Pages

Wednesday, June 22, 2016

మా నాన్నగారి 123వ జయంతి[22-6-1894 - 30-5-1982]

                                                            { శ్రీ దినవహి సత్యనారాయణ }             


ఈరోజు నాన్నగారి జయంతి..

నాన్నగారి గురించి   -- 
నాన్నగారికి ఆత్మీయ మిత్రులు మహా పండితులు
కళాప్రపూర్ణ బ్రహ్మశ్రీ వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారి మాటలలో --

సీ|| ఆబాల్యముగా నాంధ్రమందు గవిత్వంబు
నిర్మింప నేర్చిన నిపుణ బుద్ధి,
యాంగ్ల విద్యార్థి రాజ్యమునందు బట్ట భ
ద్రతకు భంగము గన్న రాఘవుండు,
హిందీ సరస్వతీ  సౌందర్య సింథు వా
కంఠమ్ము గోలిన కలశభవుడు
పాళీ వచోదేవతా లీల లొకకొంత
చవిచూచినట్టి విజ్ఞానశీలి

తే.గీ || దినవహి పవిత్ర వంశ మౌక్తిక లలామ
మమల చరితుండు సత్యనారాయణుండు
అస్మదాప్త సుహృద్వర్యుడగుట నా య
దృష్ట వైశిష్ట్య మనుచుగర్వింపవలదె !

చం|| అతడు కవీంద్రుడై తెలుగు, నాంగ్లము, హిందియు బ్రాకృతంబులన్
మతి గ్రహించు పుణ్య మహిమంబు ఫలింపగ, రామ మానసో
ర్జిత పరమార్థవేత్త, తులసీకవి మంజుల శారదన్, యథా
స్థితముగ నాంధ్ర శారదగ దీరిచి దిద్దెను రాము పేరనే

గోస్వామి తులసీదాసు కృత శ్రీరామచరిత మానసమును తెలుగు వచనంలో అనువదించి పండిత పామరుల అభిమానము సంపాదించారు. ఈ గ్రంథం మూడు ముద్రణలు పొందింది. బెంగాలీ భాషలో ద్విజేంద్రలాల్ రాయ్ వ్రాసిన ‘షాజహాన్’ నాటకాన్ని తెలుగులో వ్రాసారు. ఇది కాక ‘ప్రేమచంద్ కథలు’, ‘మేవాడు పతనం’ అనే గ్రంధాలు వ్రాసారు పాళీ భాషలో గ్రామరు వ్రాసారు. గాంధీమహాత్ముని పిలుపుకు స్పందించి బి.ఏ చదువును మధ్యలో వదిలేసి జాతీయోద్యమంలో చురుకుగా పాల్గొని … హిందీ భాషావ్యాప్తికి విపరీతంగా కృషి చేసారు.. జాతీయ పాఠశాలలో బోధకునిగా పని చేసారు. అప్పుడే నాన్నగారికి శ్రీ వెంపరాల వారితో ఆత్మీయస్నేహం …తర్వాత గుజరాత్ విద్యాపీఠ్ వారి బి.ఏ పట్టా పుచ్చుకుని అసిస్టెంట్ పంచాయత్ ఆఫీసర్ గా, కాటేజ్ ఇండస్ట్రీస్ ఆఫీసర్ గా ఉద్యోగాలు చేసారు..

ఉన్నత వ్యక్తిత్వం..శ్రీరామ భక్తి .. మూర్తీభవించిన సౌజన్యం  అదే నాన్నగారు --- ఈ మహనీయ మూర్తికి తనయునిగా గర్వపడుతూ వారి 123వ జయంతి నాడు సభక్తికంగా వినయాంజలి ఘటిస్తున్నాను.  
((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((((o0o))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))))


Monday, May 30, 2016

హనుమజ్జయంతి … దుర్ముఖినామ సంవత్సర విశాఖ బహుళ దశమీ భౌమవాసరం (31-06-2016)

హనుమజ్జయంతి … దుర్ముఖినామ సంవత్సర విశాఖ బహుళ దశమీ భౌమవాసరం (31-06-2016)


[హనుమజ్జయంతి శుభ పర్వదినాన బ్లాగుమిత్రులందరికీ శుభాకాంక్షలతో...]

అందరికీ ఆనందమిచ్చే ఆంజనేయ

సీ॥ రాముడానతి జేయ రయమున లంకకు
పయనమై వెడలిన వాయుపుత్ర
సీతను వెదకి జూచి, యశోక వన మంద
సురుల గూల్చితివీవు సుందరాస్య
దశకంఠు నెదురుగా దర్పముతో నిల్చి
బుద్ధి తెలిపితీవు బుద్ధిమంత
అందమైన పురము నగ్ని కాహుతిజేసి
రాముని జేరిన రామభక్త

తే.గీ. సతిని గూర్చి విన్న విభుడు సంతసించె
సీత కడగె భయము నీవు చెంతనుండ
కపులు మోదమందిరి నిన్ను గాంచినంత
హర్షమొసగితి వందరకాంజనేయ !

పంచముఖాంజనేయునికి శిరసా వందనములు

సీ॥ గరుడ జవంబున కడలిపై పయనించి
లంక జేరితీవు లాఘవమున
దంష్ట్రి తొల్లి వెదకి ధరణి జూచిన తీరు
గాలించి యవనిజ గాంచితీవు
నరహరి వైరిని నాడు చంపిన భంగి
కూల్చితి వసురుల గోళ్ల జీల్చి
వాగధి దైవమా వాజిముఖుని యట్లు
పలుకుతీరు తెలియు వాగ్మివీవు

తే.గీ. దివ్యమైన శివుని తేజమున వెలుగు
వానరకులదీప్తి వాయు సుతుడ
వేద తత్త్వ రూప విజయ హనుమ
భక్తితోడ నతులు పవన తనయ    

[ఈ రెండు కుసుమాలు స్వామి చరణాలకు సమర్పితం  … 
వీడి చేత స్వామి వ్రాయించుకున్నవీ పద్యాలు ]

Wednesday, May 11, 2016

హరాజీకా…13 -- కేశ ఖండన


              

కేశ ఖండన
                                                                            రచన:డి.వి.హనుమంతరావు.

