Pages

Thursday, August 23, 2012

రాజమండ్రి.... 5




రాజమండ్రి ఊరుగురించి ఎంతో చెప్పి మా శ్రీరామనగర్ గురించి కొంతయినా చెప్పక పోవడం తప్పుకదా.. నేను రాజమండ్రిలోనే పుట్టి పెరిగాను... నా ఆరవ ఏట రాజమండ్రిలోని ఈ శ్రీరామనగర్ వచ్చేసాము..చిన్నప్పుడే వచ్చేయడంవల్లనేమో ఈ శ్రీరామనగర్ అంటే నాకు చాలా ఇష్టం. మధ్యలో ఉద్యోగరీత్యా కొద్దికాలము దూరమైనా ఈ పేటతో నా నికర అనుబంధము నలభై ఏళ్ల పైమాట....   ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా మధ్య మధ్య రాజమండ్రి వచ్చి ఈ గాలి పీలుస్తే కాని తోచేది కాదు..ఆ అభిమానంతోటే ..మరల రిటైర్ అయ్యాక ఈ పేటలోనే ఫ్లాట్ తీసుకుని ఉంటున్నాను. అంచేత నిజమైన అనుబంధం నా జీవిత కాలం అని చెప్పడం సబబు.... 

రాజమండ్రిలో ఇప్పుడు నేనుంటున్న మా ఫ్లాట్ కు పొడుగాటి బాల్కనీ ఉంది.. దానికి ముందువైపు సగంవరకు అద్దాలు పెట్టించాము .. దాని వెనుక నాకో చిన్న రూమ్ లా చేసుకున్నా... బయట వర్షం పడుతుంటే ఆ అద్దాల వెనుకనుంచి రోడ్ చూస్తుంటే భలే కాలక్షేపం... అలా వర్షం పడుతున్న ఓ సాయంత్రం ఆ వర్షాన్ని చూసి ఆనందిస్తున్న మనస్సు ప్రశాంతమై చిన్నతనంలోకి వెళ్లిపోయింది...

నలభైల్లో మా నాన్నగారు రూపాయికి ఆరు చదరపుగజాల చొప్పున, (ఆశ్చర్యంగా ఉంటుంది కాని నిజం...) శ్రీరామనగర్ లో  1400 చ.గ. స్థలం కొన్నారు.. నాన్నగారిపై అభిమానంతో మా చుట్టూ అందరూ మా బంధువులే స్థలాలు కొనుక్కున్నారు.. మేముకాని మిగిలిన వారుకాని  ఇల్లు కట్టే సాహసం చాలాకాలం చెయ్యలేదు.. ఎందుకంటే ఊరికి దూరం.. పైగా ఈ పేటకొచ్చే దారిలో జనసంచారము అసలు ఉండేది కాదు.. మా పేటకు ముందున్న సీతంపేటలో జనజీవనం కొంచెం ఉండేది., అది దాటాక ఇప్పుడు వాటర్ ట్యాంకున్న స్థలంలో సీతమ్మ చెరువు, ముందుకొస్తే  రోడ్డుకిటూ అటూ పెద్ద పెద్ద చెట్లు... రాత్రిళ్లైతే మరీ భయంకరంగా ఉండేవి

1949లో...అప్పట్లో మేము రామా టాకీసు (ప్రస్తుత నాగదేవి) దగ్గర అద్దె ఇంట్లో ఉండేవాళ్లం.. ఇంటి వాళ్లు కొంచెం అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న కోపంతో మా నాన్నగారు వారం రోజుల వ్యవధిలో శ్రీరామనగర్ లో మా స్వంత స్థలంలో ఓ పాక వేసుకుని అక్కడికి మకాం మార్చేసారు.  మేము  ఈ పేటలోకి వచ్చినప్పుడు అయిదారు ఇళ్లకన్నా ఎక్కువలేవు.. అప్పట్లో ఊరు అంతగా పెరగక పోవడంవలన ప్రభుత్వయాజమాన్యంలో ఉన్న పేపరుమిల్లు  ఊరికి దూరంగా ఉన్నట్టు ఉండేది.. మా పేట మొదట్లో చుక్కా అప్పలస్వామి రెడ్డిగారి పెద్ద పేలస్ ఉండేది.. ఆ పేలస్  నాలుగు రోడ్లకు సరిపడా ఉండేది..  ఆయన తన సోదరునితో కలసి కలప వర్తకం చేసేవారు.. ఆ పేలస్ చుట్టూ పెద్ద దొడ్డి.. మామిడి, బాదం లాంటి చెట్లు.. ఆ ఇంట్లోకి చిన్నప్పుడు వెళ్లేవాడ్ని. లోపలకెళ్తే బయటికి ఎలా రావాలో తెలియనట్టుండేది... ఆ అప్పలస్వామి రెడ్డిగారు కొన్నాళ్లు మునిసిపల్ చైర్మన్ గా కూడా ఉన్నారు.. చాలాకాలం ఇప్పుడు సీతానగరం రోడ్డుగా పిలవబడే మా రోడ్... చుక్కా అప్పలస్వామి రెడ్డీ రోడ్డే.. మా ఇంటి అడ్రస్సు చెప్పడానిక్కూడా వారి పేలస్ ఒక లాండ్ మార్క్. వాళ్ల అబ్బాయి సదాశివరెడ్డి బాల్ బ్యాడ్ మింటన్ జాతీయస్థాయీ ఆటగాడు.  

