Pages

Saturday, September 28, 2013

గురువయ్యూర్



   గురువయ్యూర్....2.


 క్షేత్రదర్శనం-2


  ( రెండవ భాగము. )
(తృప్తిగా స్వామి దర్శనము.)



పఠంతో నామాని - ప్రమదభరసింధౌ
స్మరంతో రూపం తే - వరద ! కథయంతో గుణకథాః
చరంతో యే భక్తా - స్త్వయి ఖలు రమంతే పరమమూ -
నహం ధన్యాన్ మన్యే - సమధిగత సర్వాభిలషితాన్.
 
గురువయ్యూర్ దేవుడు.. గురువాయురప్ప.
చతుర్భుజుడైన నారాయణుడు. చిన్న విగ్రహము.
ఈ అర్చామూర్తిని స్వయముగా వైకుంఠనాధుడే బ్రహ్మదేవుని కోరికమేరకు, బ్రహ్మకు  ఇచ్చాడని ఐతిహ్యం.
బ్రహ్మదేవుని నుండి సుతపుడు అను మహర్షికి, తర్వాత కశ్యప ప్రజాపతికి ఆయనద్వారా క్రమంగా వసుదేవునికి వచ్చి .. 
ఆయా కాలాలో అర్చించబడింది. 
శ్రీ కృష్ణుడు ద్వారకలో ప్రతిష్టించి అర్చించాడు.

యుగాంతంలో ద్వారక మునిగిపోయే సమయంలో ఈ అర్చామూర్తిని ఉద్ధవునికిచ్చి “దేవగురువు బృహస్పతి ద్వారా దీనిని ఒక పవిత్ర క్షేత్రంలో ప్రతిష్టింపజేయమని” శ్రీకృష్ణుడు ఆదేశించాడు.
గురుడు వాయుదేవుని సహకారముతో, పరమేశ్వరుని సూచనమేరకు, పరశురామ క్షేత్రమైన అప్పట్లో అంబాపురం గా పిలువబడే ఈ క్షేత్రంలో ప్రతిష్ట చేసారు.

గురువు, వాయువు ప్రతిష్ట చేయుటచే స్వామి ‘గురువాయురప్ప’ గా పిలవబడుతున్నాడు. క్షేత్రం గురువాయుపురమయింది. అదే ఈ గురువయ్యూర్..
ప్రక్కన ‘రుద్రతీర్థం’ అనే పుష్కరిణి. అందులో శివుడు చాలా కాలము తపస్సు చేసాడట. ఈ పుష్కరానికి ఈ ప్రక్క గురువాయురప్ప, ఆ తీరాన మమ్మియూర్ లో పరమశివుడు కొలువైనారు. మమ్మియుర్ లోని  శివుని చూడకుండా గురువయ్యూర్ యాత్ర పూర్తికాదని చెప్తారు. అవకాశము లేనివారు గురువయ్యూర్ దేవళములో ఉన్న భగవతి అమ్మ ఆలయమునుండి ఈశాన్యదిశగా తిరిగి మమ్మియూర్ శివునికి భక్తితో అంజలి ఘటిస్తారు. అక్కడ ఆ సూచనతో  బోర్డ్ కూడా పెట్టారు.

అశ్వద్ధామ వేసిన బ్రహ్మశిరోనామాస్త్రం ఉత్తర, గర్భవిచ్చిత్తి చేయబోతుంటే ..
‘గతాగత ప్రాణుండై శిశువు చింతించు సమయాన’....  “గదజేబట్టి పరిభ్రమించుచు గదాఘాతంబునన్ దుర్భయప్రదమై వచ్చు శరాగ్ని దుత్తుమురుగా భంజించి రక్షించు సదయుడు..”... అలా పరీక్షిత్తును రక్షించిన వాసుదేవుడు. దేవకీ, వసుదేవులకు జన్మించి దర్శనమిచ్చిన “...శంఖ చక్ర పద్మ విలాసుడు,  గంఠ కౌస్తుభ మణి కాంతి భాసుడు, కృపావిశాలుడూ ….” ఆ చతుర్భుజుడైన శ్రీ మన్నారాయణమూర్తియే ..

ఇప్పుడు  “శిరమున రత్న కిరీటము, కరయుగమున శంఖచక్ర ఘన భూషణములు, ఉరమున వజ్రపు బతకము దాల్చిన” గురువాయూర్ పురనాథునిగా గురువయ్యూర్ లో దర్శనమిస్తున్నాడు.

రూమ్ లో స్నానాదికములు  పూర్తి చేసుకుని, స్వామి దర్శనానికి లైనులో నించున్నాము. జనం బాగానే ఉన్నారు. మడత మడతలుగా వరుసలు, మొదట ఒక వైపుకి, మరల రెండో వైపుకి అలా అటూ ఇటూ కదులుతూ, మహా ద్వారము గుండా, లోపలకి ప్రవేశించాము. పద్దతిగా జనాన్ని వదలడమువలన ఎక్కడ తోసుకోవడం, తొక్కుకోవడం అనుభవమవలేదు. లైనులో వున్నవారు - విష్ణుసహస్రము కాని, నారాయణీయము కాని, ఇంకా ఏవేవో పుస్తకాలు చదువుతున్నారు. కొందరు “నమో నారాయణా “ అంటూ భక్తి ప్రకటిస్తున్నారు. మేము కూడా మా దగ్గర ఉన్న నారాయణీయము ఒక్కొక్క శ్లోకము అర్థంతో చదవడము మొదలెట్టాము .. రెండుగంటలకన్నా తక్కువ వ్యవధిలో దర్శనము పూర్తి చేసుకుని బయటికి వచ్చాము. దర్శనము తృప్తిగా లేదు. “ఇన్ని ఏర్పాట్లు చేసుకుని మేం వస్తే ఇంతేనా మాకు ప్రాప్తం” అని స్వామితో మౌనంగా చెప్పుకున్నాము.. విన్నాడా అన్నట్టుగా తర్వాత దర్శనాలు ఒకదానికన్నా ఒకటి ఆనందాన్ని కలిగించాయి.

