Pages

Showing posts with label నాలోకి నేను. Show all posts
Showing posts with label నాలోకి నేను. Show all posts

Sunday, September 11, 2011

అసలు పాయింట్


కాలేజీలో చదువుతున్న రోజుల్లో...సైన్సు విద్యార్థులకు వాల్యుమెట్రిక్ అనాలిసిస్ అనేది ఒక ప్రయోగం. పైన బ్యూరెట్ లో పొటాషియమ్ పెర్మాంగనేట్ (రంగు ద్రవం)నింపి, క్రింద గాజుకుప్పెలో ఆక్సాలిక్ ఆసిడ్(తెలుపు రంగు) నింపి...చేసే ప్రయోగం... ఒక్కొక్క చుక్కా బ్యూరెట్ లోంచి గాజుకుప్పెలో పడుతుంటే క్రమంగా తెలుపు రంగులో మార్పు వచ్చి ఒక పాయింట్ దగ్గర పింక్ కలర్ వస్తుంది. ఇంక ఒక చుక్క వేసినా ఆక్సాలిక్ ఏసిడ్ ద్రవంయొక్క తెలుపు రంగు మొత్తం పొటాషియం పెర్మాంగనేట్ కలర్ లోకి మారిపోతుంది.. అప్పుడు ఇంక ఎక్స్ పెరిమెంట్ గోవిందా! గోవింద !! అదిగో సరిగ్గా ఆ టర్నింగ్ పాయింట్ దగ్గర రీడింగు తీసుకుని ప్రయోగం పూర్తి చేస్తారు...

ప్రయోగం గురించి చెప్పడం ఇక్కడ ఉద్దేశ్యంకాదు... ఆ టర్నింగ్ పాయింట్ అంటే ఎండ్ పాయింట్ కోసం మనం పడే కష్టాలు.. పింక్ కలర్ వచ్చేసినట్టే ఉంటుంది.. నమ్మకం కలగదు ప్రక్క వాడిని అడుగుతాం... ఎండ్ పాయింట్ వచ్చిందా అని...వాడు ఆ గాజుకుప్పెను పైకెత్తి, ట్రైను/విమానం మిస్సవడంవల్ల నోబెల్ బహుమానం తనకు మిస్సయి పోయింది తప్ప మరో కారణం కాదు అన్నట్టుగా, ఆర్కిమెడిసో, ఆర్థర్ ఎడిసనో అన్నట్టుగా ఓ పోజు కొట్టి... కూసింత మౌనం పాటించి .. ఆ తర్వాత...... అప్పుడంటాడు..."రీడింగ్ నోట్ చేసుకుని ఓ డ్రాపు వేయండి" అని ఇప్పటిదాకా చాలాసేపట్నుంచి మనం చేసేదదే ! కాని శంఖువులో పోసే తాపత్రయం... ఎండ్ పాయింట్ కోసం.....


కట్ చేస్తే...."డాక్టర్ గారు ! ఎడమ భుజం లాగుతోందండి...చాలా బాధపెడ్తోంది". "ఎప్పట్నించి.." మొట్టమొదటగా డాక్టర్ ప్రశ్న..."అంటేనండీ.." ఈలోగా డాక్టరు గారు నొక్కి చూస్తారు. ఇక్కడ ఉందా, ఇక్కడ ఉందా..అంటూ...నొప్పి వచ్చిన క్షణం మనం చెప్పగలిగితే, ఏ పాయింట్ లోనొప్పిఉందో వివరించగలిగితే వైద్యానికి సహకారం... మందు కూడా పని చేస్తుంది...అదిగో ఆ పాయింట్ కావాలి.

ఏదైనా వ్యాపారం ప్రారంభిస్తాము...అది కట్టెల వ్యాపారం కావచ్చు..పువ్వుల వ్యాపారం కావచ్చు. వేలల్లోనూ లక్షల్లోనూ కావచ్చు, కోట్లలో కావచ్చు...అది ప్రారంభించినప్పుడు అన్నీ ఖర్చులే ఉంటాయి. అది ఉత్పత్తి ప్రారంభించాలి ...జనానికందాలి.. అప్పుడు ప్రోడక్ట్ అమ్మకం పెరుగుతూ ఉంటే క్రమంగా నష్టాలు తగ్గి లాభాల వైపు సాగుతుంది వ్యాపారం. అదిగో ఆ బ్రేక్ ఈవెన్ పాయింట్ కావాలి...వ్యాపారం యొక్క ఆరోగ్యంకరమైన అభివృద్ధికోసం...ఆ బి.ఇ.పి ఇవతలే స్తిరపడిపోయామా ఇక వ్యాపారం దివాలా అని అర్థం. అంచేత వ్యాపారం యొక్క జాతకం ఆ పాయింట్ మీద ఆధారపడి ఉంది.