మేం ఈ పేటకు వచ్చే నాటికి మా పురోహితులు గుంటూరి సత్యనారాయణగారి పాక ముందుగా ఉండేది ...
మా పాక దాటాక దూరంగా మరో రెండు పాకలుండేవి... ఆ తర్వాత అన్ని చెట్లూ, పిచ్చిమొక్కలు అలా కాలిదారులు తప్ప ఏ దారీ ఉండేది కాదు..  పేట అంతా పచ్చిక బయళ్లు, తాడి చెట్లు.. అంతే.. పాక ముందు కూర్చుంటే విపరీతమైన గాలి.. ఆ జీవితం చాలా ఆనందంగా ఉండేది... 
నాన్నగారు ఊళ్లో హిందీ పాఠశాల కొన్నాళ్లు, తర్వాత ట్యుటోరియల్ కాలేజీ నడిపారు.. తర్వాత్తర్వాత వయస్సు పైబడ్డాక ఇంటిదగ్గరే ఉండిపోయేవారు.. 
నా చదువు..... కొన్నాళ్లు సీతంపేటలో ఎలిమెంటరీ చదువు చదివి, పుష్కరఘాట్ లో ఉన్న మునిసిపల్ హైస్కూల్లో ఫస్ట్ ఫారం అంటే ఇప్పటి సిక్స్త్ లో చేరాను... ఆ హైస్కూలు ఒక్కటే అపుడు మాకు దగ్గర...అయిదారు  కిలో మీటర్ల దూరముండేదేమో..... ఒక చేతిలో పుస్తకాల సంచీ, ఒక చేత్తో రెండుగిన్నెల క్యారియర్ తో భోజనం, వర్షాకాలమైతే గొడుగు.. ఈ లోడ్ అంతా భుజాలకి తగిలించుకుని లెఫ్ట్ రైట్....అరగంటపైన నడిచి స్కూలుకి చేరేవాళ్లం... లాగుడు రిక్షాలుండేవి, ఎప్పుడైనా ఎక్కేవాణ్ణి..  నా సెకండ్ ఫారంలో అనుకుంటా సైకిలురిక్షాలు వచ్చాయి.. ఆ రోజుల్లోనే సిటిబస్సు ఒకటో నెంబరు, రెండో నెంబరూ  వచ్చాయి.. ఒకటి పేపరుమిల్లునుంచి, గోదావరి స్టేషన్ దాకానే.. కాని మనటైమ్స్ కాదు. .. స్కూల్లో ఏ ఫంక్షనో అయి లేట్ అయితే, మా వీధిలోకి వెళ్లాలంటే భయం భయంగా ఉండేది... అలా చీకటడ్డాక వచ్చినప్పుడు మా వీధిలోకి తిరగ్గానే "దేముడా దేముడా" అనో , "జై వీరాంజనేయా" అనో అనుకుంటూ బిక్కు బిక్కు మంటూ వచ్చేవాడ్ని. (ఇప్పటికీ ఆ అలవాటు అప్పుడప్పుడు మనస్సులో మెదులుతుంది.)


మా ఇంటి ముందర మునిసిపాలిటీ దీపం.. శుభ్రంగా తుడిచి కిరసనాయిల్ పోసేవాడు.. చీకటి పడుతుంటే వెలిగించేవాడు... తమాషాగా వెన్నెల వచ్చేదాకా వెలిగి ఆ దీపం ఆరి పోయేది.. అంత కరక్ట్ గా పోసేవాడు.. ఆ దీపమే  మాకు లైట్ హౌస్.. దీపం వెలుగు అంతంత మాత్రమే కదా !  . దానివైపే చూస్తూ దేముడా దేముడా అని నెమ్మదిగా అనుకుంటూ ఇళ్లకి చేరేవాళ్లం...





ఇంట్లో హరికెన్ దీపాలు.. కోడిగుడ్డు దీపాలు. అమ్మ చిమ్నీలు శుభ్రంగా తుడిచి.. సాయంత్రం అయ్యేసర్కి వెలిగించి వీధిలో ఉన్న తాటాకు పందిరిలో ఇనుప కొక్కీకి ఓ హరికెన్ దీపం తగిలించేది.. అలా సాయంసంధ్యలో వెలిగే దీపం ఓ లక్ష్మీ శోభతో ప్రకాశించేది.. ఆ తాటాకు పందిరి క్రింద ఓ రౌండ్ టేబుల్.. దాని చుట్టూ మెట్రిక్ పరీక్షలకు, హిందీ పరీక్షలకు చదివే పిల్లగాళ్లకు నాన్నగారు పాఠాలు చెప్పేవారు.. అదో అందమైన దృశ్యం.

వర్షం వచ్చిందంటే మా పేట సంగతి ఇక అడక్కండి..   బురద కాలికి అంటుకుపోయేది. కాలు పెద్ద టైరు చెప్పులా అయిపోయేది.. ఆ బురదకాళ్లతో  బరువుగా రోబోలా అడుగులు వేస్తూ రోడ్డుమీదకి వచ్చి... అక్కడ వర్షపు నీటి గుంటల్లో కాళ్లు కడుక్కుని స్కూలుకి పోయేవాళ్లం... సైకిళ్ల మీద వచ్చిన వారి అవస్థ వర్ణనా తీతం.. క్రింద చెరువుల దగ్గరకి పోయో, లేకపోతే ఆ నీళ్లగుంటలదగ్గరనో గంటల తరబడి కడిగితేనే కాని  సైకిలు కదిలేది కాదు.. జిత్ మోహన మిత్రా ఇప్పటికీ మా ఇల్లుగురించి తలుచుకుని ఇదే చెప్తాడు... ఇప్పటికీ దెప్పుతూనే ఉంటాడు. 