గురువయ్యూర్ లో ’నిర్మాల్య దర్శనము’ చాలా ముఖ్యమని చెప్పారు. తెల్లవారఝామున మూడుగంటలకు ఆ దర్శనానికి అనుమతిస్తారు. ఆ దర్శనం చేసుకోవడానికి  ఒంటిగంటకే వరసలు కట్టేస్తారు. మేము వెళ్లిన మూడో రోజు ఆ నిర్మాల్య దర్శనానికని మేమిద్దరమూ తెల్లవారుఝాము ఒంటిగంటకు లేచి, ఒంటిగంటన్నరకు స్నానాలు చేసేసి లైనులోకి వెళ్లాము. మేము వెళ్లేటప్పటికే యాభై అరవై మంది అప్పటికే లైనులో ఉన్నారు.. ఆడవారికి  (బహుశా ఒంటరిగా వచ్చినవారు అయి వుంటారు) వేరే లైను ఉంది. కుటుంబాలతో వచ్చిన వారు మా లైనులో ఉన్నారు. రెండు గంటలు దాటుతుంటే ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గారు ఆలపించిన నారాయణీయం శ్లోకాలు స్పీకర్ లో శ్రవణానందముగా  వినిపిస్తుండగా లైనులు కదిలాయి .. “శ్రీ కృష్ణం శరణం మమ” అని వినిపిస్తుండగా మహా ద్వారం సరిగా మూడు గంటలకు తెరిచారు..క్రమంగా గర్భాలయము చేరి,  స్వామిని దగ్గరనుంచి చూసాము. అదొక అద్భుత దర్శనము,
ఆనందమై పోయింది. నిర్మాల్యమంతా తీసేసిన మూల విరాట్టు.. స్నానానికి సిద్ధమైన పసిపిల్లవాని రూపంలో నేత్రానందముగా దర్శనమిచ్చాడు. ఆ తర్వాత నుంచి అభిషేకాలు ప్రారంభమవుతాయన్న మాట. ఈ స్వామికి తైలాభిషేకం కూడా రోజూ చేస్తారట.

గురువయ్యూర్ ఆలయంలో పరిశుభ్రత, ఆచారము చక్కగా పాటిస్తారు. ప్రధాన అర్చకుణ్ణి ‘మేల్ శాంతి’ అంటారు. ఆ తర్వాత హోదాలవారిగా మిగతా అర్చకులు ఉంటారు. ‘మేల్ శాంతి’ మాత్రమే మూలవిరాట్ కు అర్చన చేస్తారు. ఆయన ఆరు నెలలకోసారి మారతారు. కావాలంటే కొన సాగవచ్చునట. అర్చనచేసిన కాలములో అంటే ఆరునెలలు ఆయన ఆలయములోనే ఉండాలి. కఠిన బ్రహ్మచర్యదీక్షలో ఉండాలి. ఆ యా సేవల నడుమ ఆలయ ప్రాంగణంలో ఓ మూల ఆయన విశ్రాంతిగా కూర్చుని ఉంటారు.. మన గమనించి చూడవచ్చు. సన్నగా ఎర్రగా, తెల్లటి పంచె పొందిక గా కట్టుకుని, చూడగానే నమస్కరించాలనిపించే విధంగా ఉన్నారు ఆ ‘మేల్ శాంతి’.

ఆలయ ప్రవేశము హిందువులకు మాత్రమే. మగవారు విధిగా ధోవతి కట్టుకోవాలి, పైన ఉత్తరీయము ఉండవచ్చు. పాంటులూ, బనీనులు చొక్కాల వంటివి అనుమతించరు. లుంగీలాగా పంచె కట్టవచ్చు కాని, గళ్లలుంగీలు పనికి రాదు. ఆడవారు సాంప్రదాయ దుస్తులనే ధరించాలి. ప్యాంటులు పైన లుంగీలు కట్టుకున్నవారు, తెల్లదొరలు ఎక్కడా కనపడలేదు.