[గుర్తుందండీ.. హరాజీకా అంటే ఏమిటో మీకు తర్వాత చెప్తానన్నాను కదా..జంధ్యాల వారు చెప్పినట్లు నేను మాట మీద నిలబడే వ్యక్తిని. తర్వాత తప్పక చెప్తాను. అయినా హరాజీకా అంటే తెలియకపోయినా చాలా మంది చదివి స్పందిస్తున్నారు కదా.. మీరు కూడా అలా స్పందించండి …స్పందిస్తారు నాకు తెలుసు.]
===========

“ప్రొద్దున్నే బయల్దేరా రెక్కడికి?”
అనుకున్నంతపనీ అయ్యింది. అర్థాంగి దృష్టిలో పడకుండానా.. అబ్బే కొస్చనే లేదు...
“ఏదో అలా వాకింగ్ కి… అయినా పని మీద వెళ్తున్నప్పుడు ఎక్కడికి అని అడగకూడదని పెద్దలంటారు.”
సంజాయిషీ లా గోడకేసి చూసి చెప్పా..
“ఆ పెద్దలేం అన్నారో నే వినలేదు కాని, మీ వాటం చూస్తే వాకింగ్ లా లేదు.. అయినా రోజూ సాయంత్రం కదా వెడుతున్నారు, ఇలా  ప్రొద్దున్నే బయల్దేరారేంటా అని. .. “
కూపీ లాగుతొందిరోయ్ దేవుడా..
“నిజమే, కాని ప్రొద్దున్న వెడితే బోల్డు విటమినులు దొరుకుతాయట”
“రోడ్డు మీద రాశులు పోసి, మీకోసం పారేసుకుంటారా, దొరకడానికి …. “
“లేదోయ్ .. ఆ విటమినులు పొట్టకు మంచిదట..”
“అంటే పొట్ట పెరగడానికా.. తగ్గ డానికా … ఇంతకీ ఎవరు చెప్పారుట, గోదావరొడ్డున మూలికలమ్మే వాడేనా ?”
“ఇదిగో లక్ష్మీ .. ఇలా వెటకారం చేస్తే నాక్కోపం వస్తుంది”
నాకేం ఉద్ధరింపుట అని అనేస్తేందేమో, మీరందరూ చూస్తున్నారు కూడాను అని భయపడ్డా
అపుడే కాఫీ త్రాగి వచ్చింది కదా .. అలా అనకుండా, నవ్వుతూ, గోముగా అడిగింది..
“శ్రీవారు, ఎక్కడికమ్మా వెళ్తున్నారు “ అని.
భయపడుతూనే చెప్పా…
“కట్టింగ్ కి” …  అంతే లక్ష్మికి కోపం వచ్చేసింది.
“ఇప్పుడేమంత  పెరిగిపోయింది, అయినా మొన్నే కదా గొరిగించుకొచ్చారు.. అప్పుడే తొందరేంటి.”
“గుండైతే గొరిగించు కోడం అంటారు, క్రాఫింగ్ అయితే  కటింగ్ అనాలి”
అని చెప్దాం అనుకున్నా.. అబ్బే అనుకున్నాను. .. అంతే.
“మొన్నేమిటి లక్ష్మీ, నీకు స్నానం అయిన రోజు చేయించుకున్నాను, మరి నిన్ననే గా…  ”
మధ్యలోనే కట్ చేసి
“నోరు మూసుకోండి, వెధవ లెక్కలు మీరునూ”
సిగ్గు ప్లస్ కోపం ఎక్స్ ప్రెషన్ ఇచ్చింది.
““మీకేం మతి లేదు.. పదిరోజులలో, మా చెల్లెలింటిలో సత్యనారాయణ వ్రతం. మనం వెళ్లాలి కదా, అక్కడకీ బోడి మొహంతో వస్తారా.. ఇప్పుడొద్దు” అంది.
“దేవానంద్ కైనా, మన్మధుడికైనా హెయిర్ కట్టింగ్ చేయించుకున్న వారం రోజులదాకా బాగుండదని శాస్త్రం చెప్తోందోయ్. అంతేకాని, మరీ పదిహేనురోజులదాకా అని ఎక్కడా లేదు”
అని నాకున్న శాస్త్ర పరిజ్ఞానాన్ని ఉటంకించాను.
“దేవానంద్ కు దేవపురుషులకూ ఆ లెక్కలు.. మీకు నెలదాకా వచ్చే సమస్యే లేదు. అందుచేత .. ససేమిరా”
“అప్పటికి.. వారం రోజుల్లో  కొత్తిమీర మడిలా జల జలా వచ్చేస్తుందోయ్ .. అయినా ముళ్ళపూడి వారన్నట్టు, (అప్పట్లో) బడిపంతులుద్యోగి జీతమా పెరక్కపోవటానికి”అని తెలుగులో అని,
మరల ఇంగ్లీషులో…
“See mrs. lakShmi rao, my experience says and also with the statistics available with me, I say…”
అని చెప్ప బోయా..
“సీ మిస్టర్ రావ్ లక్ష్మీ.. గో టూ హెల్ విత్ యువర్ ఎక్స్పీరియన్స్,”
అని తెల్గు స్క్రిప్ట్ లో ఇంగ్లీష్ లో ఏకి పాడేసింది. అంటూ ముక్తాయిపుగా ..  
“అయినా సరే నేనొప్పుకోను… మీరు డిప్ప చేయించుకుని, ఆ డిప్ప మొహం వేసుకుని మా వాళ్లింటికొస్తారు. ఉన్న నాలుగు వెంట్రుకలూ టెలిఫోన్ స్థంభాల లాగా  లేచి నించుంటాయి, అవి మీకు దువ్వెన్నకు లొంగవు. ఆ హడావుడిలో మీ నెత్తిన చవురు పెట్టడానికి నాకు తీరికుండదు.. మా వాళ్ళందరూ .. కోరస్ లో “..సొగసైన క్రాఫు చెరిగిపోయే, నగు మోము చిన్న బోయే”అని రేలంగి పాత సినిమాలో పాడిన పాటను, క్రొత్తగా హం చేస్తున్న ఫీలింగ్, మీ కేమో…. కాని నాకు వచ్చేస్తుంది. అంచేత మళ్ళీ ససేమీరా... “అంది.
“అబ్బే అదా.. కొబ్బరి నూనె రాయడం పెద్ద సమస్యేమిటి.. వాళ్ల పని పిల్ల చేత రాయించుకుంటాను..”
“ఇలాంటి వెధవ్వేషాలేస్తారనే, మా చెల్లెలు ఆ పనిమనిషిని మాన్పించేసింది. .. ఇప్పుడున్నది వయసు మళ్లినావిడ”
అదేం పోయ్ కాలం అని అనుకోబోయా.. కాని ఈలోగా మా ఆవిడ
“అయినా ఇప్పుడు సమస్య కొబ్బరి నూనె రాయడం కాదు..”
“పోనీ మీ చెల్లెలింటికి ఈ డిప్ప మొహంతో నేనురాను లే..”
“మరి ఏ మొహం పెట్టుకొస్తారు, మీకున్నది ఆ ఒక్క మొహమే కదా “
ఇంత సీరియస్ పరిస్థితుల్లోనూ .. ఓ యబ్బో సెన్సాఫ్ హ్యూమర్ అంటే ఇదే కామోసు.
అయినా ఎవరికైనా ఏ మొహమైనా ఉండేది .. ఒక్క మొహమే కదా.. ఇది కూడా స్వగతమే …
“అదికాదోయ్ .. నువ్వెళ్లి ఎంచక్కా వ్రతం చేయించి వచ్చేస్తావని ..”
“మీరు నా పాతివ్రత్యాన్ని శంకిస్తున్నారు.. నేనెప్పుడైనా అలా వెళ్లానా.. “
అని మంగళ సూత్రాలను కళ్లకద్దుకుంది.
కళ్లల్లో నీళ్లు కూడా మెరిసాయి..
మరేం చేస్తాం … సెంటిమెంటు..
నా కర్థం కాని విషయం .. ఆవిడెప్పుడైనా నాతో వస్తుందేమో కాని,ఎప్పుడూ  పుట్టిళ్లకు ఒంటరిగా వెళ్ళడానికే ప్రిఫర్ చేస్తుంది. ఇంత టెన్స్ గా వాతావరణం ఉన్నప్పుడు మళ్లీ ఇలా అడిగానంటే … ఆవిడ కన్నీటి మేఘాలు ఏ గంటలోనో వర్షించి, ముసురులా పట్టుకోవచ్చని గ్రహించిన వాడినై , కేశఖండన పోస్ట్ పోన్ చేసి.. తువ్వాలుచ్చుకుని, బాత్ రూమ్ లోకి కదిలా…
ఏం చేస్తాం ముచ్చటి పడి పెళ్లి చేసుకున్నాక, ముచ్చటైన మీ జుత్తు కటింగ్ చేయించుకోడానికి కూడా మీకు అధికారం లేదు. .
ooooOOOoooo