అసలు రాజమండ్రిలో వర్షం వచ్చిందంటే ఎప్పుడూ పెద్ద సీనే.. మేం స్కూలుకి వెళ్లేదారిలో ఉన్న మరోపేట తుమ్మలావ.. అక్కడ శ్రీ ముదుగంటి సూర్యనారాయణగారని మా ట్యూషన్ మాష్టారు ఉండేవారు.. వర్షం ఏ కొద్దిగా పడినా తుమ్మలావలోఉన్న నాలుగు వీధులూ జలమయమై పోయేవి.. రెండుమూడురోజులుదాకా నీరు లాగేది కాదు..ఓ సారి నేను ట్యూషన్ కని బయలుదేరి.. ఆ నీటిలో ఉన్న వీధులు గుర్తు పట్టలేక... మాష్టారింటికోసం అలా తిరుగుతూనే ఉన్నాను.. చివరికి మేష్టారు స్కూలుకి బయల్దేరుతూ కనపడి.. "ఇంక చాల్లే వెతకడం, పద స్కూలుకి" అని స్కూలుకి తీసుకుపోయారు.. అంటే ఏడింటికి ట్యూషన్ లో ఉండవలసినవాణ్ణి తొమ్మిదిన్నరదాకా వెతుకుతూనే ఉన్నానన్నమాట... 

తుమ్మలావ, ఆర్యాపురంలోంచి ఓ కాలువ ఊళ్లో పడ్డ వర్షపునీటిని, మురికినీటినీ గోదావరిలోకి తీసుకువెడుతుంది.. గోదావరికి వరదలు ఒక స్థాయికి మించి వస్తే ఆ వరదనీరు ఊళ్లోకి రాకుండా ఆటోమెటిక్ గా ఈ కాలువ తలుపులు మూసుకుపోతాయి.. అప్పుడు ఈ మురికినీటికి దారి ఉండదు.. పేటల్లోకివచ్చేస్తాయి.. అదే టైములో వర్షం పడిందంటే ఇక ఊహించండి...  బయట వరద తగ్గేదాకా ఇదే పరిస్థితి.. అలా అలా ఈ మురికినీరు లెవెల్ పెరిగి, ముందు తుమ్మలావ, తరువాత ఆర్యాపురం వీధుల్లోకి వచ్చేస్తూ ఉంటుంది.. అప్పుడు రాకపోకలు చాలా బాధకరమైన పరిస్థితి. ఆ పరిస్థితి అప్పట్లో వర్షాకాలంలో నిత్యమూ ఉండేది.. ఇప్పుడు చాలా మెరుగైంది.

పాక అని చెప్పాను కదా.. దానిముందు కొంతకాలం తర్వాత నాన్నగారు పెంకుటిల్లు కట్టారు.. మూల పెంకు అంటారు, బంగలా పెంకు కాదు.. మూలపెంకు ఇంటిలో శీతాకాలం వెచ్చగానూ, వేసవికాలం చల్లగాను ఉంటుంది. ఆ పెంకుటింట్లో మా సామాను పెట్టి కొంతకాలం మేము శ్రీకాకుళం జిల్లా దేవాది అనే ఊరిలో ఉండాల్సివచ్చింది. ఆ దేవాది అండ్ ముబగాం ఎస్టేట్స్ కు మా పిన్నిగారు జమీందారిణి. వాళ్ల ఎస్టేట్స్ వ్యవహారం చూడ్డానికి నాన్నగారిని రమ్మన్నారు.. మేమూ వెళ్లాం.. అక్కడ చిన్న ఎలిమెంటరీ స్కూల్లో కొద్దికాలం చదివా.. దివానుగారబ్బాయిని కదా.. నేను వెళ్లాకనే స్కూలు ప్రారంభమయ్యేది.. మాష్టారు నన్ను "రండి బాబూ.."అంటూ పిలవడం లీలగా గుర్తు.. అలా పిలిపించుకోవడం తప్పని తెలుసుకోలేని వయస్సు.. ఆయన ప్రక్కన నాకు ఎత్తుగా బల్లో కుర్చీయో వేసి కూర్చోమనేవారు.. మిగతా పిల్లలు క్రింద కూర్చునేవాళ్లు.. దసరాలకు విల్లంబులు తీసుకుని, పద్యాలు పాడుతూ మా దివానానికి మేష్టారు, పిల్లలూ వచ్చేవారు.. అమ్మా, పిన్ని మేష్టారుకి పళ్లెంలో బట్టలూ,డబ్బులు ఇచ్చేవారు.. నేను పద్యాలు చదివేవాణ్ణి... మా మామయ్యగారబ్బాయికూడా నాతో చదివేవాడని గుర్తు... అక్కడనే శర్మగారని ఆ జమీలో పనిజేసి వృద్ధులైన ఒకాయన ఉండేవారు.. ఆయన చిలకమర్తివారిదగ్గర కొంత కాలం ఉన్నారట. ఆయన పిల్లలతో తమాషాగా మాట్లాడేవారు... తలనొప్పికి మందు చెప్పేవారు... పేను గుండెకాయ, తలుపు కిర్రు, నల్లి మెదడు... కలిపి నూరి బుర్రకు పట్టించాలట..... అక్కడ పెద్ద పెద్దతోటలు, గులాబిజాం మొక్కలు, తామర చెరువులు, దివానంలో గంట గంటకు కాలాన్ని సూచిస్తూ గంటలు కొట్టడం, దీపావళికి పనివాళ్లు బాంబులూ అవీ తయారుచేసి కాల్చడం... అదో జీవితం, కాని చాలా కొద్దికాలం.. ఆ తర్వాత కాకినాడ వచ్చేసాం.. అక్కడ భారతీ విద్యాలయంలో చదివా.. 

