.. నాకైతే పెద్దవాళ్ళకు తెలుస్తే ఏమన్నా అంటారేమో అని భయం ఉండేది.. .. వారేమనకపోయినా కూడా ..ఆ భయం ఉన్నా 
హోటల్స్ ను నా శక్తిమేరకు పోషించాను..

కాతేరు రోడ్ పై లింగంపేట దగ్గరగా ఒక చిన్న హోటల్ ఉండేది చాలా కాలం క్రితం.. అక్కడకి మా దగ్గర పని చేస్తున్న నాగేశ్వరరావు తీసుకెళ్లి మొట్టమొదటిసారి  సాంబారు ఇడ్లీ ఇప్పించాడు.. అది నా హోటలేంగట్రం. .. పులుసుతో  ఇడ్లీ తిండం అప్పట్లో అర్థం కాలేదు.. పొంగులొస్తున్న వేడి వేడి పులుసుతో ఇడ్లీ నోట్లో పెట్టుకోగానే మూతి కాలి పోయింది, ఆ వేడికి .. ఆ తర్వాత తెలిసింది .. దాన్ని పులుసు అనకూడదు .. సాంబారు అనాలి అని.

తర్వాత కొంచెం పెద్దయ్యాక  ఎప్పుడైనా మధ్యాహ్నం కారియర్ లేపోతే.. ఇడ్లీ మాత్రమే తిను, అడ్డమైనవీ తినకు అని అమ్మా నాన్నగారు - మరీ మరీ చెప్పి ఓ బేడ ఇచ్చే వారు. పుష్కరఘాట్ లో మా స్కూల్ ఉండేది. ఇప్పుడు శివుని విగ్రహం ఉన్న చోట ఒక కాకా హోటల్ ఉండేది. అక్కడ అర్థణాకు రెండు ఇడ్లీ ఇచ్చేవారు.. పచ్చి మిరపకాయ చట్నీవేసేవాడు.. చాలా బాగుండేది.. 

ఆ తర్వాత యస్.యస్.యల్.సీ లోకి వచ్చాక .. అంటే 1957 మార్చ్ లో పరీక్షలప్పుడు… రెండు పూటలా పరీక్షలుండేవి. [ఇప్పుడున్న Xత్  క్లాసుకన్నా తర్వాత క్లాస్ యస్.యస్.యల్.సీ. అదయ్యాక మాతోపాటే పి.యు.సి ప్రారంభమైంది. ఇప్పుడు 10త్ తర్వాత రెండేళ్ల ఇంటర్ వచ్చేసింది..] అప్పుడే కోటగుమ్మందగ్గర ఇప్పుడు తుమ్మిడి రామ్ కుమార్ బట్టల షాపున్నదగ్గర ‘లక్ష్మీ కేఫ్’ అని ఒక కొత్త హోటల్ ప్రారంభించారు.. ఆ పరీక్షలు వారం రోజులూ మధ్యాహ్నం అక్కడ టిఫిన్ తినమని ఇంట్లో డబ్బులిచ్చేవారు. ఆ హోటల్ బయట బోర్డు మీద… ఇక్కడ వెన్నతో కాచిన నేయి వాడబడును.. కాదని ప్రూవ్ చేస్తే రు.116/- బహుమానం అని ఉండేది. నిజంగానే ఇడ్లీ కారప్పొడి తింటే మూడు గరిటల నెయ్యి వేసేవాడు.. ఎంత బావుండేదో… ఈ హోటల్ కు కాలేజీలో చదివే టప్పుడు, ఉద్యోగంలేక బేవార్స్ గా తిరిగేటప్పుడు కూడా  రెగ్యులర్. దోసె వేసేవాడండీ … అబ్బబ్బా ఏంటేస్టండీ బాబూ… అందులోకి కొబ్బరి చట్నీ, అల్లం చెట్నీ  ప్లస్ సాంబారు.. అన్నీ చాలా టేస్టీగా ఉండేవి.. చపాతీ కుర్మా.. అక్కడ ఆ వెజిటబుల్ కుర్మా వాడు చేసే విధానమే స్పెషల్ … దోసెకి మాత్రం డిమాండ్ ఎక్కువ. 