వాఘా సరిహద్దు అవతల తస్మదీయుడు, ఇవతల అస్మదీయుడు...ఆ సరిహద్దు ఇంపార్టెంట్.

వివాహముహూర్తం..నెత్తిమీద జీలకర్ర పెట్టాడా గృహస్తు, పెట్టకపోతే బ్రహ్మచారి. అప్పటిదాకా వధువు 'ఆడ' పిల్ల .. ముహుర్తం అయ్యాక 'ఈడ' గృహిణి.


ఇలా నిత్యజీవితంలో బాగుపడ్డానికైనా పాడవడానికయినా ఓ పాయింట్, ఓ క్షణం ఉంటుంది...అది చాలా విలువైనది. ఆ పాయింట్ చేరేదాకా నిరాశాజనకంగా సాగే జీవితం, ఆశావహం అయ్యేది ఆ పాయింట్ చేరాకనే...


ఆధ్యాత్మిక జీవనయానంలో కూడా చేసే సాధన సిద్ధి పొందాలంటే ఒక పాయింట్. ఆ పాయింట్ దగ్గరనే మన సాధన జరగాలి అంటారు విఙ్ఞులు.. రాత్రంతా అలసి నిద్రపోయిన మన బాహ్యేంద్రియాలు ఉదయ రాగాలతో నెమ్మదిగా జాగృతమయ్యే సమయం... తమస్సులోంచి వెలుగులోకి ప్రవేశించే సంధ్యా సమయం... ఆ ఉదయ సంధ్య చాలా విలువైనది.. ఆ సమయంలో మన మేధస్సు నిశితంగా ఉంటుంది... మనం చేసే పనికి సత్ఫలితాలను ఇస్తుంది... విద్యార్థిదశలో విద్యనభ్యసించేందుకు అనువైన సమయం బ్రాహ్మీముహుర్తమే...ఆధ్యాత్మిక జీవనంలో ఆ బ్రాహ్మీ ముహూర్తంలోనే ఉపాస్య దైవాన్ని ఉపాసించాలి...ఆ ప్రశాంత సమయంలో సాధన చేస్తే గొప్ప ఆనందం అనుభవమౌతుంది...అదే ప్రాతఃకాల సంధ్యావందనం. సవితృ మండల మధ్యస్థ అయిన గాయత్రీ ఉపాసన.

అలాగే బాహ్యజగత్తుతో సంబంధం ఏర్పరచుకొని లోకవ్యవహారంలో కొట్టు మిట్టాడుతున్న జీవుల భౌతిక దృష్టి తగ్గి అంతఃచ్ఛక్షువులు తెరచుకోడానికి - తొలి గడప -- సాయంసంధ్య... అది దాటితే నిర్మల నిశ్శబ్ద నిశాసమయంలోకి జారుకుంటాం. - అంతఃమధన ప్రారంభమౌతుంది...ఆ మథనం ఆధ్యాత్మిక విషయంగా అయితే ఆనందమే మరి.


యా నిశా సర్వ భూతానాం, తస్యాం జాగర్తి సంయమీ
యస్యాం జాగ్రతి భూతాని, స నిశా పశ్యతో మునేః

(భూత జాలములన్నింటికీ యేది రాత్రియో అది జితేంద్రియుడగు యోగికి పట్టపగలు,
సనస్త భూతములకు ఏది పగలో అది విఙ్ఞుడగు ద్రష్టకు రాత్రి....అని గీతా వాక్యం.)


అగ్ని సోమాత్మకమైన జగత్తులో సోముని చల్లదనం ఆస్వాదించగలిగే తరుణసమయం.... సాయంసంధ్య....ఆ సమయంలో ఉపాసన అవసరమంటున్నది శాస్త్రం. అలాగే మరో రెండు సంధ్యలు....ఉదయం నుంచి భాను ప్రతాపం పెరిగి పెరిగి ..ఒక దశనుంచి తగ్గడం ప్రారంభించే మధ్యాహ్న సంధ్య; అలాగే అర్థరాత్రి... ఇలా నాలుగు సంధ్యలు ఉపాసనా సమయాలు అని ఋషివాక్యం... ఒక దశనుంచి రెండవ దశకు మారే పాయింట్... ఏ దశాలేనిది ఆ మధ్యపాయింట్.....అదే ఇక్కడ పాయింట్.