ఆ తర్వాత రాజమండ్రి....
రాజమండ్రి మునిసిపాలిటి అయినా మా పేటకు 1957 వరకు కరెంటు లేదు.. నేను యస్.యస్.యల్.సి చదువుతున్నప్పుడు మా పేటకు కరెంట్ వచ్చింది. అప్పుడు కూడా మా బాబాయి గారు మరొక పేటవాసికలసి స్తంభాలు, వైరు ఖర్చు భరిస్తే కరెంట్ ఇచ్చారు.. ఆ తర్వాత నేను రాత్రిళ్లు బాబాయి గారింటికి వెళ్లి చదువుకొనేవాణ్ణి.. 60W బల్బ్.. ట్యూబ్ లైటు లగ్జరీ.. అవి అందరూ వేసుకునేవారు కారు... ఆ తర్వాత మాకు కరెంట్ వచ్చింది.. 
అద్దె సైకిలు కావాలంటే సీతంపేట వెళ్లాలి.. అప్పుడు సైకిల్స్ అద్దెకిచ్చేవారు.. ఎరుగున్నవాళ్లకే ఇచ్చేవారు.. కోటగుమ్మందగ్గర ఇప్పుడు తుమ్మిడిరామకుమార్ గారి షాపు ఉన్నదగ్గర.. సైకిళ్లు పట్టుకుని ముందుకొచ్చె రెడీగా ఉండేవారు.. వాళ్లైతే అందరికీ ఇచ్చేవారు.. 

సీతంపేట మాకు డౌన్ టౌన్.. అక్కడ రామకృష్ణా హోటల్ .. చిన్నతనంలో హోటల్ కు వెళ్లడం అలవాటు లేదు.. కాలేజీలో జేరాక అప్పుడప్పుడు స్నేహితుల తోటి.. తరవాత్తర్వాత ఒక అలవాటైపోయింది.. చాలాకాలం ఆ అలవాటుండేది... ఇప్పుడు ఈ ధరలు చూస్తుంటే  అవసరమనిపిస్తేనే వెళ్లడం.. అదీకాక పాకెట్ మనీ చదువుకునే కుర్రాళ్ల జన్మహక్కు అని అప్పట్లో మాకు తెలియకపోవడం.. కష్టాల రుచి తెలుసున్నవాళ్లమో ఏమో, హోటళ్ల రుచి అంతగా అలవాటు కాలేదు.. సినీమాలు అంతే.. మీ టైములో ఇవన్నీ లేవు అంటాడు మా మనవడు... ఏమో అదీ నిజమేనేమో...

కాలేజీకి (1957-58), (1959-1962) వెళ్లాలంటే సీతంపేట మీదనుంచి, వీరభద్రాపురం పుంతలోంచి వెళ్లేవారం.. ఆ పుంత రోడ్డు పగలు కూడా వళ్లు దగ్గరెట్టుకుని నడవాలి.. ఎగుడుదిగుడుగా ఉండి ఎక్కడ పడిపోతామో అన్నట్టుగా ఉండేది. నిజానికి మాకు కాలేజీ అలా కోరుకొండ రోడ్డు మీదనుంచి దగ్గర.. కోరుకొండరోడ్డుకి వెళ్లాలంటే  పచ్చిక బయళ్లలోంచి, తుప్పల ప్రక్కనుంచి వెళ్లాలి అన్నమాట.. పగలు అప్పుడప్పుడు పెద్ద పెద్ద పాములు కూడా కనపడేవి.. 
1962 లో అందరికీ ప్రియతమ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిగారు రాజమండ్రి వచ్చారు..  విమానంలో మధురపూడి వచ్చి పేపరుమిల్లులో రక్షణ నిధికి ఇచ్చే విరాళం స్వీకరించడానికి మా వీధిలోంచి వెళ్లారు.. అప్పుడు మా రోడ్ కు మోక్షం వచ్చింది.. కోరుకొండ రోడ్ దాకా ఉన్న తుప్పలు నరికించి... శుభ్రం చేసి కచ్చారోడ్ వేసారు. ఇప్పుడు పక్కా  రోడ్ మా యల్.బి.శాస్త్రి రోడ్..ఇన్ మా శ్రీరామనగర్....సందడే సందడి....

కొద్దిగా రాజమండ్రిలోని మా పేట శ్రీరామనగర్ గురించి వ్రాసి బోరుకట్టాను కదా.. మళ్లీ తర్వతెప్పుడైనా మరల ఈ పనే చేస్తానేం ? అంతవరకు శలవు..


..

Sunday, August 12, 2012

about maalika.... a web magazine.