తర్వాత వీళ్లే పంచవటీ హోటల్ ప్రారంభించారు.. అందులో ఎ.సి రూం ఓ ప్రత్యేకాకర్షణ. లక్ష్మీకేఫ్ కన్నా రేట్లెక్కువ. కానీ టేస్టీ ..ఈ హోటల్ ప్రస్తావన ముళ్ళపూడి వారి కోతికొమ్మచ్చిలో కనపడుతుంది.

ఆ కోటగుమ్మందగ్గరే జైహింద్ కేఫ్ … 
ఆ ప్రక్కన వెల్ కం హోటల్ .. ఈ రెండూ కూడా ఇరవై నాలుగ్గంటలూ పనిచేసేవి.. ఎందుకంటే అప్పట్లో గోదావరి స్టేషన్ కు రైలు ట్రాఫిక్ ఎక్కువ, అలాగే అక్కడ ఇల్లీగల్ ట్రాఫిక్ కూడా ఎక్కువ అనేవారు. దానా దీనా బేరాలు బాగుంటాయి కదా మరి.. ?

అలా మార్కెట్ వైపుకు వెళ్తే .. బాటా షూ కంపెనీ దగ్గర లక్ష్మీ విలాస్ హోటల్ .. అది సాంబార్ ఇడ్లీకి ఫేమస్. మేం స్కూల్లో చదువుకునే రోజుల్లో మా మాష్టార్లు ఇక్కడనుంచి మా చేత టిఫిన్స్ అవీ తెప్పించుకునేవారు.. పెద్దపిల్లాడు వెళ్తుంటే సాయంగా మా లాంటి కుర్రగాళ్లం వెళ్లేవాళ్లం. గురు శుశ్రూష అన్నమాట. ఈ హోటల్కు బయటికి రెండు గుమ్మాలుండేవి .. మధ్యలో ప్రోప్రైటర్ ఇన్నమూరి చెంచయ్యగారు కూర్చుని బిల్లులు తీసుకునే వారు.. ఆయన మునిసిపల్ వైస్ చైర్మన్ గాకూడా ఉండేవారు.. కొందరు ఆయన  కన్నుగప్పి  డబ్బులీయకుండా వెళ్ళిపోయేవారని అనేవారు.

కొంచెం ముందుకెళ్తే నల్లమందు సందులో అనుకుంటా .. మా టైపు ఇన్స్టిట్యూట్ ఉండేది. దానికెదురుగా కోదండ రామా విలాస్ .. పి.యు.సి డెక్కాక టైప్ నేర్చుకునేవాణ్ణి అప్పుడోసారి అక్కడ మరో ఇద్దరు మిత్రులతో వెళ్లాను.. పూరి కూర .. వాసన అలా చేతులకుండిపోయింది. ఇంట్లో తెలిస్తే .. అమ్మో ఇంకేమన్నా ఉందా.. భయం.. ముగ్గురం పరీక్షలు పోయి.. దేశోద్ధరణకోసం టైపులో చేరిన వాళ్లమే.. ‘ముండా దేవుడు ముగ్గుర్నీ కూర్చా’డనీ మాలో ఒకడు కామెంట్ చేయడం ఇంకా గుర్తు..అతడే ఇప్పుడు మా అపార్ట్మెంట్ లో మాకెదురుగా ఫ్లాట్ లో ఉంటున్నాడు. 
అది దాటి ముందుకెళ్తే విశ్వభవన్ .. అది కోదండ రామా విలాస్ వారిదే .. పెద్ద హోటల్ .. రుచికరంగా ఉండేవి పదార్థాలు..

హైస్కూల్ ,కాలేజీ రోజుల్లో ఇంతవరకే మన సామ్రాజ్యం..కాలేజీలో కూడా మాధవరావు కాంటీన్, భాస్కరరావు కాంటీన్ .. మేము భాస్కరరావు కాంటీన్ కు అలవాటు పడ్డాం. అయితే మాధవరావు కాంటీన్ కు మంచి పేరుండేది.  
డిగ్రీ మూడేళ్ళు అయి .. ఒకటి రెండు దండయాత్రలు చేసి .. తర్వాత ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఉద్యోగం .. ఆల్కాట్ గార్డెన్స్ లో గవర్న్ మెంట్ సా మిల్లులో ఉద్యోగం..