Saturday, February 6, 2016

రాజమండ్రి - 12




హై స్కూల్ రోజుల్లోకి
---డి.వి.హనుమంతరావు


మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కాని నా పోస్ట్ లకు మంచి స్పందన వచ్చేస్తోందండి. ఎందుకంటే చదివినవారు, వారి వారి చిన్నతనాలలోకి వెళ్ళిపోయి వారికి పరిచయమైన రాజమండ్రిని గురించి ఆవిష్కరించమంటూ ఆదేశిస్తున్నారు. అలాగే తమ గత కాల స్మృతులను స్మరించుకుంటున్నారు.. అంచేత మీరు నేను చెప్పేది నమ్మి తీరాలి. నమ్మక చేసేది లేదు .. అనకండేం, పాపం నేను బాధ పడతాను…  అని చెప్పడానికే ఈ స్వాత్కర్ష.


హైస్కూల్లో చదివే రోజుల్లో జూన్ వచ్చిందంటే ఒక థ్రిల్ …  మా స్కూల్ పుష్కర్ ఘాట్ దగ్గర.. మునిసిపల్ హై స్కూల్. -----పురపాలక సంఘోన్నత పాఠశాల … [ఇదివరకు ఎపిసోడ్స్ లో ఇది ప్రస్తావించానేమో తెలియదు.. అప్పుడు కుర్రవాణ్ణే కాని ఇప్పుడు పెర్ర వాణ్ని కదా  ఛాదస్తం ..]  


స్కూల్ అసెంబ్లీ లో…  అప్పటి మా క్లాస్ మేట్ - ఇప్పటి యాక్టర్ -  జిత్ మోహన్ మిత్రా,  వాళ్ల అన్నయ్య కుమార శర్మ (ఇప్పుడు నిజామాబాద్ లో ఆడిటర్)తో కలసి  
“పురపాలక సంఘోన్నత పాఠశాలా..”  అంటూ  మా స్కూల్ గొప్పతనం శ్లాఘిస్తూ, మా తెలుగు మాస్టారు చిన్మయ బ్రహ్మంగారు వ్రాసిన గీతాన్ని రోజూ పాడేవారు.   ఆ స్కూల్ ఉన్నచోటును ఇప్పుడు మునిసిపల్ వాటర్ వర్క్స్ వారు ఆక్యుపై చేసారు. గోదావరి ఒడ్డునే స్కూల్. గోదావరికి జూన్ నెలలో కొత్త నీరు తగులుతుంది. గోదావరి గాలులు పడమటనుంచి నగరాన్ని తాకుతాయి. కొంచెం  చలిగా కొంచెం వెచ్చగా వీచే గాలులు మేనికి తాకగానే విద్యార్థులకు కొత్త సంవత్సరపు సందడి మొదలైపోయిందన్నమాట… అప్పుడు అకడమిక్ యియర్ అంటే జూన్ నుంచి ఏప్రిల్ వరకూ… ఏప్రిల్ లో పరీక్షలు అయిపోవడం, రిజల్ట్స్ వచ్చేయడం అయిపోతుంది.. పాసై జూన్ నెలలో కొత్త క్లాసులోకి వెళ్లిపోతాం. కొన్ని పాత ముఖాలు కనపడవు .. కొన్ని కొత్త ముఖాలు వస్తాయి … కొత్త పుస్తకాలు, వాటికి కొత్త అట్టలు,  కొత్త బట్టలు, కొత్త జోళ్లు అన్నీ కొత్త కొత్త గా ఉంటాయి. ఇప్పటికీ జూన్ నెల .. గోదావరి గాలి ఒంటికి తాకగానే  మనసు చిన్నతనపు రోజులకు పరుగులు తీస్తుంది. ఆ వాతావరణం గుర్తుకొచ్చేస్తుంది. మా హైస్కూల్ కు పెద్ద ప్లేగ్రౌండ్  .. మధ్యలో రాజ రాజ నరేంద్రుని కాలం నుంచీ తపస్సు చేసుకుంటున్న ముని పుంగవుల్లా పెద్ద పెద్ద చెట్లు … అక్కడక్కడ క్లాస్ రూమ్ లు.. ఈ బిల్డింగ్ చరిత్రలో చెప్పబడే చిత్రాంగి మేడఅని  ఒక ఐతిహ్యం .. మా స్కూల్ ఆవరణలో  ఒక రాతి శాసనం కూడా ఉండేది అని గుర్తు. ఆ రాతి శాసనపు రాయికి దగ్గరగా మునిసిపల్ కుళాయి ఉండేది .. ఏనుగు ముఖంలాంటి ముఖంతో పెద్ద ఇనప కుళాయి అది. నీళ్ళు తిప్పుకోడానికి పెద్ద చెవి (లివర్) . అది నొక్కితే నీళ్లు వచ్చేవి. ఎందుకు చెప్తున్నానంటే అలాంటివి  ఇప్పుడు మ్యూజియం లో కూడా కనపడవు. గత  చరిత్రకు గుర్తుగా మా స్కూల్ బిల్డింగు ఎత్తైన కట్టడాలతో ఉండేది . , గుమ్మాలు కూడా చాలా ఎత్తుగా ఉండేవి. వాటిల్లో మా యస్ యస్ ఎల్ సి క్లాసులు ఉండేవి. దానిప్రక్కనే హెడ్ మాస్టారి రూమ్.  అక్కడ పోర్టికో .. దానిపైన బాల్కనీలా ఉండేది. నేనూ రామం అక్కడ కూర్చుని మా ఇంటి దగ్గర ఇచ్చిన కేరియర్స్ విప్పుకుని అన్నాలు తినేవాళ్లం. వాడికి ఇంటి దగ్గర్నుంచి నాలుగు గిన్నెల కారియర్ వచ్చేది. నేనైతే ఇంటిదగ్గర్నుంచి, రెండు గిన్నెల కారియర్ మోసుకుపోయేవాణ్ణి. వాడికి తరచూ, నాకప్పుడప్పుడు ఏమైనా కొనుక్కోడానికి ఇంటి దగ్గర డబ్బులిచ్చేవారు. అవి పుచ్చుకుంటే గేట్ అవతలకు పోతే  సోములు ఐస్ బండి,, మామ్మదగ్గర వేరుశనగ ఉండలు, కొబ్బరి నౌజులు… వేసవి వచ్చిందంటే సీమ సింతకాయలు, రేగి ఒడియాలు… వర్షాకాలంలో తియ్యటి బత్తాయి జామల సైకిళ్లు.. ఎక్కడో అక్కడ, ఇద్దరం కలసి తినేవాళ్లం. మా బాబాయిగారబ్భాయి కూడా మాతో కలసేవాడు. వాడు రెండేళ్లు జూనియర్. తిన్నాక మధ్యాహ్నం లంచ్ టైములో ఆడుకోడమో … ఆ పెద్ద చెట్ల మొదళ్లలో .. బలమైన వేళ్లు ఏర్పరచిన సీటుల వంటి వాటిపై కూర్చుని కబుర్లు చెప్పుకోడమో….. ఆ రోజులే వేరండి.