వెబ్ మాగజైన్... మాలిక మీరు చదువుతున్నారా...చాలా బాగా ఉంటోంది.. చక్కటి కథలు, వ్యాసాలు, హాస్యం అన్నింటికి తగిన అవకాశమిస్తూ మంచి రచనలు అందిస్తున్నారు.. మీ రచనలు కూడా పంపించవచ్చు... వివరాలకు www.magazine.maalika.org.in ద్వారా ఆ పత్రికను అందుకోవచ్చు. శ్రావణ మాసపు సంచిక అందుబాటులో ఉన్నది.. ఇప్పుడిక సంచిక ప్రతి రెండునెలలకూ విడుదలవుతుందని ప్రకటించారు. సంపాదకవర్గంలో జ్యోతివలబోజు గారిది ప్రముఖపాత్ర.. ఈ నెల రసజ్ఞ గారు జ్యోతి అనే రచనలో అగ్ని గురించి చాలా విషయాలు రసవత్తరంగా ... చక్కగా ... చెప్పారు..  మంచి మంచి రచనలు చదవమని కోరుతూ... నా రచన ... "ప్రమోషనులు..పరీక్షలు" కూడా ఉంది.. నాకు మాలిక వారు అందిస్తున్న ప్రోత్సాహమునకు నా బ్లాగుద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను....

Wednesday, August 8, 2012

కన్నయ్యా... కదలి రావయ్యా...



గోధూళీ ధూసరిత కోమల గోపవేషం, గోపాల బాలక శతై రనుగమ్య మానమ్
సాయన్తనే ప్రత్రిగృశమ్ పశుబంధనార్థం, గచ్ఛంత మచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం.
(కడుపునిండా మేత మేసిన గోవులను తోలుకొని, వాటిని వాటి వాటి స్థానాల్లో కట్టడానికి గోపాల బాలురతో కలసి... గోధూళి నిండిన దేహంతో వస్తున్న అచ్యుతునికి నమస్కరిద్దాము....)
వేదాంత వీధుల్లో తిరిగే వేదవేద్యుడు.. గోవిందుడై ... బృందావనంలో గోప బాలురతో గోవుల కాసుకుంటూ తిరుగుతున్నాడంటే ఏమాశ్చర్యం ?

"ఒక పులినతల మండప మధ్యమున మహేశ్వర ధ్యానము చేసుకుంటున్న సమయంలో" పోతనగారికి 
తన ముందు ఆజానుబాహుడైన రాజకుమారుడు సాక్షాత్కరించాడట... ఘనమేఘముతో ఉన్న మెఱపుతీవలా  ఒక స్త్రీమూర్తి ఆతడి ప్రక్కన శోభిస్తున్నదట .. చంద్రునిలాగా అమృతమయమైన చల్లని చిరునవ్వు ఆతడి మోమున వెలుగుతోందిట..... మూపున విల్లంబులు, అరవిందములబోలు విశాలనేత్రములు, నీలాకాశములో మెరిసే భానునిభంగి ఘన కిరీటముదాల్చిన ఆ అందగాడు తనని శ్రీరామభద్రునిగా పరిచయంచేసుకుని (తెలుగువారి భాగ్యమా అన) భాగవతము తెలుగులో వ్రాయమని పోతనగారిని  ఆదేశించినాడట... ...
                               భాగవతమంటేనే శ్రీ కృష్ణుడు..
భగవంతుని కథ భాగవతము::భాగవతుల కథ భాగవతము::భాగవతము అనే పదే పదే అన్నా బాగౌతాము...
భా.. భక్తి; గ ...జ్ఞానం; వ ... వైరాగ్యము... భక్తి జ్ఞాన వైరాగ్య తాత్పర్యమే భాగవతమని ఒక నిర్వచనం చెప్పారు.
వ్యాసకృత భాగవతాన్ని మందార మకరంద మాధుర్యంలో ముంచి అందించారు పోతనగారు........

భీష్ముని పైకి కుప్పించి లంఘించు గోపాల కృష్ణుని కుండలాల కాంతి
కరిరాజు మొఱపెట్ట పఱువెత్తు కఱివేల్పు ముడివీడి మూపుపై బడిన జుట్టు
సమరమ్ము గావించు సత్య కన్నులనుండి వెడలు ప్రేమక్రోధ వీక్షణములు
కొసరి చల్దులు మెక్కుగొల్ల పిల్లల వ్రేళ్ల సందు మాగాయ పచ్చడి పసందు
ఎటుల కనుగొంటివయ్య ! నీ కెవరు చెప్పి
రయ్య ! ఏ రాత్రి కలగంటివయ్య ! రంగు
కుంచెతో దిద్దితీర్చి చిత్రించినావు !
సహజ పాండితి కిది నిదర్శనమటయ్య !

(ఆయుధం ముట్టనని చెప్పాడు అర్జునునికి... కాని తన అనన్య భక్తుని రక్షించడానికి తన ప్రతిన కూడ మరచి రథాంగపాణియై భీష్మునిపైకి లంఘించాడు..
భార్యామణితో సరససల్లాపములలో తేలియాడుతున్న గజేంద్రుని ఆర్తనాదము వినగానే ఉన్నపళంగా పరుగెత్తాడు.. సంగటికాళ్లకు చల్దులు మాగాయ పచ్చళ్లతో నంజి మరీ నోటికందించిన అమ్మ కారుణ్యము కృష్ణుడు...... తన కవితామృతంతో భక్తుల హృదయాలను తడిపేసాడు తెలుగుకవి.....(జంధ్యాల పాపయ్యశాస్త్రిగారి అందమైన భావన ఈ పద్యం)

అద్వైత సిద్ధిపొందిన కారణ జన్ముడు పోతన...
కనుకనే  గోధూళితో ప్రకాశించే బాల కృష్ణుడు.. బూతి పూసుకున్న బాల శివునిలా దర్శనమిచ్చాడు పోతనగారికి....