‘శ్రీ వెల్లి’ .. స్వామి ఊరేగింపు. చాలా బాగుంటుంది. ఇక్కడ తిరువీథి ఉత్సవమది. ఆ ఉత్సవాన్ని మూడు సార్లు చూసే అదృష్టం కలిగింది.ఆ ఊరేగింపు ముందు “మేల్ శాంతి” నడుస్తారు. ఆయన మడికి భంగముకలుగకుండా రక్షణ వలయముగా అర్చకులు చుట్టూ ఉంటారు. ఆయన   ముందు పవిత్రజలాలను బలిపీఠంపై జల్లి నివేదన చేస్తారు. ఆలయం నలుమూలలా ఉన్న బలి పీఠాలపై జలం జల్లి పూలు పెడ్తారు . ఆయన వెనక నాదస్వరాది వాద్యములు వాయిస్తూ కళాకారులు. వారి తర్వాత ఆంగ్ల అక్షరము z ఆకారములో వంచబడిన వెండి ఊచలకు, వెండి జ్యోతులు తగిలించుకుని ఆ దీపాలతో మడిగా పది పదిహేను మంది బ్రాహ్మణులు.. ఆ వెనుక రాచ ఠీవితో .. మందగమనంతో స్వామి ఆస్థాన కరీంద్రుడు కదలుతాడు. . దానిపై ఉప పురోహితులు  స్వామి బంగారు ఉత్సవ మూర్తి ని పట్టుకుని, కూర్చుని ఉంటారు. చిన్న విగ్రహము. చూడముచ్చటగా ఉంటుంది. ఆ మదగజము ముచ్చటగా కదులుతుంటే “హరే రామ, హరే కృష్ణ” అంటూ వెనుకగా భక్తజనము కదులుతారు. ముమ్మారు ప్రదక్షిణాగా సాగిన తర్వాత ఆలయ ప్రవేశ ద్వారంవద్దకు రాగానే, ఆ మహా గజము వినయంగా కాళ్ళు మడచి కూర్చుంటుంది. స్వామి  ఏనుగుమీద నుంచి దిగి ఆలయ ప్రవేశం చేస్తారు. ఊరేగింపు పూర్తిఅయ్యేవరకూ  లోపలకి ఎవరినీ అనుమతించరు.
ఈ శ్రీవెల్లి ఉత్సవంలో   --హరే రామ, హరే కృష్ణా అంటూ ఒకసారి భక్తజనంలో కలిసి గజేంద్రుని అనుసరించాము. , మరొకసారి ముందునుంచి చూసాము, ఇంకొకసారి ఉత్సవమూర్తి ఆలయ ప్రవేశంచేస్తుంటే .. ఆలయ ప్రవేశద్వారం దగ్గర ఉండడంవలన స్వామిని దగ్గరనుంచి చూసే అదృష్టం కలిగింది.

తులాభారము.. కోరికసిద్ధించిన భక్తులు వివిధ వస్తువులతో తులాభారము చేసుకుని స్వామికి సమర్పించుకుంటారు.. చాలా మట్టుకు వస్తువులు నిర్ణయించిన ధరకు దేవస్థానం ఏర్పాటుచేస్తుంది. పసి వారికి  అన్నప్రాసన చేసే పధ్ధతి కూడా ఉంది.

ఈ స్వామి అనుగ్రహముంటే ఎలాంటివ్యాధిఅయినా నయమవుతుందన్నది సత్యము. నారాయణ భట్టాద్రి అనే ఒక మహానుభావుడు పది హేనవ శతాబ్దంలో తన గురువుగారికి కర్మవశాత్తు కలిగిన పక్షవాతరోగాన్ని తనకు సంక్రమింప జేసుకుని, తననుండి ఆ వ్యాధిని పోగొట్టుకోవడానికి ఈ స్వామిని ఆశ్రయించాడు. రోజూ ఇక్కడ “రుద్రతీర్థం”లో స్నానంచేసి, స్వామి ఎదురుగా కూర్చుని భాగవత కథను వేయి శ్లోకాలలో వ్రాసి స్వామికి వినిపించేవాడు. పూర్తయ్యేటప్పటికి నారాయణాద్రి రుగ్మత పూర్తిగా తగ్గిపోయింది. గర్భాలయములో నారాయణాద్రి కూర్చుని భాగవతం వ్రాసిన పదేశాన్నిసూచిస్తూ ఒక శిలాఫలకము కనబడుతుంది. అతడు వ్రాసిన గ్రంధము “శ్రీమన్నారాయణీయం”. వివిధ భాషలలో వ్రాసిన భావార్థంతో అది లభ్యమవుతున్నది.
నారాయణాద్రి అనే మహాకవి నారాయణుని గురించి వ్రాసి ఆ నారాయణీయునికే వినిపించిన మహా మహిమాన్విత గ్రంధమది. నిత్యమూ అది పారాయణచేసేవారెందరో ఉన్నారు. ఒకరోజు, నేనూ, మా శ్రీమతీ చెరో పుస్తకమూ పట్టుకుని ఆసాంతమూ చదివి స్వామికి నివేదించుకున్నాము.

ప్రాంగణంలోనే ఒక చోట బల్లపై శరీరంలోని వివిధ అంగముల వెండి రూపులు  ఉంచారు. ఏ అవయవమునకైనా అనారోగ్యము కలిగితే, దానికి సంబంధించిన రూపు  అడిగితే అక్కడ ఉన్న ఆసామీ మనకు ఇస్తాడు. అది తీసుకుని మన సమస్య స్వామికి నివేదించుకుని మనకి తోచిన సంభావన అక్కడున్న హుండీలో వేస్తే చాలు.  ఇంత ఇవ్వాలి -- ఇంతే   ఇవ్వాలి--- అనే ప్రశ్నలేదు. అక్కడేకాదు ఆ ఆలయములో ఎక్కడా “డబ్బు” పెట్టమనే  వారెవ్వరూ కనపడలేదు. వి.ఐ.పి.లు - ప్రత్యేక దర్శనాలు లేవు.. స్వామికి అర్చనలు అవుతూ ఉంటాయి, దర్శనాలు అవుతూ ఉంటాయి.