ఉదయమే ఇంట్లో అమ్మ వేసిన వాసినపోలు వేడి వేడి గా తిని, 7-30కి సైకిల్ ఎక్కేవాణ్ణి . మధ్యాహ్నం క్యారియర్ వచ్చేది. మధ్య మధ్యలో .. మా మిల్లుకి దూరంగా ఓ శెట్టి గారు హోటల్ పెట్టారు.. బాగుండేది కాని, పైసలెక్కువ ..తప్పకపోతే  అక్కడకు వెళ్లేవాళ్లం. ఆ తర్వాత మా మిల్లు ఎదురుగా రామారావు హోటల్ వచ్చింది. హోటల్ అంటే ఓ పాక. బానే చేసేవాడు. తర్వాత ఆ రామారావే, మా మిల్లులో క్యాంటీన్ పెట్టాడు. మా ఉద్యోగం సాయంత్రం అయిదు, ఆరూ .. ఆ టైములో ఇళ్లకుబయలుదేరేవాళ్లం..

దారిలో అయిదు బళ్ల మార్కెట్ దగ్గర ఎల్లోరా హోటల్ .. దాని ప్రొప్రైటర్ ఏలూరి సూర్యారావు .. కమ్యూనిస్ట్ లీడర్ ..వీళ్లబ్బాయి వెంకటేశ్వరరావు, కార్పరేటర్ గా ఈ మధ్య చేసారు..  ఆ హోటల్లో ఒక దోసో, చపాతీయో తిని కాఫీ త్రాగి సైకులెక్కేవాళ్లం.ఈ హోటల్ లో సింగిల్ కాఫీ ఇచ్చేవారు.. అంటే ఇద్దరు వెళ్లి ½ అనకుండా ఒకరికే హాఫ్ కాఫీ అన్నమాట .. హాఫ్ రేటుకే. అర్థరూపాయికూడా అక్కర్లేకుండా దోసె, కాఫీ తాగగల్గేవాళ్లం .. అక్కడనుంచి సైకిలెక్కితే పేపర్ మిల్లు దగ్గర మా ఇంటికొచ్చేటప్పటికి కర కరా ఆకలేసేది.. సైకిల్ శ్రమ, వయస్సు.. అంతేగా మరి.

ఒక్కోప్పుడు .. ముఖ్యంగా బుధవారాలప్పుడు శాంతి నివాస్ కు వెళ్లేవాళ్లం. ఈ హోటల్ వరదరావు ఫామిలీ వాళ్లది. వరదరావుగారి హోటల్ అప్పట్లో.. అంటే ఇంకా ముందు కాలంలో మాడరన్ హోటల్ గా చాలా ఫేమస్. ప్రఖ్యాత మృదంగ విద్వాంసులు శ్రీ కమలాకర్ తండ్రిగారు వరదరావు. కమలాకర్ గారబ్బాయి యోగీశ్ కూడా మంచి మృదంగ విద్వాంసుడు. వారిదే ఈ శాంతినివాస్ ఆ హోటల్ మెయిన్ రోడ్ లో వైగ్రాం రోడ్ మొదట్లో ఉండేది.. అక్కడ సాయంత్రం రోజుకో రకం టిఫిన్ ఉండేది. అక్కడ బోర్డ్ మీద వ్రాసేవారు.. బ్రెడ్ జామ్, పూరి కూర, బోండా సాంబార్, నెయ్యీ కారప్పొడీ ఇడ్లీ .. ఇలా … నాకు అవన్నీ ఇంటిపేర్లు పెట్టుకున్న టిఫిన్స్ లా కనిపించేవి.. అదే చెప్పుకుని నవ్వుకునే వాళ్లం.. బుధవారం బోండా సాంబార్. మిరియం వేసి మినప్పిండితో బోండావేసి .. దానిమీద కరివేపాకు కాడ కనపడేట్టు సాంబారు పోసి, వేడి వేడిగా ఇచ్చేవాడండి . అది ఎంత టేస్టంటే అది తినడంకోసం బుధవారం అక్కడికి పోయేవాళ్లం .. అర్థం చేసుకోండి మరి. ఒగేల్ గ్లాసులతో మంచినీళ్ళు ఇచ్చేవాడు.. ఆ గ్లాసులు అప్పట్లో ఫేమస్.