తనువున నంటిన ధరణి పరాగంబు, పూసిన నెఱిభూతి పూతగాగ
ముందఱవెలుగొందు ముక్తాలలామంబు తొగలసంగడికాని తునకగాగ
ఫాల భాగంబుపై బరగు కావిరి బొట్టు కాముని గెల్చిన కన్ను గాగ
గంఠమాలికలోని ఘన నీలరత్నంబు కమనీయ మగు మెడ కప్పుగాగ
హారవల్లు లురగహారవల్లులు గాగ బాల లీల బ్రౌఢ బాలకుండు
శివుని పగిది నొప్పె శివునికి దనకును వేఱులేమి దెల్ప వెలయునట్లు....

.....................................శివాయ విష్ణురూపాయ... శివ రూపాయ విష్ణవే

విప్రా గావశ్చ వేదాశ్చ తపస్సత్యం దమశ్శమః
శ్రద్ధా దయా తితిక్షా చక్రతవశ్చ హరేస్తనుః 
బ్రాహ్మణులు, గోవులు, వేదాలు, తపస్సు, సత్యం, దమం, శమం, శ్రద్ధ, దయ, సహనం, యజ్ఞం ఇవన్నీ విష్ణువు శరీరాలు...అని శాస్త్ర వచనం..

నీ నామము భవహరణము
నీ నామము సర్వ సౌఖ్య నివహకరంబు
నీనామమమృత పూర్ణము
నీ నామము నే దలంతు నిత్యము కృష్ణా...

కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయచ
నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః

చూపులకు చిన్ని వటువు... పలకరిస్తే పరమాత్మ..
బలి చక్రవర్తి ప్రశ్నలు వేసాడు.......
"వడుగా...ఎవ్వరి వాడ వెవ్వడవు, సంవాస స్థలంబెయ్యది..". 
"ఇది నాకు నెలవని.. (నా చోటు అని) యే రీతి బలుకుదు.. నొకచోటనక నిండియునేర్తు" (అంతాటా నిండిన విష్ణువుకదా మరి)
"ఎవ్వరి వాడనని ఏంచెప్తాను నా యంతవాడనై నేనై తిరుగుతూ ఉంటాను"
"నీ నడిచేదెక్కడ అంటే ముల్లోకాలములలోను తిరిగే నేను ఫలాన చోట తిరుగుతానని చెప్పలేను"
తను ఎక్కడ ఉంటాడో చెప్పాడు... చేతనైతే పట్టుకో మంటున్నాడు...
ఎవరి వాడవంటే... అందరూ నాకు ఆత్మీయులే... అంటాడు.. 
తొలి సిరి గలదుట.. పాపం వటువుగా ఉన్నప్పుడు ఆవిడ లేదుకదా మరి..

ఆఖరిగా.. "సుజనులయందు దఱచు చొచ్చియుందు.."
నేను సజ్జనుల మధ్య ఉంటానని .. చెప్పాడు... 
పట్టుకోవాలంటే సజ్జన సాంగత్యమొక దారి... ఒ క్క టే దారి.


Wednesday, August 1, 2012

రా రండోయ్... నా పుట్టిన రోజుకి రారండోయ్...







"ప్రతీ సారీ ... నేనే గుర్తు చెయ్యాలా ? "
"ఏమైందమ్మా ఏమైంది.?" అడిగా బ్లాగుని
"ఇవ్వాళ ఎంత తారీఖు?"
"ఆగష్టు రెండు"
"అంటే ?" అడిగింది బ్లాగ్..
"అంటే.. ఏముంది, ఇంకో పదమూడురోజుల్లో స్వాతంత్ర్య దినోత్సవం.." చెప్పా..
"అంతేకాని నా జన్మదినోత్సవం గుర్తు లేదన్నమాట." నిలదీసింది బ్లాగు.
",,,, ఓహ్ ?.. అవును కదూ... అప్పుడే రెండేళ్లయిపోయింది"
"అదే మరి.. ఈ మధ్య నన్నసలు పట్టించుకోవటం లేదు... అన్నీ రెడీ చేసాను.. ఫన్క్షన్ చెయ్యి.." ఇంక తప్పదు..
"ఏం చేద్దాం.. ఎలా చేద్దాం.."
" వెన్యూ రెడీ... కేక్ రెడీ.." చాలా స్పీడుగా ఉంది.
"మనవాళ్లు పెరిగారు.. అందర్నీ పిలవాలంది..."  నాకర్థం కాలేదు... అదే అడిగా రెండేళ్లకి కనీసం అయిదువేలమంది కూడా చూడలేదు.. ఆ చూసిన నాలుగువేల అయిదువేలమందిలోనూ... ఏరోజు ఎంతమందిచూసారో అనుకుంటూ మళ్లీ మళ్లీ మనమే చూస్తున్నాము.. అలాంటప్పుడు సర్కిల్ పెరిగిందని ఎలా అంటావు అని అడిగా.. పిచ్చి మొహమా ఆ రీడింగు తప్పు.. కావాలంటే వీక్షణలు చూడు.. పదహారువేలు దాటి పోయారు.. ఆమధ్య నేను తప్పిపోయినప్పుడు.. మీటరు చెడి పోయింది.. జీరో జీరొకి వచ్చేసి.. నాలుగు వేలే చూపుతోంది.. కరక్ట్ ఫిగర్ పదహారువేల ఎనిమిదివందల ముప్ఫై అని గణాంకాలు చెప్పేసింది...వచ్చినవాళ్లని ఉద్దేశించి నువ్వు ఏమైనా చెప్పు అని ఆర్డర్ వేసింది...... వారి వారి మాటలు వారి వారి వ్యాఖ్యల్లోనే....