ఒకరోజు ఆయన ఎదురుగా కాస్సేపు నిలబడాలనే కోరిక బలంగా కలిగి,  అలాంటి సేవ ఉందా అని అడిగితే లేదన్నారు.. ఆ మర్నాడు మేము సీనియర్ సిటిజన్స్ లైనులో లోపలకి వెళ్లాము. ప్రత్యేక సమయాలలో సీనియర్ సిటిజన్స్ ను అనుమతిస్తారు. ఆ లైనులోకి వెళ్లడమే, వయస్సు ప్రూఫ్ పట్టుకెళ్లాంగాని, ఏ చెకింగూ లేదు. ఆ నిజాయితీ మనకుండాలి. ఆ లైనులో గర్భగుడిలోకి వెళ్ళాము . అప్పుడే తిరువీధి నుండి స్వామి వేంచేసారు.వెండి జ్యోతులు పట్టుకు ముందునడచిన వారిని ముందు దర్శనానికి అనుమతించారు.. ఆ సమయానికి మేము స్వామికి ఎదురుగా వచ్చాము. మా ముందు ఒక మంటపము, అక్కడనుంచి స్పష్టంగా స్వామి కనపడుతూ ఉంటారు.  అక్కడ మమ్ము నిలబెట్టేసారు.. ముందువారు కదిలెదాకా..కుడి వైపు తిరిగి,అలా ఎడమ వైపు,మళ్లీ ఎడమవైపు వెళ్తే స్వామికి ఎదురుగా దగ్గరగా వెళ్తామన్నమాట. అదేకదా నిన్న మేము కోరుకున్న దర్శనం. ఎంత దయ స్వామిది అనిపించింది. ఆయన అనుగ్రహముతో పది పదిహేను నిముషాలు ఆయన్ని ఆనందంగా చూసే భాగ్యం కలిగింది, కోరుకున్న విధంగా.. తీరుబడిగా… తృప్తిగా దర్శించుకున్నాము.


(మూడో భాగం త్వరలో )













Saturday, September 21, 2013

హింది-తెలుగు హాస్య యుగళ,,,



రాజమండ్రిలో హింది-తెలుగు హాస్య యుగళ కవితా సమ్మేళనం.


నిన్న అంటే 20-9-2013 న రాజమండ్రీలో హిందీ,తెలుగు యుగళ హాస్య కవితా సమ్మేళనం జరిగింది.. చాలా బాగా జరిగింది. అక్కడ చాలా హాస్యం పండింది. హైదరాబాదు వాసులకు సుపరిచితులైన… నరేంద్రరాయ్ (చిత్రకారులు కూడా), వేణుగోపాల్ భట్టర్ , పండిట్ రామకృష్ణపాండే, వహీద్ పాషా ఖాద్రీ పాల్గొన్నారు.  ఇందులో భట్టార్ గార్కి
ఫేస్ బుక్ ఉందట.  అందులో వారు జోకులు పెడ్తూ ఉంటారట. స్థానికులైన కొందరు తెలుగు కవులు వారితో కలసి, హిందీ తెలుగు యుగళ హాస్య కవి సమ్మేళనం  జరిపారు. విని కొన్ని పాయింట్స్ లా వ్రాసుకుని కూర్చుకున్నా..వారి భావాన్ని, వారి భాషాసౌందర్యాన్ని పట్టుకునేటంత భాష నాకు రాదు. నాకొచ్చిన కొద్దిపాటి హిందీ పరిచయంతో అర్థంచేసుకునే ప్రయత్నం చేసా.. పట్టుకోగలిగిన పంచ్ కి రూపకల్పన చేసి హాస్యం ఆవిష్కరించబోయా.. ఇందులో  అంటె నేనందించే ప్రయత్నంలో చేసిన తప్పులు నావి .. హాస్యం వారు పండించిన తీరు అభినందనీయం.. ఆ జోకులు మీతో పంచుకోవాలని..

ఒక పిల్లికి ఎలుకల మంద ఒకటి కనపడింది. పిల్లికి అమితానందం అయిపోయింది. ఒక్కదాన్నైనా పట్టి విందు చేసుకోవాలని వాటి వెంట పడింది.పిల్లీ, అండ్ ఎలుకలు - టామ్ అండ్ జర్రీల్లా - పరుగెత్తాయి. అందులో వయోభారంతో ఒక ఎలుక వెనుకబడింది.. ప్రాణభయం ఎక్కువయింది. తెగించింది. వెనక్కి తిరిగి పిల్లిని చూసి కుక్కలా భౌ భౌ అని మొరిగింది.  నోటిదాకా వచ్చేసిన కూడు పట్టుకోబోతున్న పిల్లి ఖంగు తింది.. ఆగింది .. తటపటాయించింది.. వెనక్కి తిరిగి పరుగో పరుగు.. ఊహించని ఈ పరిణామానికి వృద్ధ మూషికానికి మతి పోయింది. పారిపోయిన మిగతా మూషికాలు వెనక్కి వచ్చి ఈ ముసలి ఎలుకను అభినందించాయి.. అప్పుడు ఆ వృద్ధ మూషికం …”ఇతర భాషలు నేర్చుకోవడం వలన ఆపదలనుండి గట్టెక్కొచ్చు.. తెలుసా”... అని పెద్ద కన్నంలోంచి కలుగులోకి పోయింది.

మారిపోతున్నాయి ఫేషన్లు. ఒక ఆధునిక యువతి జేబురుమాలు అంత సైజు చక్కని గుడ్డ తెచ్చి దర్జీకి ఇచ్చి జాకెట్ కుట్టమంది. ఆ దర్జీ అడిగాడు “అమ్మా మిగిలిని ముక్క ఏం చేయమంటారు “ అని…

నెమలి కన్ను నెత్తికెక్కినా శ్రీ కృష్ణుడు అందగాడే…

ఇదివరలో గడియారాలు లేవు.. అయినా మంచి పనులు చేయడానికి సమయముండేది..
ఇప్పుడు అందరికీ గడియారాలున్నాయి.. సమయం మాత్రం లేదు..