ప్రతి సంవత్సరమూ శలవుల తర్వాత స్కూల్ కు వెళ్లడంలోని థ్రిల్ ….  ఎప్పుడో పోయింది. …ఇప్పుడంతా  స్టడీ అవర్స్, పరీక్షలవగానే నెక్స్ట్ ఇయర్ పాఠాలు మొదలెట్టేయడం.. స్కూల్ కంటిన్యూ అయిపోవడం… ..
శలవుల్లో తాతగారి ఊర్లకు  వెళ్ళడాలు లేవు, ఆత్మీయతలు పంచుకోడం.. ప్రకృతిని ఆస్వాదించడం.. ప్రకృతి ఒళ్లో ఆడుకోడం లాంటివి ఇవేవీ పిల్లలకు తెలియకుండానే పెరుగుతున్నారు.. పెద్దయ్యాక చేసే  కంప్యూటర్ ఉద్యోగాలు కూడా ఉన్న కాస్త సుఖాన్ని దూరం చేస్తున్నాయి. శలవుల్లో ఇళ్ళ కొచ్చినప్పుడు కూడా ఆ పెట్టె  ముందేసుకుని కొడుకులు కూర్చుంటారు.. టి.వి.పెట్టె ముందు పెద్దలు కూర్చుంటారు.. పిల్లలకు ఆండ్రాయిడ్ ఫోనులు గేములు ఉండనే ఉన్నాయి.. మన  సరదాలు, అనురాగాలు ఆ పెట్టెల్లో పెట్టేస్తున్నాము. సరే…


వర్షాకాలంలో గోదావరికి ఎగువన వర్షం పడిందంటే గోదావరికి వరదలొచ్చేవి. రాజమండ్రిలోని విశాలమైన అఖండ గౌతమి శోభ రాజమండ్రికే స్వంతం. అందునా పుష్కరాల రేవులో మెట్ల మీంచి చూస్తే , అప్పట్లో ఇసుక మేటలు కూడా ఉండేవి కావేమొ.. అబ్బా. .ఏమందమండీ బాబూ ? పాత రైలు బ్రిడ్జ్ {అంటే హేవలాక్ బ్రిడ్జ్} మొదటి స్థంభం మీద నీటి మట్టం సూచించడానికి  అంకెలుండేవి. ఆ వరదల సీజనులో రోజూ వరద లెవెల్ చూసి, ఆ విషయాలు డిస్కస్ చేస్తూ స్కూల్ కు వెళ్ళే వాళ్లం.. స్కూల్ కు టైమయిపోతున్నా, భుజాన పుస్తకాల సంచి దిగలాగుతున్నా, చేతిలో లంచ్ కెరియర్ భారంగా ఉన్నా, ఇంట్లో బలవంతంగా ఇచ్చిన గొడుగు ఇబ్బంది పెడ్తున్నా అదో పనిగా -- గోదావరి లెవెల్ చూడాల్సిందే. వర్ణించి స్కూల్లో మిగతా పిల్లలకీ,  కథలుగా ఇంటి దగ్గర అమ్మా నాన్నలకు చెప్పాల్సిందే.వరదనీటిలో  పెద్ద పెద్ద దుంగలు అడవుల్లోంచి కొట్టు కొచ్చేవి.. అవి పట్టుకు రావడానికి కొందరు వెళ్తూ ఉండేవారు. వారు రేకుతో చేసిన లావుపాటి గొట్టం లాంటిది, ముందర వైపు వంపు తీరి, ఉన్న ఒక సాధనాన్ని ఉపయోగించి వెళ్లేవారు. నీటిలో తేలుదుంది. దానిమీద పడుకుని ఈత కొట్టుకుంటూ వెడతారన్న మాట. దాన్ని గుర్రం అంటారు. గట్టు మీంచి దుంగను పోల్చుకోవడం, ప్రవాహానికి వాలుగా ఈత కొట్టుకుంటూ వెళ్తే కాని ప్రవాహంలో కొట్టుకుపోతున్న కర్ర అందదు. (రన్నింగ్ సిటీ బస్సులో ఎక్కడానికి మనమూ బస్సుతో పాటు పరిగెత్తినట్టన్నమాట. ) అది పట్టుకుని ప్రవాహాన్ని ఎదుర్కొంటూ ఎప్పటికో గట్టుకొచ్చేవారు. అప్పటికి వారు బయల్దేరిన గట్టు దగ్గరనుంచి కొన్ని కిలోమీటర్ల క్రిందకు వెళ్లిపోయేవారు. ఒక్కోప్పుడు, ఆ దుంగ విలువైనది అవ్వచ్చు, కాకపోవచ్చు పాములు గట్రా ఉండొచ్చు .. ఆ రిస్క్ లన్నీ పడేవారు.. అది మనకేల .. వాడు వెళ్లినంత మేర కనిపించినంత వరకు చూడ్డం, మాకదో వినోదం ఆ సీజనులో. మరీ చిన్న పుల్లలకోసం గట్టుదగ్గరే కొందరు ఉంది కలెక్ట్ చేసేవారు.