పాపం...మన హిరణ్యకశిపులవారు.... నూరు దివ్యసంవత్సరాలు తపస్సుచేసి...ఈ పాయింట్ మరచిపోయి... బ్రహ్మగారు ప్రత్యక్షమైతే ఏమడిగారు ?

"గాలిం గుంభిని నగ్ని నంబువుల నాకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములం ........" అంటూ గాలిలోనూ, నేలలోనూ, అగ్నిలోనూ నీటిలోనూ, ఆకాశంలోను...రాత్రి పగలు, లోపల బయట అంటూ పెద్దలిష్టిచ్చి ఇందులో ప్రాణం ఉన్నవాటిచే
కాని, ప్రాణం లేని వాటిచేత కాని ... మరణం ఉండకూడదు అన్నారు...అదికాని ఇదికాని అంటూ ద్వంద్వాలే చెప్పాడు కాని...ద్వందాలమధ్యన ఉండే పాయింట్ గమనించలేదు పాపం.
...ఇక్కడా అక్కడా అంటావేమిటయ్యా వెర్రినాన్నా కాలస్వరూపుడైన ఆ పరమాత్మ "కలడంబోధి గలండు గాలి..." అంతటా ఉన్నాడు అని క్లారిఫై చేస్తూనేవున్నాడు తనయుడు- తలకెక్కలేదు, బ్రహ్మవరప్రసాద గర్వం తలకెక్కింది.. వరాలు పుచ్చుకున్న పెద్దరాక్షసుడు గమ్మునుండకుండా "... దిక్పాలుర పట్టణముల గొనియె నతడు బలమున నధిపా...". దాంతో... ఆ దైత్యుని శిక్షించడానికి, తన భక్తుని రక్షించడానికి అవతారమెత్తక తప్పలేదు ఆ శ్రీమన్నారాయణునికి... హిరణ్యకశిపుని కోరిక, బ్రహ్మ యిచ్చిన వరాలు దృష్టిలో ఉంచుకుని ఆ సర్వాంతర్యామి తన ఆహార్యాన్ని డిజైన్ చేసుకున్నాడు.
"శ్రీ నరసింహాకృతి నుండె నచ్యుతుడు నానా జంగమ స్థావరోత్కర గర్భంబులనన్ని దేశముల నుద్దండ ప్రభావంబునన్."--- "ఇట్లు కేవలపురుష రూపంబును మృగరూపంబునుంగాని నరసింహరూపంబున, రేయునుం బవలునుంగాని సంధ్యా సమయంబున..." ఆ పాయింట్ లో పరతత్త్వం...
"ద్వంద్వాలు మరచిపో...ఆ పాయింట్ లో ఉన్న నన్ను పట్టుకో" ...అని హెచ్చరిస్తున్నది...అది
"....హరిమాయారచిత మగు యదార్థము సూడన్" అది నరసింహ తత్త్వం...అది సంధ్యోపాసన.


జరిగిపోయినకాలం ఇక రాదు... రాబోయేకాలం తెలియదు... నిరంతరంగా సాగిపోయే
అనుభవమయ్యేది ఒకే ఒక్క క్షణం....ఒక చిన్న బిందువు...పాయింట్ అదే...

బ్రహ్మ, విష్ణువులు నేను గొప్పంటే నేను గొప్ప అనుకుంటుంటే మధ్యలో పొడసూపింది ఓ జ్యోతి స్వరూపం...
ఎక్కడో పాతాళంనుంచి అనంతాకాశంలోకి జాజ్వల్యమానంగా ఎదిగిపోతోంది...స్తంభాకారంగా ఉన్న ఆ అఖండజ్యోతి... ఆద్యంతాలు చూడాలనిపించింది ఈ గొప్పవాళ్ళకి... ఎంతవరకు ఎదుగుతోందో చూడాలని ఊహలరెక్కలతో
భవిష్యత్ లోకి పయనించాడు బ్రహ్మ-హంస రూపంలో ...
ఎక్కడనుంచి వచ్చింది అని చరిత్ర తవ్వడం మొదలెట్టాడు విష్ణువు - వరాహరూపంలో.