హాస్య కవులు ఒక పిచ్చాసుపత్రిలో కార్యక్రమం చేస్తున్నారు. కవి తన కవితలు  వినిపిస్తున్నాడు. వేదికమీదనున్న మరియొక కవి దగ్గరకొచ్చి ఒక పిచ్చాడు చెవి కొరికేస్తున్నాడు. ఏదో చెప్పేస్తున్నాడు. ఏమిటంటే.. “నేనూ చెప్పగలను.. కాని నన్నిక్కడ బంధించి లోపల పెట్టారు. వీణ్ణిలా బయటొదిలేసారు.”

ఒక బిజీ రోడ్. ట్రాఫిక్ విపరీతంగా ఉంది. ఆగమని రెడ్ సిగ్నల్ పడింది. ఒక యాచకుడు కారుదగ్గరికి వచ్చాడు. ముష్టి కోసమా కాదండీ బాబూ…  “ఒన్ డే మాచ్ స్కోర్ ఎంత” తెలుసుకోడానికి .. అది క్రికెట్ ఫీవర్.

ఎప్పుడూ టి.వి.కి అతుక్కుపోతున్న గృహిణి తో విసిగెత్తి భర్త టి.వి. అమ్మేస్తానన్నాడుట. అయితే నిన్నొదిలేస్తున్నానందావిడ.

కవి సమ్మేళనానికి బయల్దేరుతున్న ప్రేక్షకునికి ఒక సాధువు దర్శనమిచ్చాడు. ‘“అక్కడ చక్కగా తప్పట్లు కొట్టు.. అలా కొట్టలేకపోతే వచ్చే జన్మలో ప్రతి ఇంటిముందునుంచుని తప్పట్లు చరుస్తూ అడుక్కునే జన్మఎత్తాల్సి వస్తుంది.. చూసుకో” అని హెచ్చరించాడు. ఇక కొట్టక చస్తారా..

ఒక తెలుగు కవి చెప్పింది.. “హిందీవాళ్లకు ముందు చూపెక్కువ.. హిందిలో చదువుకు “శిక్ష” అంటారు. తరగతికి “కక్ష” అంటారు. ఇప్పుడు నిజంగా అదే జరుగుతోంది.”

“ఆ దరిద్రపు సీరియల్.. ఆ అమ్మాయికి కడుపొచ్చింది అని సంవత్సరమయింది చెప్పి. ఇప్పాటి దాకా పురుడు రాలేదు.. వింతకదా “ఒక బుల్లితెర ప్రేక్షకుని ఆవేదన.

“राज नीति तॊड्ती.. साहित्य जॊड्ती” … అంటే రాజకీయం తెంపుతుంది, సాహిత్యం కలుపుతుంది.

ఒక ఎగ్జిబిషన్ జరుగుతోంది. అందులో ఒక చిత్రకారుని చిత్రాలు ప్రదర్శిస్తున్నారు. ఆ చిత్రకారుని మిత్రుని చూడబోయాడు. కొన్ని చిత్రాలు అర్థంకావటంలేదు. అది మాడర్న్ఆర్ట్  అన్నాడు మిత్రుడు. ఒక చిత్రం చూపించి ఇదేమిటి. అని అడిగాడు ఈ అజ్ఞాని.
అది “సీతాపహరణం”.
ఇక్కడేమీ కనపడటం లేదు.. రాముడేడి ?”
“మాయ లేడిగా వచ్చిన మారీచుని వెనక వెళ్లాడు”
“లక్ష్మణుడేమయ్యాడు “
“అన్నగారి ఆర్తనాదం వినపడి వెతుక్కుంటూ పోయాడు.”
“మరి సీత”
“రావణాసురుడు ఎత్తుకుపోయాడు”
“రావణుడు కూడా కనపట్టంలేదు”
“”లంకకు పోయాడు”
“అయితే నువ్వు గీసిన చిత్రమేంటి. ఒక గీత గీసి రామాయణం అంతా అంటున్నావు.”
“ఆ గీత లక్ష్మణరేఖ అర్థం చేసుకో.. అదే మాడర్న్ఆర్ట్. “
ఆ ఆర్టిస్ట్ అంతర్జాతీయ ఖ్యాతి వహించిన చిత్రకారుడట.  

తమాషా ఏమిటంటే పాండే, భట్టర్ ఒకరినొకరు దెప్పిపొడుచుకున్నట్టు జోకులు పండించారు. చాలా బాగుంది.

ఒక విమాన ప్రయాణంలో భారతీయుని ప్రక్కన చైనా వాసి. దోమ చైనా వానిని కుట్టబోయింది. ఒక దెబ్బ కొట్టి చచ్చిన దోమని నోట్లో వేసుకున్నాడు. ఆ తర్వాత భారతీయుని పై వాలింది. అతన్ని కుట్టగానే…

ఇలా భట్టర్ చెప్పగానే పాండే “ఈయన మార్వాడీ అండి. అందుకని ఆ దోమను చంపి .. ఆ చైనా వానికి అమ్మేశాడు” అని కొస మెరుపు ఇచ్చాడు.