మేం చదువుకునే రోజుల్లో టెక్స్ట్ బుక్స్ అన్నీ ప్రైవేట్ వాళ్ళవే .. ప్రతి స్కూల్ వాళ్ల వాళ్ల కమిటీలు సిఫార్స్ చేసిన పబ్లిషర్ దగ్గర పుస్తకాలు కొనుక్కోమని ఉత్తర్వులు జారీ చేసేది.. ఇంక ఇంట్లో వాళ్ళిచ్చిన డబ్బులు జేబులో వేసుకుని పుస్తకాల షాపుల చుట్టూ  తిరగడం.. స్టాక్ రాలేదంటే మళ్లీ మళ్లీ తిరగడం.. ఈ తంతు జులై ఆగస్ట్ దాకా డేకేది. వర్షాకాలం మొదలై పోయేది.. వర్షం పడ్డప్పుడు ప్రక్క కొట్లలో దూరుతూ, రానప్పుడు ముందుకు సాగుతూ… పుస్తకాలకోసం వేట, కొన్న పుస్తకాలు తడవకుండా భద్రపరుచుకుంటూ… పరిస్తితులను ఎదిరించడం తెలిసేది కాదు.. పరిస్తితులకనుగుణంగా పోవడమే …  ఇంట్లో కూడా అన్నప్పుడు డబ్బులు అన్ని కుటుంబాలలోనూ ఉండేవి కావు. ఆదాయాలు తక్కువ -- ఖర్చులు ఎక్కువ. ఆ బాధలు అర్థం చేసుకోలేని వయస్సు.. మన పంతం మనదే.. మన కోపాలు మనవే. కాని ఒకటి..  పెద్దల్ని ధిక్కరించడం ఉండేది  కాదు, వారు కాదంటే ఆపని అసలు చేసేవాళ్లంకాదు. నచ్చకపోతే కళ్లనిండా నీరు.. మౌనం అంతే .
రామా అండ్ కో, వేంకట్రామా అండ్ కో అన్న పబ్లిషర్స్ పుస్తకాలు ఎక్కువగా సిఫార్స్ చేసేవారు.. వాటి షాపులు రాజమండ్రీలో ఉండేవి .. ఇంకా కొన్ని షాపుల వాళ్ళు ఈ పుస్తకాలు కూడా తెచ్చేవారు. అవి వెతుక్కుంటూ పోయే వాళ్లం. రౌతు బుక్ డిపో, కాళహస్తి తమ్మారావు, ఇవికాక ఓరియంట్ లాంగ్ మాన్ ..
పుస్తకాలు లేకపోతే కొందరు సౌమ్యంగా చెప్పేవారు. మళ్లీ అడిగితే విసుక్కొనే వారు.. ప్రొద్దున్నించీ పని చేసిన బాధ వారిదికదా పాపం.. మాకు చిన్నతనం..
కాలేజీలో చదివే రోజుల్లో అయితే  .. ఒక్కో పుస్తకం ఆంధ్రా బుక్ హౌస్ అనే షాపు లో మాత్రమే దొరికేది. అది ఆషా రెస్టారెంట్ సెంటర్ (ఇప్పుడు డీలక్స్ సెంటర్)లో ఉండేది. ఆ షాపాయనకు కోపం ఎక్కువ. మా కాశీ ఆయన్ని తాగుబోతోడనే వాడు. కళ్లు ఎర్రగా ఉండేవి. లేదని చెప్పడంకూడా చాలా కోపంగా చెప్పేవాడు.  ఎక్సర్ సైజు బుక్స్ అయితే కె.యన్ రావు, అతని షాప్ ఇష్టపడేవాళ్లం. అతని పేరు కూర్మాల నారాయణ రావు. పుస్తకం మీద అతడి ఫోటో ప్రింట్ చేసి ఉండేది. ఇదికాక  మాజేటి సూర్యప్రకాశ రావు.. ఎలిఫెంట్ మార్క్ పుస్తకాలు. సింగల్ రూల్స్, డబల్ రూల్స్, బ్రాడ్ రూల్స్ అంటూ  రక రకాలు. అప్పుడన్నీ ఇంక్ పెన్నులే. రూపాయిన్నర పెడ్తే రెండూ, మూడూ పెన్నులు. ఇంక్ రాజమండ్రిలో తయారయ్యేది. ఐడియల్ ఇంక్ అని ఆకుల సుబ్బారావుగారి మార్క్ .. ఒక్కోప్పుడు అర్థణా ఇస్తే పెన్ను నిండా ఇంకు పోసే షాపులుండేవి. అది కొంచెం పల్చన. నీళ్లు కలిపేసేవారు. బిజినెస్ అప్పుడూ, ఇప్పుడూ ఒకటే… నెక్ దగ్గర ఇంకు కక్కేవి.. (ఈ పారిభాషిక పదాలు ఇప్పుడు తెలియవేమో- అర్థం చేసుకోండి). దానికి లోపల సబ్బో , గ్రీజో రాయాలి. పైగా నిబ్, అంటే పాళీ, నాల్క - రెండూ చక్కగా పెట్తేనే ఇంక్ పేపరు మీద పడకుండా వ్రాయగలుగుతాం. అందుకని అప్పుడప్పుడు అవి మారుస్తూ ఉండాలి.. అలవాటు తప్పిపోయింది. ఇప్పుడు ఆ ఫౌంటెన్ పెన్నులతో వ్రాయలేం.. ఆ పెన్నులకు రత్నం పెన్ వర్క్స్, రాజమండ్రికే కాదు దేశంలోనే ఫేమస్, అలాగే గైడర్, లీడర్ అని కంపెనీలుండేవి. వీళ్లదగ్గర గోల్డ్ నిబ్ తో కూడా పెన్నులుంటాయి. ఇవి కాక పైలట్, పార్కర్ పెన్నులు ఇతర కంపెనీలవి కొంచెం కాస్ట్ ఎక్కువ.