బ్లాగు పెట్టిన కొత్తలో .. నన్ను కొత్త మిత్రుడుగా పరిచయం చేసుకున్నప్పుడు తను అన్న మాటలు సురేఖ గారు గుర్తు చేసుకున్నారు.
" మన హాసం క్లబ్ లొ మన ఇద్దరిని చూసి అంతా " అహ " అన్నారు.( అప్పారావు,హనుమంతరావు). మీరూ బ్లాగులో(కా)నికి ప్రవేశించడం బ్లాగు బ్లాగు. నవ్వుల పువ్వులు మన బ్లాగర్ల పై విసరండి !. *** (సురేఖాచిత్రం)

నిజంగాచెప్తున్నాను... బ్లాగు ఆత్మీయతలను పెంచింది. ఉపయోగించడం మన లోపమే కాని ఎంతో మంది అభిమానంగా పలకరిస్తున్నారు .. ఈ మధ్య బ్లాగు ద్వారా పరిచయమైన శ్రీ బులుసు సుబ్రహ్మణ్యంగారు సతీ సమేతంగా మా ఇంటికివచ్చి ఆనందం కలుగ జేసారు.

లో బ్లాగున్నారా ?లో నా తరఫునా, నా శ్రీమతి గారి తరఫునా మీకు, మీ శ్రీమతి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ ఆతిధ్యానికి, ఆత్మీయతకి కృతజ్ఞతలు. మా ఆవిడ ఫోటోలు బ్లాగు కెక్కించినందుకు ఆమె ఆనందభరితయైనది. మీకు నా ద్వారా కృతజ్ఞతా పూర్వక ధన్యవాదాలు తెలిపింది. ఇప్పటిదాకా నేనా పని చేయనందుకు నాకు...... నేనూ ఫోటోలు తీసాను కానీ ఫోటోలో ఎవరూ పడలేదు. కెమేరానే కింద పడింది.....దహా...బులుసు

వయో బేధం లేకుండా బ్లాగు పోస్టులు చదివి అభినందించారు.. మా రాజమండ్రి గురించి వ్రాసినప్పుడు ఎంతమంది స్పందించారో ... చాలా ఆనందమైంది.
ఒకాయన "నాది రాజమండ్రి కాదు; మీ జనరేషను అసలే కాదు. కానీ మీ టపా ఏ మాత్రం బోర్ కొట్టించలేదు. ఇట్టే చదివేశా! చాలా బాగుందండి..    "

రాజమండ్రిలోని వేణుగోపాలస్వామి ఆలయం గురించి చదివిన మిత్రులు దాని వివరాలు అడిగి తెలుసుకుని వచ్చి చూసి ఆనందించి నాకు తెలియజేసారు. ఆ సమయంలో నేను ఊళ్లో లేను... ఆయన్ని కలుసుకునే భాగ్యం లేకపోయింది.

రాజమండ్రి ఊసులు..ఉస్సూరుమంటూ...4లో హనుమంత రావు గారు, మీరు చెప్పిన ఆనవాల ప్రకారం వెళ్ళి ఈరోజు స్వామి వారి దర్శనం చేసుకున్నాను. కోవెల చాలా బాగుంది. పూజారి గారు ఊరికి కొత్త అని కూడా అడిగారు అన్ని పరిశీలిస్తుంటే. ఆకడ గోడకి పెట్టిన శాసనాలు చదవడానికి ప్రయత్నించాను. మీ వల్ల ఈ రోజు మంచి దర్శనం అయ్యింది. సంతోషం. ప్రస్తుతం అక్కడ రోజూ తిరునక్షత్ర పూజలు జరుగుతున్నాయి అంట. ధన్యవాదాలు
రాజమండ్రి మీద మరొక చిరకాల మిత్రుని వ్యాఖ్య...
" EXCELLANT.i am feeling I am unfortunate I am forced to leave Rajahmundry.Many Many happy memories many many friends like you keep me active today.Please add some more happy memories I too will recollect and communicate to you. Regards and best wishes kvshastri   
ఆ మధ్య పడ్డావుగా... అదీ వ్రాసావు.. చెప్పు మరి.. అంది బ్లాగు..
ఒక సారి కాదు మూడు సార్లు... దానిక్కూడా మంచి స్పందన వచ్చింది.

..... పడి పడి పడి...మూడుసార్లు పడిన రావుగారులో అయ్యా పడ్డ వాళ్లెప్పుడూ చెడ్డవాళ్ళు కాదండీ. అలాగే మీరు చిరకాలం పడిన పడి పడకుండా దిగ్విజయంగా పడుతూ ఉండాలని మా ఆకాంక్ష. నిరంతర పడి ప్రాప్తిరస్తు......(మిస్సన్న)
...... పడి పడి పడి...మూడుసార్లు పడిన రావుగారులో అయ్యో పడ్డారా పాపం. ముందే ఎందుకు చెప్పలేదు సార్. పడకుండా పట్టుకునే వాళ్ళం. పడితే ఇంత మంచి హాస్య టపా రాస్తారు అన్నమాట..... దహా (బులుసువారు)

మేమ చేసిన యాత్రా విశేషాలతో పోస్ట్ కు...   
 sir namaskaram andi, meru mi yatrani baga vivarincharu andi. sir nenu kuda ee madya MAHABALIPURAM & RAMESWARAM vellanu andi, vatini kuda mi stayilo kakapoyina edo natoliprayantnamga rasanu.. mi lanti peddalu oksari chusi cheppagalaru.. http://rajachandraphotos.blogspot.com-------rajachandra akkireddi