అనగానే భట్టర్ “ఒకసారి మిత్రుడు పాండే ముఖం మీద వాలిందండి ఒక దోమ. అది చూసి అతని భార్య లాగి లెంపకాయ కొట్టింది. ఉలిక్కి పడి ..
” ఎందుక్కొట్టావు” అన్నాడు..
“దోమ” అంది భార్య ..
” అయినా అంత గట్టిగా కొట్టవెందుకు “అన్నాడు పాండే..
“నే త్రాగావలసిన నెత్తురు మరొకరు త్రాగితే ఊరుకుంటానా మరి ?” అది ముక్తాయింపు.

దంపతులకు ఫస్ట్ నైట్.. అమ్మాయి తెల్ల చీర కట్టుకుని, తలనిండా పూలు తురుముకుని, వచ్చి కూర్చుంది,మల్లెలపరుపుపైన.. పెళ్లికొడుగ్గారు.. గ్లాక్సో పంచె కట్టుకుని విలాసంగా లోపలికి వచ్చాడు. తలుపు గడియ పెట్టాడు. మధుర క్షణాలకు తెరలేస్తోంది.. ఉత్కంఠ అమ్మాయి మదిలో.. సడన్ గా ఇద్దరు పిల్లగాళ్ళు మంచక్రిందనుంచి వచ్చారు. “కళ్యణరామ్ శోభనం .. కెమెరామాన్ రాంబాబుతో నారాయన్.. తమాషా టి.వి. అంటూ వస్తే టి.వి. ఉద్యోగి అయిన పెళ్లికొడుకు ఖంగు తిని.. వాళ్లను తరిమి కొట్టాడు.

హింది భాషా పదాలకు, డు, ము, ఉ లు జేరితే తెలుగైపోతుంది.. మేము మీ భాషకు అంత దగ్గర.”  అదీ హింది కవుల హృదయ వైశాల్యం.
మధ్యప్రదేశాది రాష్ట్రాలలో తెలుగు సెకండ్ లాంగ్వేజిగా ఉందని హిందీ కవులు చెప్పారు.

సాయంత్రం ఏడుగంటలకు ప్రారంభమైన కార్యక్రమం పదిన్నరవరకు నవ్వుల కోలాహలంగా సాగింది..



Thursday, September 19, 2013

గు రు వ య్యూ ర్


గు రు వ య్యూ ర్ - 1
  క్షేత్రదర్శనం


(జులై నెలలో కేరళలో ఉన్న గురువయ్యూర్ క్షేత్ర దర్శనం కోసం బయలుదేరాము. . అక్కడకు వెళ్లాలనుకున్నది మొదలు,  తిరిగి ఇంటికి వచ్చేవరకూ ఎంతోమంది సహకరించారు.. అదంతా భగవత్కృపగా భావిస్తూ ఆ ఆనందానుభూతులను మీతో పంచుకోవాలని ఇలా వ్రాస్తున్నాను.


****       ******    ***********        **************         **************             **************

(గురువయ్యూర్ చేరడం.. సెటిల్ అవడం..)




“సాంద్రానం దావబోధాత్మక మనుపమితం కాల దేశావధిభ్యాం
నిర్ముక్తం నిత్య ముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానమ్ ।
అస్పష్టం  దృష్టమాత్రే పునరురు  పురుషార్థాత్మకం బ్రహ్మతత్త్వం
తత్తావద్భాతి సాక్షాత్ గురుపవనపురే హంత భాగ్యం జనానామ్ ॥ “




‘శ్రీ మన్నారాయణీయము’  ప్రవచనము  చెప్తున్నప్పుడు గురువుగారు (బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు) గురువయ్యూర్ గురించి చెప్పారు. తరవాత గురువుగారు  ఒక సందర్భం లో ‘నారాయణీయం’ పారాయణ ఆరోగ్యప్రదమన్నారు.. గురువుగారి సందేశము మనస్సుకు అంటింది. హైదరాబాదు మా  అమ్మాయి దగ్గరకి వెళ్లినప్పుడు, ‘నారాయణీయం’ పారాయణ చేసి సైనిక్  పురిలో ఉన్న గురువాయురప్ప ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకున్నాను. హైదరాబాదు సైనిక్ పురిలో ఆ ఆలయం చాలా బాగుంది. చక్కటి వాతావరణంలో నిర్మలంగా,ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ విష్ణుసహస్రం చదవగలగడం స్వామి కృప. మనస్సులో గురువయ్యూర్ వెళ్లాలనే
తలపు అప్పుడే  అంకురించింది.
మనస్సునిండా గురువయ్యూర్ చూడాలన్న కోరికతో హైదారాబాదు నుండి ఇంటికి - రాజమండ్రి - చేరాను.  
మన ఆర్తి స్వామికి చేరితే చాలు .. ఇంక ఆయనే చూసుకుంటాడు. అదో ధైర్యం.  .. నాకు కిరాణా ఇచ్చే
షావుకారుగారు ఆధ్యాత్మిక చింతన పరిపూర్ణంగా కలవాడు. నా ఆలోచన ఆయనకు చెప్పాను. ఇటువంటి భక్తుల చెవులద్వారానే కదా భగవంతుడు వినేది. వెంటనే ఈ మిత్రుడు స్థానికంగా ఉన్న తన  మిత్రుడు ఒకాయనకు  
ఫోన్ చేసి రప్పించాడు. ఆ వచ్చినాయన కేరళకు చెందినవారు. రాజమండ్రిలో స్థిరపడ్డారు. ఆయన
మరోభగవద్భక్తుడు.