ఎరగని భవిష్యత్తులో కాదు...తిరిగి పొందలేని భూతకాలంలో కాదు ఎదురుగా వాస్తవంగా ఉన్న జ్యోతిని చూడగలగాలి ... ఉపాసించాలి.... అదీ...పాయింట్.


నిర్మల ఆకాశంలో ప్రాభాత సమయాన మారే వెలుగుల జిలుగులు... సాయంసంధ్యలో దర్శనమిచ్చే అరుణిమలు... ఆ సంజె వెలుగులలో దేశ కాల పరిస్థితుల కతీతంగా ఉండే ప్రత్యక్ష నారాయణుని.....విశ్వనట చక్రవర్తిని భావిద్దాము... ఆనందస్వరూపుని అనుభవంలోకి తెచ్చుకుందాం.

Tuesday, October 26, 2010

అంతటా వున్న చైతన్యస్వరూపం


ప్రభాతసమయం....శారదరాత్రినాటి వెన్నెలకాంతులు...అరుణోదయపు పసిడి వెలుగులో మమేకమౌతున్నాయి. నిర్మలమైన ఆకాశం....బాలభానుని లేలేత బంగరు కిరణాలు నులివెచ్చగా శరీరాలను తాకుతున్నాయి. అప్పుడప్పుడే ప్రకృతి వళ్ళు విరుచుకుంటోంది. పక్షుల కిలకిలారావాలు వింత వింత సంగీత స్వరాలు పలికిస్తున్నాయి.లేత నీలపురంగు ఆకాశంలో వుదయపుటెండ ప్రతిఫలిస్తోంది... ఏ చిత్రకారుడూవేయలేని కొంగ్రొత్త రంగుల కలయికతో ఆకాశపు కాన్వాస్ పై ప్రయోగాలు జరిగిపోతున్నాయి. నిత్యనూతనత్వంతో ప్రకృతి పులకరించి పోతోంది.మనసు ఆనంద పరవశమౌతుంటే...యేవేవో ఆలోచనలు...యేవేవో ఙ్ఞాపకాలు..యెక్కడో చదివినవి, యేమహనీయుని నోటనో విన్నవి.....

అయోధ్యా నగరం....రాజప్రాసాదం....శ్రీ రామచంద్రుని శయన మందిరం....సీతాపతీ, రఘుకులదీపకుడూ, అరవిందదళాయతాక్షుడూ, అప్రమేయుడూ, ఆజానబాహుడూఅయిన శ్రీరామచంద్రుడు హంసతూలికా తల్పంపై శయనిస్తున్నాడు. తటాలునమేల్కాంచి...తల్పం మీదనుండి దిగి బయల్దేరాడు. సీతమ్మకు చెప్పక...కోదండాన్నీ గైకొనక,పరివారమూలేక,,,హనుమనూ గమనింపక, అలా వున్నవాడు వున్నట్టు బయల్దేరాడు.
మునివాటిక....ఆశ్రమవాతావరణం....లేళ్ళూ, నెమళ్ళూ మగతలో వున్నాయి....గోశాలల్లోఆవులు నెమరు వేస్తున్నాయి...పచ్చటి చెట్లు వెచ్చగా నిద్రిస్తున్నాయి....రంగవల్లులతో శోభిస్తూ...వేదనాదాల శబ్దతరంగాలతో పవిత్రమైన ఒక అందమైన పర్ణశాల ముంగిట రఘురాముడు నిలబడి తలుపుకొట్టాడు..."ఎవరది?" లోనుండి కులగురువు వశిష్ఠులు ప్రశ్నించారు"నేను""అంటే?""అది తెలియకనే స్వామీ..కంగారుగా మీ దగ్గరకు వచ్చాను."అని దశరథనందనుడు వినయంగా సమాధానమిచ్చాడు..సమాధానందొరకని మనస్సును వూరడిస్తూ....
మానవదేహం దాల్చిన కారణాన శ్రీరాములంతటివారికి 'నే' నంటే సమాధానందొరకలేదు. ఇక మనమెంత ?రోజూ చూసుకునే మామూలు అద్దం...దానిముందు కొంచెం సమయం వెచ్చిస్తే క్రొత్త పాఠాలు చెప్తుంది.నిదానంగా శ్రద్ధగా మనముఖం అలా చూస్తూవుంటే... కాసేపటికి ఈ కనబడే అందం పోతుంది. ఆలోచన ప్రారంభమవుతుంది.కనబడ్తున్న ఆ వ్యక్తి యెవరు? ఎక్కడనుంచి వచ్చాడు? ఎక్కడికి పోతాడు ? రాక యేమిటి, పోక యేమిటి ? అన్నీ ప్రశ్నలే,అంతా అయోమయమే. సమాధానంనాకైతే దొరకదు....యేదో తెలియని తనం....మీ స్థాయి బహుశా వేరేమో...