సీమ సింతకాయలు కనబడ్డాయంటే .. మార్నింగ్ స్కూల్స్ అని నేను లెక్కేసే వాణ్ణి. ప్రొద్దున్నే వెళ్లడం బానే ఉండేది కాని, ఎండన పడి రావాలి. అక్కడికీ మాస్టర్ లు చెప్పేవారు. ఇంటికి స్ట్రైట్ గా పొండి అని. అదీకాక ఆకలి నక నక లాడేది. ఆపుడు స్నాక్స్ అంటూ ఏమీ ఇవ్వడాలు లేవు. ప్రొద్దున్నే చద్దన్నమో, తరవాణీ అన్నమో తినేయడం, పోడం… అంతే … వర్షాకాలం అయితే… కంటిన్యూ క్లాసులు .. రెండు పూటల క్లాసులు కలిపేసి మధ్యాహ్నం వదిలేసేవారు..

ఆ రోజుల్లోకి ఒక్కసారి తీసుకెళ్ళిపోయే టైమ్ కాప్స్యూల్ ఉంటే బాగుణ్ణనిపిస్తుంది కదా.. అలా అని మన ప్రస్తుత ఫించనుకు ముప్పు రాకూడదండోయ్…

Friday, January 22, 2016

రాజమండ్రి.. 11


రాజమహేంద్ర"వరం"


  ---డి.వి.హనుమంతరావు.

స్కూలుకి శలవులొస్తే కాకినాడ వెళ్ళాలనిపించేది. ఎందుకంటే అక్కడ పిన్నిగారిల్లు చాలా పెద్దది. మామయ్యగారి పిల్లలు అక్కడ ఉండేవారు. వాళ్ల పెద్ద కాంపౌండ్ లో నాలుగైదు కుటుంబాలలో మా ఈడు పిల్లలతో సరదాగా గడుస్తుంది. అప్పట్లో తలిదండ్రుల చాటు బిడ్డలం కదా.. అమ్మా నాన్నగారు యస్ అనాలి. యస్ అన్నారంటే ఇక పరుగో పరుగు.

ఇప్పుడు నాన్ స్టాప్ బస్సులో  గంటంపావులో కాకినాడ చేరుతున్నాము కాని అప్పట్లో రెండున్నర గంటలు పట్టేది. దారిలో .. రాజానగరం,  నల్ల చెరువు, సామర్లకోట అలా అన్నిచోట్లా  కనీసం పది నిముషాలు చొప్పున ఆగేది. అప్పుడేమీ విసుగనిపించేది కాదు. అలా అలవాటు పడిపోయాం.  

బస్సులో కాకినాడ చేరుతుంటే, ముందుగా అప్పటి  కోటిపల్లి రైలు వంతెన తాలూకు శిధిలాలు …అ రాతిస్తంభాలకు చేతనత్వం వచ్చి స్వాగతం పలికినట్టుండేవి.. ఇటువైపు రాజమండ్రి చేరేటప్పుడైతే  .. రాజానగరం రూట్ లో -- ఇటూ అటూ పెద్ద పెద్ద మర్రి చెట్లు.. మర్రి పళ్లు రాలుతుంటే ఆవి ఏరుకొని తింటూ కోతులు బస్సుల కడ్డంగా వచ్చేవి.. బస్సు దగ్గరవగానే పరుగెత్తి చెట్లెక్కేసేవి.. మా చిన్నతనంలో ఆ కోతుల గంతులు చూడ్డం  భలే సరదాగా ఉండేది. ఇప్పుడు.. ఆ చెట్లు లేవు, ఆ కోతులూలేవు .. ఆ చిన్నతనమూ లేదు… ఆ సరదా లేదు. కాని ఈమధ్య ఆ రూట్ లో వెళ్తుంటే గ్రీనరీ బాగా కనిపించింది.

జనరల్ గా రాజమండ్రి గొప్ప సిటీయా, లేక కాకినాడా ? అన్న సబ్జెక్ట్ మీద కాకినాడలో పిల్లలదగ్గర హాట్ హాట్ గా చర్చలు జరిగేవి. అక్కడ వాళ్లందరూ కాకినాడ వాళ్లే.. నేనొక్కడినే రాజమండ్రి.. వాళ్లకి బోల్డ్ పాయింట్స్..బోల్డు గొంతుకలు ..  సిటీ ప్లాన్డ్, సెకండ్ మద్రాస్ అని కాకినాడకు పేరు.. రోడ్లన్నీ వెడల్పుగా నీట్ గా ఉంటాయి అన్నది పాయింట్..

రాజమండ్రి చూస్తే .. అప్పటి మెయిన్ రోడ్ గురించి ఏం చెప్తాం.. ఇప్పుడున్న వెడల్పుకి సగం ఉండేది మా చిన్న తనంలో .. ఈ షాప్ నుంచి, ఒక్క దూకు దూకితే అవతల వైపు షాపులోకి పడతాం. అంత నేరో. నిజం. అందులో ఫ్లోటింగ్ పాపులేషన్.సముద్ర ప్రవాహంలా ఉండేది ట్రాఫిక్.  ప్రక్క పల్లెటూళ్లనుంచి, రైళ్లలోనూ, బస్సుల్లోనూ… ప్రొద్దున్నే వచ్చేసి, బజారు పనులు చూసుకుని సాయంత్రం వెళ్లేవారు. ఫోర్ట్ గేట్ సెంటర్ లో నిల్చుంటే మన ప్రమేయం లేకుండా ఆ చివరకు వెళ్ళిపోతాం ... అందులోనూ ఊళ్లోవారికి ఏం కావాలన్నా అక్కడకు రావల్సిందే. ఇప్పటి లాగా  ఎక్కడ పడితే అక్కడ అందుబాటుగా కొట్లుండేవి కాదు కదా…అస్తవ్యస్తమైన ట్రాఫిక్.  

ఈ పాయింట్ మీద వాళ్లు విజృంభించేవారు. నా డిఫెన్స్… జనం లేనప్పుడు ఎంత రోడ్దుంటేనేమిటి కళా కమామీషు లేకుండా వెల వెల బోతూ ఏం బావుంది అనే వాణ్ణి.. పైగా ఒక బానర్ కట్టాలంటే ఆ మూలనుంచి ఈ మూలకు బోల్డుపురికోస. అసలు బానర్ తక్కువ, అక్కరలేని పురికొస ఎక్కువ.  అసహ్యంగా, పైగా అదంతా వేస్ట్.  .. మాకైతే అటో ముక్కా, ఇటో ముక్కా .. చక్కగా బానర్ కనపడుతుంది.. అందంగా ఉంటుంది అనేవాణ్ణి.