మా మామయ్య వచ్చినప్పుడనుకుంటా మాడరన్ హిందూ హోటల్ కు వెళ్లేవాణ్ణి.. చెన్నపట్నం కల్చర్ కనపడేది. రాజమండ్రి అంటే వరదరావు ఇడ్లీ చాలా ఫేమస్. ఆ ఇడ్లీ ఇక్కడ దొరికేది. ఇత్తడి గ్లాసులూ,కప్పులు .. కాఫీ పోసి గ్లాస్ బోర్లిస్తే … గ్లాస్ సరిగా తీయలేకపోతే వేడి కాఫీవళ్ళంతా పడుతుందన్నమాట. ఉప్మాలో ఉప్మాకు సరిపడా బంగాళాదుంప కూర ఇచ్చేవాడు. రెండూ కలిపి తింటే కడుపు నిండిపోయేది.
ఈ వరదరావుగార్కి .. గోదావరి స్టేషన్ కాంటీన్, రాజమండ్రి స్టేషన్ కాంటీన్, కోర్టుల్లో కాంటీన్ ..శాంతి నివాస్, శ్రీనివాస్, సుఖనివాస్ లాడ్జ్ .. ఇవన్నీ ఉండేవి.

దాని ప్రక్కనే ఆషారెస్టారెంట్.. ప్రొప్రైటర్ కు బ్రాకెట్ ఆటలో డబ్బులు కలిసొచ్చాయని  ఈ హోటల్ పెట్టాడనేవారు.. ఆ హోటల్ కు ఎక్కువ వెళ్లే వాణ్ని కాదు.

ఇవి కాక ఒరిస్సా వైపునుంచి వచ్చిన వాళ్లు , ఊళ్లో రెండు మూడు చోట్ల ఫాన్సీ షాప్ తో పాటు హోటల్ రన్ చేసేవారు .. వాళ్లు చైనా గూడ్స్ కూడా అమ్ముతుండేవారు..
ఈ సర్కి .. ఈ పోస్ట్ జాగ్రత్తగా చదివిన రాజమండ్రి వాసులకు అప్సరా హోటల్ ప్రస్తావన లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఫారెస్ట్ ఉద్యోగం అయ్యాక రెండేళ్లు నేను రాజమండ్రి వదిలేశా .. పలాసాలో స్టేట్ బాంకులో ఉద్యోగం వచ్చింది..
అక్కడనుంచి 1970లో ఇక్కడకి బదలీ పై వచ్చి కోర్టుల వెనకాల మెట్టమీద ఉన్న స్టేట్ బాంక్ మెయిన్ బ్రాంచిలో జేరా.. ఇప్పుడు ఆ బ్రాంచి కంబాల చెరువుదగ్గరకు వచ్చింది ..

ఇప్పుడు రిలయన్స్ ఉన్నచోట హోటల్ శ్రీనివాస్ ఉండేది. అది కూడా వరదరావు గ్రూప్ వారిదే . సర్వర్స్ టిప్పుసుల్తాన్ లై కస్టమర్ సర్వీస్ అతిగా చేయడం వలన అది క్రమేణా మూతపడింది .. అక్కడకు ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ లో ఉండగా కూడా వెళ్లేవాణ్ణి ..

గోదావరీ స్టేషన్ కు ఆ ప్రక్క అప్సరా హోటల్ .. అక్కినేని నాగేశ్వరరావుగారు ప్రారంభం చేసారు.. మొదలెట్టాక ఇక్కడ లాన్ టెన్నీస్ పోటీలు, కృష్ణన్ వంటి ప్రముఖులు వచ్చేవారు.. లాడ్జింగ్ ఉండేది.సినీమాలవాళ్ళు దిగేవారు.. హైదరాబాదు వెళ్లే బస్సులన్నీ ఇక్కడాగేవి.. ఎదురుగా లాన్స్ లో కూడా సర్వీస్ ఉండేది.. డూక్ బాక్స్ .అదో ఎట్రాక్షన్ .. కావలసిన పాటకు డబ్బులేసి వినే సదుపాయం.. పాట ఇంట్రస్ట్ కన్నా బాక్స్ ఇంట్రస్ట్ .. రిక్షాలు కట్టించుకుని కేవలం టిఫిన్స్ తిండంకోసం ఫామిలీస్ తో వచ్చి తిని, రిక్షాలలోఇళ్లకు వెళ్లేవారు .. పుష్కారాలప్పుడు .. యమా రష్. రోజుకూడా కొన్ని సమయాలలో సీట్ కష్టమయ్యేది.  టిఫిన్స్ కూడా బాగుండేవి .. ఎ.సి.వై రెడ్డి గారు ప్రప్రైటర్ .. పెర్సనల్ అటెంక్షన్ పే చేసేవారు.. ఆయన తర్వాతి రోజుల్లో రాజకీయాలలో కూడా ఉన్నారు. అప్పట్లో రూపాయి పెట్తే టిఫిన్ అండ్ కాఫీ వచ్చేది.

