
ఉన్నట్లుండి ఇంట్లోంచి చమ్చా, దాని వెనకాల గ్లాసూ, తర్వాత చిన్నసైజు గిన్నెవచ్చేస్తున్నాయి..పాత అనుభవాలు చెప్పాయి...శ్రీమతి అలుకబూనింది అని...చర్చలు తప్పవు...ధైర్యము చేసి దాడిని తట్టుకుని..."ఏమిటి నీ డిమాండ్సు"..అనిఅడిగా..కాసేపు మౌనం వహించి..కొంచెం బ్రతిమాలాక పెదవి విప్పింది.."మీబ్లాగులో నాకు సమాన హక్కులు కావా"లంది..."సమానహక్కులేంఖర్మ మొత్తంహక్కులు నీవే"నన్నా..(అనువు కానిచోట అధికులమనరాదుకదా)..."అలామీరుయిచ్చేస్తే మేం యింక ఆందోళనలేం చేస్తాం..వద్దు" అంది. "సరే!నువ్వే చెప్పు యేం చేయాలో" అన్నా.."నేనూ మీ బ్లాగులో యేదో ఒకటి వ్రాస్తా"నంది...."నాలోసగం అని బ్లాగులోశీర్షిక వుంది.అందులో నీ యిష్టం"అన్నా..."అయితే నేనో మంచి వంట చెప్తాను..వ్రాసి అందులో వుంచండి" అంది...స్పెషల్ వంటలూ అవీ తనే చేస్తుంది నేను చెయ్యను లెండి...పెన్నూ కాగితం పట్టుకుని సిద్ధమయ్యాను......వంటకం పేరు: పూర్ణపొంకాయ పులుసు....అని చెప్పేటప్పటికి నాకు నోరూరిపోతోంది...."బాగుంటుంది..బాగుంటుంది..తెలుసు" అన్నా...వెంటనే ఆవిడ"యేంతెలుసు?తెలిస్తే యేంకావాలో చెప్పండి"అంది...జవాబు వెంటనేచెప్పాలి మా ఆవిడకి..లేకపోతే అదో క్రొత్తసమస్య....నేను కావలసిన వస్తువులుచెప్పా...."గాసు స్టవ్వూ,,నిండు గాస్ సిలెండరూ, మూకుడూ..."మా ఆవిడ మధ్యలోకట్ చేసి..."కంచమూ, గ్లాసూ...వండడానికి తర్వాత భోచేయడానికీ మీరూ"...అంది..."మరే!మరే! మర్చేపోయా..".అన్నానోలేదో...మీ మొహం అని తర్వాత లెంపలేసుకుంది. వ్రాయండి చెప్తా అని మొదలెట్టింది.వస్తువులు:చిన్నసైజు లేత వంకాయలు...1/2కె.జిచింతపండు ... ...25 గ్రా; ధనియాలు.. ...ఒక కప్పు; శనగ పప్పు... ... ఒక కప్పుమినప్పప్పు.. .... .. నాలుగు టేబుల్ స్పూన్స్; జీలకర్ర... ...ఒక టేబుల్ స్పూన
మెంతులు ... ...నాలుగైదుగింజలు మాత్రం; ఎండుమిర్చి.. ... ..నాలుగు(కారం యెక్కువ తినేవాళ్ళు ఎనిమిది వేసుకోవచ్చు); ఉప్పు.... తగినంత; బెల్లం కొద్దిగా యిష్టమైతేనే; పసుపు; పచ్చిమిర్చి.... నాలుగు.; తగినంత నూనె; ఆవాలు కొద్దిగా; ఇష్టమైనవారు ఇంగువ; కరివేపాకు.ఇప్పుడు చేసేవిధానం చెప్తా వ్రాయండి: ముందు చింతపండు చిక్కగా పిసికిపెట్టుకోవాలి. ధనియాలు,శనగపప్పు,మినప్పప్పు,జీలకర్ర,మెంతులు,ఎండుమిర్చి,తగుమాత్రం నూనె వేసి ఎరుపురంగు వచ్చేదాకా వేయించి, గ్రైండుచేసి ఉప్పుకలిపి ఒకచోట పెట్టుకోవాలి.ఇప్పుడు వంకాయలు పుచ్చులులేకుండా చూసుకొని, శుభ్రంగా కడిగికాయల్లా తరుగుకోవాలి...."ముక్కల్లాగా అయితే తరుక్కోవాలి కాని...కాయల్లాగా అయితే తరగడమెందుకు" అన్నా...."పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేయకుండా చెప్పింది వ్రాయండి" అని కంటిన్యూ చేసింది. ధనియాలు అవీ గ్రైండుచేసిన పొడెం ఈ కాయల్లోకి కూరాలి. కొంచెం పొడెం వుంచాలి.స్టవ్ మీద మూకుడు పెట్టి అందులోనూనె వేసి...కాగాక ఈ కాయలు అందులోవేసి సన్న సెగని మగ్గనివ్వాలి. "ఏమోయ్! ఇప్పుడు స్టవ్ వెలిగించాలి కదా మరి వ్రాయొద్దూ" అన్నా...."మహాశయా..సన్న సెగ అంటే వెలిగించమనే..నోరు మూసుకొని వ్రాయండి"....ఇంతదాకా వంకాయ కారంపెట్టిన కూరలాగానే ...అయితే కాయలు ఎర్రగా వేగిపోకుండా సగంపైగా మెత్తబడ్డాయి అనిపిస్తే...అందులో చింతపండుపులుసు, మరికొంచెంవుప్పు, ఇష్టమైతే బెల్లం, పసుపు కొంచెం, పొడువుగా రెండుగా కోసిన నాలుగు పచ్చిమిర్చివేయాలి.....ముందు గ్రైండు చేసిన పొడిలోంచి చారెడు పొడికూడా వెయ్యాలి.కాయలు ములిగాక కొంచెం పైకి వచ్చేటట్టుగా చింతపండుపులుసు వెయ్యాలి.ఇప్పుడు సన్నసెగనిమరగనివ్వాలి. అలా ఓ పది లేక పదిహేను నిముషాలుమరిగాక....ఆవాలు, ఇష్టమైన వారు కొంచెం ఇంగువ,కరివేపాకు వేయించివేసిఇంకో అయిదు నిముషాలు మరిగించి దింపాలి. దగ్గరగా మరిగి చిక్కపడ్డసాంబారులా వుంటుంది మొత్తం తయారయ్యాక.....రుచికరమై, ఘుమఘుమలాడే....పూర్ణపు వంకాయ పులుసు సిద్ధం.....'నేను ఒకటి ;ముక్తాయిస్తానే' అనగానే, 'అనుమతి మంజూరు చేయబడింది'అంది శ్రీమతి....'ఏం లేదండీ....కమ్మటి కందిపచ్చడి, ఘుమఘుమలాడేనెయ్యి కాంబినేషన్ తో పూర్ణపొంకాయి పులుసు తిన్నారంటే ... బెత్తెడేమిటికామధేనువు కొమ్ములు, కల్పవృక్షం కొమ్మలు కనపడ్తాయి" అనగానే"ఇన్నాళ్ళకి మీనోట మంచిమాట వచ్చింది.....లేవండి భోజనానికి అంది....""అయితే చేసేసావా..." అనగానే విజయ గర్వంతో చిరునవ్వు నవ్వుతూ నడిచింది మా విజయ.