అప్పటికే సిటీ బస్సులు తిరిగేవి కాకినాడలో… మనకైతే వచ్చాయి కాని అంత పద్దతిగా లేవు. అదో పాయింట్. నా డిఫెన్స్ … మీరు నడక మానేసారు. అది మీ ఆరోగ్యానికి దెబ్బ.. మేం చక్కగా నడుస్తాం.. అందుకనే బస్సులు ఉన్నా మేం ఎక్కం అనేవాణ్ణి. అంటే .. బస్సు ఉంటే కదా ఎక్కడానికి… ఉన్నా ఎక్కం.. అలా సాగేది.

మాకు గోదావరి ఉందంటే.. మాకు సముద్రం ఉంది, అందులోనే కలవాలి మీ గోదావరి అనేవాళ్లు. మా గోదావరి నీళ్లు తియ్యగా ఉంటాయి, మీ నీళ్లు ఉప్పగా ఉంటాయి అని దాడి చేసేవాణ్ణి..  ఇంక

రాజమండ్రికి ఉన్న మంచి పాయింట్ అప్పట్లో మనకు 7 సినీమా హాల్స్ ఉన్నాయి. వాళ్ళకు మనకన్నా ఒకటి తక్కువ .. అయితే అక్కడ అన్ని హాల్సు ఒకే రోడ్ లో ఉన్నాయి. ఇక్కడ తలో చోటా ఉన్నాయి. ఆ మూల అశోకా పిక్చర్ పేలస్. ఇప్పుడైతే దాన్ని 1.అశోక మహల్ అంటున్నారనుకుంటా.. మొదట్లో గజలక్ష్మి అనేవారుట. మంచి పిక్చర్స్ వచ్చేవి. బాల్కనీ ఉండేది.. మా భాషలో మేడ టిక్కట్ .. పైన కాంటీన్ కౌంటర్….  క్రిందకు కనిపించేది. పాత ఇంగ్లీష్ పిక్చర్స్ లో బార్ కౌంటర్ లా ఉండేది.అంటే ఎత్తు కుర్చీలు, పొడుగు బల్లా…  బ్రెడ్ జామ్ లాంటి బేకరీ స్టఫ్ ఉండేది. ఆ హాలు మేనేజర్ గొప్ప పెర్సనాలిటీ.. అచ్చు యస్.వి.రంగారావుగారిలా ఉండేవారు. అలా అంటే ఆయనకిష్టాముండదట. ఎందుకో మరి. అయినా మనకెందుకు ? సరే ఇలా గోకవరం బస్టాండ్ వైపుకొస్తే .. 2.రామా టాకీస్. ఇప్పుడు దానిపేరు నాగదేవి. ఆ ఎదురుగా ఉన్న వీధిలో మేం కొన్నాళ్లు కాపురం ఉన్నాం. ఆ హాలు ప్రక్కనే జిత్ మోహన్ మిత్రా గారిల్లు. అప్పట్నించి ఇప్పటిదాకా అక్కడే మిత్రుడు మిత్రా ఉండేది. ఆ పాటలు విని విని వారికి బాగా పాడడం వచ్చేసింది. అద్భుతమైన సింగర్. పేటెంట్ ఫర్ కిషోర్ కుమార్ సాంగ్స్.  దాని ఎదురుగా ఉన్న రోడ్ లో 3.హనుమాన్ టాకీస్ .. అది జయశ్రీ గారూపాంతరం చెంది, ఇప్పుడు సూర్యా .. సూర్యా మినీ పాలస్ గా చలామణీ అవుతోంది.  ఈ హనుమాన్ టాకీస్ ఎదురుగా బోల్డు ఖాళీ స్థలం. చర్చ్, పోలీస్ గస్ట్ హౌస్ అప్పుడు ఇవేవీ లేవు. సాయంత్రమయ్యేటప్పటికి సినీమా పాటలు గ్రామఫోన్ రికార్డులు వేసేవారు. ఆ ఆరుబయట ఎంతోమంది కూర్చుని వినేవారు. అప్పట్లో అన్ని సినీమా హాల్స్ లోనూ నేల టిక్కట్ (వీపులేని బెంచీలు వేసేవారండోయ్) పావలార్థణా ఉండేది. -- బెంచీకి వీపా అనకండి. అర్థం చేసుకోండి. మీరర్థం చేసుకుంటారు నాకు తెలుసు.---  సరే !  ఇతర  థియేటర్స్ లో ఆడినంత కాలం ఆడి,, అలా ఆడిన సినీమాలు ఈ హాల్ కి వచ్చేవి .. ఇక్కడ నేల మూడణాలు. వాల్ పోస్టర్ మీద 0-3-0 అని వ్రాసేవారు. కొన్ని సినీమాలకైతే బేడా కానీ కూడా ఉండేది. అంటే సగం రేటన్నమాట. పావలార్థణాలో సగం ‘బేడా కాని’ కదా.. అలా ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్ వైపుకొస్తే ఆ ఎదురుగా ఉన్న సందులో లోపలికి వెళ్తే 4.మినర్వా టాకీస్ . అది తర్వాత అన్నపూర్ణ అయింది. ఈ మినర్వా టాకీస్ ఓనర్స్ నిడమర్తి వారనుకుంటా. వైజాగ్ లో ఉన్న మినర్వా టాకీస్ కూడా వీరిదే అనేవారు. అక్కడ నుంచి దక్షిణంగా వెళ్తే 5.కృష్ణా. అది కూడా నిడమర్తివారిదే అప్పట్లో… ఈ నిడమర్తివారికి దుర్గా సినీటోన్ అని ఒక స్టుడియో ఉండేది. మొట్ట మొదటి తెలుగు ఫిల్మ్ స్టుడియో అదే .. అందులో సంపూర్ణ రామాయణం షూటింగ్ జరిగింది.  ఇప్పుడు కృష్ణా థియేటర్  సాయీ కృష్ణ అయి మరల పేరు మార్చుకుంది. ఈ హాలు రోడు మీదకి వీధిగుమ్మం, పెరట్లోనుంచి టిక్కట్లు ఇస్తారు. కొన్నాళ్లు సైడులోంచి ఇచ్చేవారు.అప్పట్లో  కృష్ణా టాకీస్ లో రఘురామయ్య వాళ్లూ నటించిన  శ్రీ కృష్ణ తులాభారం సినీమా వేసారు. మా ఇల్లు పేపర్ మిల్లు దగ్గర. సుమారు అయిదు మైళ్లు. నడకలే. అప్పుడు సైకిల్ రిక్షాలు గట్రా లేవు. కొద్దిగా లాగుడు రిక్షాలు ఉండేవి. మా అమ్మగారు పేటలో వాళ్లను పోగేసి మాపిల్లలను తీసుకుని ఆ పౌరాణిక సినీమా చూడ్డానికి తీసుకెళ్లింది. మేం వెళ్లేటప్పటికి కొంత సినీమా అయిపోయింది. సినీమా అయిపోయాక తర్వాత ఆటలో ముందు మేం చూడలేకపోయిన సినీమా చూస్తానంటుంది ఈవిడ. అలా కుదరదంటాడు హాలు. అంత దూరం నుంచి ఈ కాస్త ముక్క కోసం మళ్ళీ ఏం  వస్తాం.. చూడాల్సిందే అని ఈవిడా…. మొత్తానికి ఒప్పుకున్నాడు. అది కాస్తా చూసి, నెమ్మదిగా ఇంటికి చేరాం. అక్కడనుంచి మెయిన్ రోడ్ మీదకొస్తే 6.జయా టాకీస్. తర్వాత అది విజయా టాకీస్ అయింది. దీని వొనర్ వోల్టా ప్రొడక్షన్స్ బేనర్ మీద సినీమా కూడా తీసారు.  ఇందులో హిందీ సినీమాలు ఆడేవి. దుబాసీలు ఉండేవారు. అంటే హిందీకి తెలుగు చెప్తారు. వారి వారి చమత్కారాలు కూడా జోడించి సరదాగా చెప్పేవారు. ఒకసారి విన్న గుర్తు. 7. శ్యామలా .. అది అన్నింటికన్నా లేటెస్ట్ అన్నమాట. అన్ని థియేటర్స్ లోనూ నాలుగణాలన్నర నేల టిక్కట్ అయితే ఇక్కడ అయిదణాలు. దాన్ని బట్టే మిగతా టికట్స్ ధరలు అని పాఠకులు గుర్తించాలి. చాలా కాలం ఇవే హాల్స్. నగరంలో సినిమాలు అని ప్రతీ హాల్ లోనూ బోర్డ్ ఉండేది. నగరం కంప్లీట్ చేయడం అంటే ఒక రౌండ్ అన్ని సినీమాలు చూడగలగడం మా వయసు వారికి ఓ అచీవ్ మెంట్. తర్వాత స్వామి,కుమారి.. కేవలం ఇంగ్లీష్ సినీమాల కోసం లక్ష్మీ, గంగ, యమునా,సరస్వతి, వీరభద్రా (తర్వాత అదే శివజ్యోతి అయింది.)నటరాజ్, జయరాం .. ఇలా చాలా వచ్చాయి. సినీమాలు చూడ్డం తగ్గిపోయిన నాకు కొన్ని హాల్స్ పేర్లు కూడా ఇప్పటివాటివి తెలియదు. తర్వాత్తర్వాత రాజమండ్రికి ఫిల్మ్ డిస్టిబ్యూటర్స్ వచ్చి ఆఫీసులు తెరచి,
ఇన్నీస్ పేట పేరును, టి.నగర్ గా మార్చారు. మద్రాసులో టి. నగర్ లో సినీమా ఆఫీసులు, స్టూడియోలు ఉంటాయిష ..