ప్రయాగ, అయోధ్య, నైమిశారణ్యం.... యాత్రలో హనుమంతరావు గారూ..!! నమస్కారం. మీ అనుభవాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు. మళ్ళీ మా కాశీయాత్ర నాటి జ్ఞాపకాలు గుర్తుకి తెచ్చారు. త్రివేణీ సంగమంలో స్నానాలూ, వేణీదానం, ఆ చిన్న పడవలలో వెళ్ళడం, ఆ పక్షులు, అన్నీ మళ్ళీ కళ్ళకు కట్టాయి. గురువు గారితో పాటు యాత్ర చేసి వారి ప్రవచనాలు వింటూ ఆ ఆద్యాత్మికతలో ఓలలాడిన మీ బృందానికి మనఃపూర్వక అభినందనలు.--------రాధేశ్యాం

   
ఇక మా బ్లాగ్గురువుగారున్నారు జ్యోతి వలబోజుల.. ఏ సమస్యకైనా ఆమె దగ్గరకే పరుగెడ్తాను.. ఆవిడా అంత ఓపిగ్గానూ గైడ్ చేస్తారు.. ఓ సారి బ్లాగు కనపడక పోయింది.. ఆవిడకి మొర పెట్టా... పువ్వుల్లో పెట్టి బ్లాగులో పెట్టారు...అప్పుడు మెత్తగా పెట్టిన చీవాట్లు చూడండి.

" బ్లాగు మొదలెట్టి, రెండు మూడు టపాలు గెలికి వదిలేస్తే అలగదా మరి?? ఇకనైనా దాన్ని అలా వదిలేయకండి. మీరే దానికి దిక్కు.. పాపం కదా..-------------జ్యోతి.
ఆవేళ అనుకున్నా విడవకుండా రోజూ వ్రాయాలని.. ఇప్పుడు కూడా అదే అనుకుంటున్నా...రోజూ వ్రాయాలని... సరే మొత్తంమీద నా బ్లాగుకూడా నచ్చిన వారున్నారని ఆనందం.. ఆధ్యాత్మికం వ్రాసినప్పుడు కూడా మంచి స్పందన. అసలు పాయింట్, అంతటా నిండిన చైతన్యరూపం, కృష్ణాష్టమి.. అలాంటివే.
శ్రీ హనుమద్ర్వతంలో "రామాయణంలోని పాత్రలు : హనుమంతుడు" - ఒక పరిశీలన. సమగ్రమైన వివరణ. హనుమద్భక్తులైన మీకే సాధ్యం. అభినందనలు....మిస్సన్న
శ్రీ హనుమద్ర్వతంలో ఇప్పటిదాకా మీ బ్లాగు చూడలేకపోయాను .చాలాబాగావ్రాస్తున్నారు ,,దుర్గేశ్వర్   
లండన్ నుంచి ఓ మిత్రుడు......   
హాసం క్లబ్ రాజమండ్రిలో Dear Sri Hanumantha Rao garu, Namaskaramulu. I have a limited knowledge and experience as compared to the very senior and experienced people on this blog. Your effort prove the blog to be a group of very young minds ( as they say, the age is determined by the state of mind and its activity). Keeping up the spirit of your name, You are providing the real needed 'sanjeevani' through this blog, for all those who might lose the zest of their lives -by missing happiness and smiles. My hearty wishes for making us smile and please keep it up. reverence & hearty love to you for taking up a great activity, DNS Siva Kumar, Leicester, UK

చాన్స్ ఇస్తే సోది బాగానే కొడతావు.. నీ ఫ్యూచర్  చెప్పుమరి. అని సణిగింది బ్లాగు..
నా బ్లాగుకి అనుబంధంగా విజయగీతిక అని ఒక బ్లాగు తెరిచా.. మా ఆవిడకి పాటలు పాడ్డం ,,, వినడం ... ఇష్టం...ఈ మధ్య వ్రాస్తోంది కూడా... ఆ పాటలు అందులో పోస్ట్ చేద్దామని.. ప్రయత్నం మొదలెట్టా ... ఇంకా పెర్ పెక్షన్ రాలేదు... ఆడవారికి సంబంధించిన మాకు తోచిన విషయాలకు కూడా అదే బ్లాగుగా చెయ్యాలని. అని చెప్తుండగానే... మా వాడికి అయిడియాలు మంచివేనండి, కాని ఈ మధ్య ఆ ఫేస్ బుక్ ఒకటి పట్టుకున్నాడు.. ఇది తగ్గించాడు అని గొణిగింది.. అదేం కాదండీ... అది అప్పటికప్పుడు స్పందన ఉంటుంది. చాటింగ్ ఉంటుంది.. అందుకని ఓ ఆకర్షణ.. అని అంటూండగానే ఆ స్పందనలన్నీ లైకు.. డిస్ లైకు అంతే కదా...అంది బ్లాగు.
సర్లే.. ఇంక నీ సోదె ఆపి .. అతిథి సత్కారాలు చూడు... చాలా దూరం నుంచి అభిమానంగా వచ్చారు.. అనగానే ఒక్కసారందర్నీ మొదట్లో చూడమను.. అదిరిపోయే సెట్టింగు... నోరూరించే కేక్... ఆ ఫోటో నువ్వూ ...అండ్  సుబ్రహ్మణ్యంగారు... నా బ్లాగులో...