రెండురోజుల్లో, ఆయన నాకు గురువయ్యూర్ క్షేత్ర దర్శనానికి .. ఏ రైలు ఎక్కాలి, ఎక్కడ దిగాలి, వసతి సౌకర్యం, భోజన సదుపాయం. .. అన్నీ వివరిస్తూ ఒక లిస్ట్ ఇచ్చేరు.ఆ కాటేజీల ఫోన్ నెంబర్లతో సహా ఆ లిస్ట్ లో  వ్రాసారు.  పైగా అక్కడ జరిగే సేవలు, చూడవలసిన ప్రదేశాలు అన్నీ వివరించారు. ఆ మరునాటినుంచి నాకు ఫోన్ చేసి రిజర్వేషన్ అయిందా ఎప్పుడు ప్రయాణం అంటూ వెంటబడి మరీ వాకబు చేసేవారు.సరే! నెట్ (కంప్యుటర్) ముందర కూర్చున్నాను. త్రిసూర్ మీదుగా వెళ్లే ఏ ట్రైన్ అయినా ఎక్కి , త్రిసూర్ దిగి అక్కడనుంచి బస్సు..  నలభై నిముషాల దూరంలో గురువయ్యూర్. డైరెక్ట్ ట్రైయిన్ లో టికట్టు దొరకలేదు. అంచేత  రాజమండ్రి నుండి మద్రాసు అక్కడనుండి త్రిసూర్. రైలు రిజర్వేషన్ చేయించాను.సరిగా మేం  బయల్దేరే రోజు…  కాంగ్రెసు పార్టీ తెలంగాణ కు తాము  అనుకూలమంది. అది మనకు ప్రతికూలం అయింది. కోస్తాలో అంతా  స్వచ్చందంగా బంద్ లు మొదలెట్టారని టి.వి.లో వార్తలు. మా  పిల్లలు రిస్క్ తీసుకోవద్దని మాకు ఫోనులు. స్టేషన్ దాకా వెళ్లడానికి  ఆటోలు ఉంటాయో వుండవో .. టెన్షన్. స్థానికంగా ఉన్న జర్నలిస్ట్ ఒకాయన మా బంధువు. అతనికైతే తెలుస్తుంది కదా అని  ఫోన్ చేసా.. మద్రాసు వైపు వెళ్లే రైళ్లకు రిస్క్ లేదు అని భరోసా ఇవ్వడమే కాకుండా,  తన కారులో స్టేషన్ కు తీసుకు వచ్చికంపార్ట్ మెంటు  లోపల లగేజి అదీ సర్ది .. టాటా చెప్పాడు.

మద్రాసులో ఉన్న మా మిత్రుడొకాయన ఎందుకో నాకు ఫోన్ చేస్తే మద్రాసువస్తున్నా అని మాటల్లో అన్నా.. అలా చెప్పగానే ఆనందంతో  తన ఇంటికి రమ్మని గట్టిగా చెప్పాడు. మద్రాసులో ఉదయం దిగ్గానే వాళ్లింటికి  వెళ్తే
భార్యా భర్తలు చక్కటి ఆతిథ్యం ఇచ్చారు.ఆ సాయంత్రము మద్రాస్-అల్లెప్పీ ఎక్స్ ప్రెస్  లో  త్రిసూర్ బయల్దేరాం.  ట్రైనులోకి డిన్నర్ ప్యాక్ కూడా  ఇచ్చారు.. మా ఇద్దరికీ అప్పర్ బెర్త్ లు. వయస్సు రీత్యా ఎక్కడం కొంచం కష్టమే మరి.. ఎదురుగా ఉన్నవాళ్లనడుగుదామంటే మన ఇంగ్లీషు వాళ్లకి అర్థం కాదు, వారి భాష మనకి అసలర్ఠం కావటం లేదు.
మా సమస్యను అర్థంచేసుకున్నారు లావుంది, ఎవరితో ఏంచెప్పారోతెలియదు కాని, మాకిద్దరికీ లోయర్ బర్త్ లొచ్చాయి.

కేరళ రాష్ట్రంలో ఉన్న గురువయ్యూర్,ట్రివేండ్రం వంటివి  ఇదివరలో చూసాం.. కాని గోడ ముట్టుకున్నట్టే.
యాత్రాస్పెషల్స్ వారితో  రావడం .. వాడు చూపినవి చూడ్డం .. పరుగెత్తడం.. అలాగన్నమాట… …
సరే .. ట్రైన్..  త్రిసూర్ చేరడానికి ఇంకా టైముంది… అప్పుడప్పుడే  తెల్లారుతోంది.  కంపార్ట్ మెంట్ తలుపు
దగ్గరనుంచుని, ఆ ప్రభాత వేళ, చిరుగాలులు శరీరాన్ని తాకుతుంటే, ఇటూ అటూ ఉన్న పచ్చటి ప్రకృతిని చూడడం 
ఓ మధురానుభూతి. పశ్చిమ దిశాధిపతి అనుగ్రహించిన వర్షపుజల్లులతో తడిసిన చెట్లూ,చేమలూ ఉదయ కాంతులతో మెరిసిపోతుంటే చూడ్డానికి రెండు కళ్లూ  చాలవనిపించింది. ప్రతి ఇల్లూ చెట్ల మధ్యనే కట్టుకున్నారు. ఎక్కడచూసినా చక్కటి పచ్చదనం.  చెట్లు పెంచారు…అందుకని వర్షాలు కురుస్తున్నాయి, వర్షాలు కురుస్తాయి  అందుకని చెట్లు పెరుగుతాయ్.ప్రతి వర్షాకాలంలోను మనదేశంలో మొట్టమొదటిగా అక్కడ ప్రకృతి, వరుణదేవునికి  ముందు స్వాగతం పలుకుతుంది. కేరళరాష్ట్రాన్ని నైఋతి ఋతుపవనాలు.. తాకితేనే కదా మనకు వర్షాలొచ్చేది.  నేను చూసిన ప్రాంతంలో ఇంకా అపార్ట్మెంట్ కల్చర్ అంతగా వచ్చినట్టు లేదు. ప్రతి ఇంటికీ డాబా/టెర్రేస్ పై  రేకులు/బంగాళా పెంకులు ఉపయోగించి ఇంగ్లీష్ అక్షరం ‘A’ షేప్ లో పందిరిలా వేసారు .. దానివలన మూడు ఉపయోగాలు… 1.వర్షపు నీరు జారిపోతుంది, డాబా లీక్ అనే సమస్య రాదు. 2. దానిక్రింద చిన్న వర్షాలకు భయపడకుండా కార్యక్రమాలు చేసుకోవచ్చు. 3. వేసవిలో పై గదులు కూడా చల్లగా ఉంటాయి. ఇలా చేయడంవలన మనకున్న బాధలు వీళ్లకుండవేమో అనిపించింది.