మేము అక్కడ బ్రాంచిలో పనిచేస్తుండగానే మా బ్రాంచి కంబాల చెరువుదగ్గర స్వంత బిల్డింగ్స్ లోకి మారింది.. అప్పుడు దేవీ చౌక్ దగ్గర అంబా భవన్ .. అక్కడ టిఫిన్స్ బాగానే ఉండేవి.. అంతకన్నా ప్రొప్రైటర్ గారు ఎర్రగా బంగినపల్లి మామిడిపండులా బాగుండేవారు.. తర్వాత మాకు స్వంతంగా కాంటీన్ వచ్చేసింది.. అప్పుడప్పుడు బయట హోటళ్లకు వెళ్లేవాళ్లం.

ఆ తర్వాత నేను రాజమండ్రి నుంచి ఉద్యోగరీత్యా బయటకు పోయి మరల 86లో వచ్చాను.. వాతావరణం మారింది..

Tuesday, September 2, 2014

NEWS FROM 'SAKSHI' DAILY .. 2ND SEPT.2014






‘సాక్షి’ .. సెప్టెంబర్ 2, 2014 .. తూర్పుగోదావరి .. మన రాజమండ్రి సిటీ .. 5వపేజీ

బుడుగు శిలావిగ్రహం నెలకొల్పాలి.

ముళ్లపూడి కలం, బాపు కుంచెలు ప్రాణం పోసిన బుడుగు శిలా విగ్రహాన్ని తెలుగువారి సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రిలో నెలకొల్పాలని, హాసం క్లబ్ కన్వీనర్ డి.వి.హనుమంతరావు అన్నారు. సోమవారం శ్రీరాంనగర్ లోని ప్రముఖ కార్టూనిస్ట్
ఎం.వి.అప్పారావు(సురేఖ) గృహంలో బాపు సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ చిత్రకారుడు ఆర్.కె.లక్ష్మణ్ చేతినుంచి జాలువారిన అసంఖ్యాక కార్టూన్లలో నిత్యం కనపడే కామన్ మ్యాన్ - సగటు మనిషి విగ్రహాన్ని ఆయన అభిమానులు పూనేలో నెలకొల్పారని, అలాగే బుడుగు విగ్రహాన్ని నెలకొల్పాలన్నారు. నగరంలో బాపు చిత్రల్లు, కార్టూన్లతో ఒక ప్రదర్శనశాలను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.  గేయకవి మహ్మద్ ఖాదర్ ఖాన్ బాపుతో తనకు గల అనుబంధాన్ని ఇలా వివరించారు. ‘ఒకసారి, ఎవరో ప్రముఖుడు నాకు బాపుని పరిచయంచేసారు. తొలి పరిచయంలోనే బాపు నన్ను ‘సాయిబు’ అని మహమ్మదీయులను అనడం తప్పా అని ప్రశ్నించారు. తాను ఈ పదాన్ని ఉపయోగిస్తే, వివాదం చెలరేగిందని బాపు అన్నారు. నేను ‘సాహేబ్’ అన్న పదం సాయిబుగా రూపాంతరం చెందినదని, ఆ పదాన్ని ఉపయోగించడంలో ఎటువంటి అనౌచిత్యమూ లేదని చెప్పినప్పుడు ఆయన సంతోషించారని మహ్మద్ ఖాదర్ ఖాన్ అన్నారు. పేపరు మిల్లు విశ్రాంత వెల్ఫేర్ అధికారి ఎస్.బి.చౌదరి, ఎం.వి. అప్పారావు తదితరులు పాల్గొని బాపుకు నివాళులర్పించారు.

(రాజమండ్రి కల్చరల్)