ఈ సృష్టిలో వున్నా అనేకానేక సౌరమండలాలలో యీ కనిపించే సూర్యకుటుంబం...ఒకటిట...అందులో యీ భూగోళం...అందులో మనమనుకునే ప్రపంచం....అందులోఆసియా ఖండం...భారతదేశం....మేరోర్దక్షిణ దిగ్భాగం....ఆంధ్రప్రదేశ్...జిల్లా....వూరు....పేట....ఇల్లు.....గది....అందులో సుమారు ఆరుఅడుగుల పొడుగున్న 'నేను' అనబడేఒక శాల్తీ.....ఆలోచిస్తే, ఈ అనంత సృష్టితో పోలిస్తే యీ ఆరడుగుల శాల్తీ వునికి యెంత?అంచేత ఈ సృష్టిలో యేమీకాని 'నువ్వు' అంటే 'నేను'...నాకు తెలియనిది యేదీలేనట్టుఓ ప్రగల్భాలు...అంటే ముందు నిన్ను నీవు...అదే నన్ను నేను తెలుసుకోవాలి.అయితే ఈ సృష్టిని నడుపుతున్న యేదో అగోచరశక్తి ..యేమిటది...అదే పరమాత్మఅంటోంది వేదం...ఆ పరమాత్మ చైతన్యమే ...స్థావరజంగమాత్మకమైన ఈ జగత్తంతానిండివుంది....
దానికోసం యెక్కడ వెతకాలి? ఏ గుడికి వెళ్ళాలి...ఏ స్వామిజీని కొలవాలి..అక్కరలేదు....
तेरे साई तुझ मे जो पुहुपन मे भास
कस्तूरी मृग जॊ है फिर फिर ढूँढॆ घास
పుష్పంలో పరిమళంలా---వికసనంలా, నీ దేముడు నీలోనే వున్నడు. కస్తూరి మృగం తనలోంచి వస్తున్నపరిమళం యెక్కడనుండి వస్తుందో తెలియక వనమంతా వెదుకుతుందట. అలాగవుంది మనపరిస్థితి.
ఎక్కడ చూసినా...ఎక్కడ భావించినా భగవంతుని తత్త్వం మనకు గోచరిస్తూనేవుంటుంది.రంగు రంగుల హరివిల్లు, జలజల పారే సెలయేరు, పచ్చటి పైరులు, దృఢమైన పర్వతాలు, నిండు గంభీర అనంత సాగరాలు, అంచనాకు అందని అనంత ఆకాశం.అమృతజలాలు వర్షించే మేఘాలు...పంచభూతాత్మకమైన ప్రకృతినిండా ఆ'మహత్' తత్త్వమే...ఆ మూల తత్త్వాన్ని భావించు...ఆ సర్వాంతర్యామిని ధ్యానించు.ఎక్కడ నుంచి..
నువ్వున్నచోటునుంచే...సంసారాలు వదలక్కరలేదు...కాషాయాలుకట్టక్కరలేదు...యెక్కడికో పోనక్కరలేదు....బురదలోవున్నా కమలానికి బురద అంటదు. సంసారంలో వుంటూ రాగద్వేషాలకు చలించకుండా..చిత్తం భగవంతునియందే వుంచి...చేసే ప్రతికర్మనూ భగవదర్పితంచేస్తూకర్మచేయువాడు తనను చేరుతాడని గీతాకారుని వచనం.
భగవంతుడెక్కడున్నాడు ? వైకుంఠములోనా....మునీశ్వరుల చెంతనా...కాదట.
భక్తితో యెక్కడ తనని గానం చేస్తారో అక్కడే తాను బసచేస్తాడట...గానానికి భక్తే ప్రధానం. అయ్యో! నాకు సంగీతం రాదే అనే బాధే వద్దు. హృదయంలోవున్న పరమాత్మను మనసారా కీర్తిద్దాము...
అన్ని 'నేను' లకు 'నేను' అయిన ఆ మహా 'నేను'లోకలసిపోదాం.