సుఖంగా త్రిసూర్ చేరాము.. లగేజ్ ఎక్కువ.. రాత్రి ప్రయాణములో పరిచయమైన జంట, మా సామానులు ప్లాట్ ఫాం మీద దింపి, మాకు వీడ్కోలు చెప్పి వారి ప్రయాణాన్ని కొనసాగించారు. ఆయన పేరు మాథ్యూస్, ఆమె మరియమ్మ.

పోర్టర్ సాయంతో లగేజ్ బయటికి తెచ్చి,  గురువయ్యూర్ కు టాక్సీ అడిగితే- ఎక్కువ అడుగుతున్నాడేమో  
అనిపించింది.  తటపటాయిస్తుంటే, ఒక అమ్మాయి కనపడింది. ఆమెను పలకరించా.. ఆమె కూడా గురువయ్యూర్ వెళ్తున్నానంది. టాక్సీ షేర్ చేసుకుందామా అంటే సంతోషంగా ఒప్పుకుంది. అలా షేర్…  టాక్సీ వాడు ఒప్పుకోనన్నాడు. 
వెంటనే ఆ అమ్మాయి, తనతో వస్తున్న అమ్మగారిని లగేజీని మా దగ్గరపెట్టి, బయటకు పోయి ఒక టాక్సీ తెచ్చింది ..
దారి పొడుగుతా కబుర్లు చెప్తూ చాలా స్వల్ప కాలంలో ఆత్మీయంగా అయిపోయింది.. మేము ఏమేమి చూద్దామనుకుంటున్నామో అడిగింది. “చాముండేశ్వరి దేవి “ ఆలయం చాలా మహిమగలదని, అది కూడా
చూడమంది. తానొచ్చి తీసుకెళ్లి అన్నీ చూపిస్తానంది. గురువయ్యూర్ చేరగానే, ముందు ‘కౌస్తుభం’ కు వచ్చి,
మమ్మల్ని దింపి రెసెప్షన్ వాళ్లు తనకు తెలుసని చెప్పింది. వాళ్లతో వీరు నా స్నేహితులు,చాలా  జాగ్రత్తగా
చూసుకోమని చెప్పి అప్పుడు వెళ్లింది. తను చెన్నై లో సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్నది. తన వాళ్లతో
తమ పండుగ - రంజాన్ -  జరుపుకోవాలని అమ్మా నాన్నల దగ్గరకి వచ్చింది.

‘గురువాయుర్ దేవస్వాం’ వారి నిర్వహణలో ‘కౌస్తుభం’, ‘పాంచజన్యం’ కాటేజీలు. నేను ‘కౌస్తుభం’  లో బుక్ చేసుకున్నాను. వారం రోజులకు ముందుగానే సొమ్ము పంపించేసాను. చక్కటి రూమ్, డబుల్ బెడ్, గీజర్, సదుపాయాలతో నీట్ గా ఉంది. ఎలక్ట్రికల్ స్టౌ, గ్రైండ్ చేసిన కందిపప్పు, (తొందరగా ఉడుకుతుందని),  పెసర పప్పు,  
ఇన్ స్టాంట్ కాఫీ, వేయించిన పోపు, ఒకటి రెండు పచ్చళ్లు పట్టుకుపోయాం.  పాలు కూరగాయలు కొనుక్కునే వాళ్లం. గిన్నెలో పాలు కాచి కాఫీ తాగేసాక, ఆ గిన్నె కడిగేయడం రైస్, ఆ అన్నం ఇంకోగిన్నెలోకి తీసి, కూర ఉడక పెట్టి పోపు జల్లడం, … పప్పు, పులుసు, రసం అన్నీ చేసేసిదావిడ. తమాషా ఆ వారం రోజులూ మేము నూనె అస్సలు వాడలేదు.. అయినా చక్కగా తిన్నాము. ఏదైనా అలవాటును బట్టే కదా..


                                                                                                                          (to be continued.)





Monday, September 9, 2013

వినాయక చవితి







  
మిత్రులందరికీ
గణేష్ చతుర్థి శుభాకాంక్షలు.