అప్పుడు బస్సులన్నీ గోకవరం స్టాండ్ నుంచి బయల్దేరేవి. కాంప్లెక్స్ కాని కోటిపల్లి బస్టాండ్ కానీ లేవసలు. అయినా ఊరిపేర్లతో బస్ స్టాండ్ కొంచెం   కన్ఫ్యూజన్ కదా. గోకవరం బస్టాండ్ అంటే గోకవరంలో ఉన్న బస్టాండా లేక గోకవరం వెళ్ళడానికి రాజమండ్రిలోని బస్టాండా. రెండూ కాదు, రాజమండ్రిలో ఆ పేరుమీద పిలవబడే  ఒకానొక బస్టాండ్ .. mutatis mutandis.. కోటిపల్లి బస్టాండ్ కూడా అంతే.
మొట్ట మొదట వైజాగ్ కు ఇక్కడనుంచి ఎక్ష్ప్రెస్స్ బస్ వేసారు. ఆ బస్సుల వాళ్లు భలే టైమింగ్స్ మెయింటైన్ చేసేవారు. ఉదయం సరిగా 6గంటలు బయల్దేరి 11 అయ్యేటప్పటికి వైజాగ్. అలాగే ఉదయం 6గంటలకి వైజాగ్ లో .. 11కల్లా రాజమండ్రి. మధ్యాహ్నం ఒంటిగంటకో బస్సు అట్నుంచీ, ఇట్నించీ కూడా ఉండేవి. కొత్తలో లోపల ప్రయాణీకులకు పెప్పర్ మెంట్స్  పెట్టేవారు.  రాజమండ్రి మీదుగా హైదరాబాదుకు బస్సులుండేవి. అయితే అప్పుడు రోడ్ కం రైలు బ్రిడ్జ్ లేదు. అందుకని గౌతమీ జీవకారుణ్య సంఘం ఎదురుగా లాంచీ ఎక్కి అటు ఇంకో బస్సు ఎక్కేవారు. ఆ బ్రిడ్జ్ లేకపోవడం వలన, అలాగే రావులపాలెం దగ్గర సిద్దాంతం దగ్గర బ్రిడ్జ్ లు లేకపోవడం వలన .. కోనసీమ పంటలకు రాజమండ్రీయే పెద్ద మార్కెట్. అరటి పళ్లు, కొబ్బరి ఇలాంటివన్నీ ఇక్కడకొచ్చేవి. చవకగా కూడా ఉండేవి.

జీవనది గోదావరివలన రాజమండ్రి ఉనికి. ఎంతో మందికి ఈ పావన గౌతమి జీవనాధారం. ఒకప్పుడు గోదావరి మూలాన రాజమండ్రిలో కలప వ్యాపారం బాగా సాగింది. గోదావరి పరీవాహక ప్రాంతం కావున ఇక్కడ దొరికే మట్టి .. గ్రాఫైట్ క్రుసిబుల్స్ కు ఉపయోగపడుతుంది కనుక ఇక్కడ ఎన్నో క్రుసిబుల్ ఇండస్ట్రీస్ వచ్చాయి. ఈ నదీ జల పానం వలన కవిత్వం వస్తుందని చెప్తారు. టంగుటూరి ప్రకాశంగారు తన జీవిత కథలో వ్రాసారు కూడా . అందుకనే ఆయన రాజమండ్రి పై మక్కువ పెంచుకుని ఇక్కడకు మకాం వచ్చేసారు.

ఎంతైనా మన రాజమండ్రీ ... రాజమండ్రియే
భగవంతుడిచ్చిన వరం … 
మన రా జ మ హేం ద్ర "వ రం" ….