Pages

Saturday, October 30, 2010

పెసరట్టు పై కందట్టు


పెసరట్టు పై కందట్టు
పన్నాల భట్టుగారూ
ఎన్నాళ్ళకు పెట్టినారు ఈ మీ స్పెషరట్
తిన్నట్టి ముళ్ళపూడి-క
తిన్న-ట్టును మరచిపోడు ఎన్నేళ్ళయినా.
ఇందులో పన్నాల భట్టుగారెవరు?
శ్రీ పన్నాల సుబ్రహ్మణ్య భట్టు, నేనూ కళాశాల చదువులనుంచి స్నేహితులము.
శ్రీ భట్టు--ఆకాశవాణి, విజయవాడ కేంద్రంలో వుద్యోగించి...ప్రస్తుతము
విశ్రాంతజీవనం... కనకదుర్గమ్మ క్షేత్రంలో గడుపుతున్నారు. ఎప్పుడూ
నవ్వుతూ మాట్లాడే ఆయన సంభాషణలలో హాస్యం తొణికిసలాడుతూ
వుంటుంది. అందుకే భట్టు అంటే నా కిష్టం. 1974 ప్రాంతంలో ఆకాశవాణి
విజయవాడ కేంద్రంనుండి రేడియో కార్ట్యూన్స్...చెళుకులు అని ఓ కార్యక్రమం
వచ్చేది. హాస్యం, వ్యంగ్యం జోడించి వచ్చే ఈ చిట్టి చిట్టి శ్రవ్య రూపకాలు
శ్రోతజనరంజకంగావుండేవి. ఆ శ్రవ్యరూపక రచయితలలో శ్రీ భట్టు ఒకరు.
వీరి ఆ రచనలను కొన్నింటిని ఏప్రిల్, 1975లో నవోదయ పబ్లిషర్స్,
విజయవాడ వారు పుస్తకరూపంలో తీసుకువచ్చారు. 'భలే చౌక టోకు
బేరము' అంటూ మంచి ముఖచిత్రం....బాపూ గారి గీత. అదిగో ఆ పుస్తకము
లోనిదే ఈ క్రింద కనపడే 'చౌకరాజ్యం'....ఇది వ్రాసింది భట్టు...వుంటుంది విట్టు...
నిజం ఒట్టు.
సరే పై పజ్జెం యేమిటట స్పెషరట్టూ కందట్టూ అంటూ?
ముళ్ళపూడి వారి కోతికొమ్మచ్చి మీరు ఆడే వుంటారు......అదేనండీ..
చదివే వుంటారు....అందులో తరచు కనపడిన భట్టుగారునున్నూ...
నేను ఇప్పటిదాకా మీ దివ్యచిత్తమునకు నివేదించుకున్న
భట్టుగారునున్నూ ఒకటే. ఆ సదరు శ్రీభట్టుగారు శ్రీముళ్ళపూడివారికి -
శ్రీ పెసరట్టును స్వయంగా, యే మాయింటివంట
కార్యక్రమములు చూడకుండా చేసి, వేసి, పెట్టి ఆనందింపజేసారు. తిన్న
రమణగార్కి ... చిన్న 'కంద'ట్టు తన్నుకొచ్చింది. అదే బ్లాగు మొదట
గ్లామరుగా పెట్టినది....భట్టుగారి అట్టు తిని (శ్రీ రమణ)పలికిన మరో ఆటవెలది:::
పొట్టు పప్పు రుబ్బి మిర్చి గిర్చీ చేర్చి
భక్తి శ్రద్ధ కలిపి పోయునట్టి
భట్టుగారి అట్టు బహుగొప్ప హిట్టురా
విశ్వదాభిరామ వినుమ రమణ
శ్రీ రమణ వ్రాసిన ఆ కందట్టుకి బాపూగారు బొమ్మగీసారు
ఆ బాపుగారి అందం మీద రమణగారి కందం..లామినేషన్
చేయబడిన చందం...భట్టుగారింట అలంకరింపబడింది.
ఇక చౌకరాజ్యం...కానీ
మళ్ళీ కానీ అర్థణా అంటూ ఆ నసుగుడేమిటండీ?
ఇంత రచనకు కారకుడిగా, ఈ బ్లాగు
ఓనరుగా, నా కోటాలో ఓ చిన్న.......చెప్పను....చూడండి.
పెనం మీద 'పెసరట్టు'
రమణ 'పూరి'oచిన కందట్టు
వేసిన బొమ్మ బాపూ'గారి'కేతట్టు
ఇదంతా ఎక్కడ.... భట్టుగారి వీట్టు
ఏ'దోస'రదాకి నే పట్టిన ఓ పట్టు


వీట్టు అంటే ఇల్లు....అరవం...తెలుసుకదా
అరవం.....అంటే...భాష...మళ్ళీ తెలుసుకదా.


టట్టటాం.....చౌక రాజ్యం....భట్టు స్కిట్టు.
(దేశకాలపరిస్థితులను దృష్టిలో వుంచుకొని విజ్యులైజ్ చేయండి.)


వెంకట్రావు :: అబ్బాయ్! అన్ని రాజ్యాలు చిన్న..పెద్ద ఏకమవుతే
కాని మన దరిద్రం తీరదురా..
శంకరం:: రోడ్డుమీద ఎందుకు బాబూ! ఈ కబుర్లు ? పాతిక
సంవత్సరాలు ఐక్యరాజ్యసమితిలో పనిచేసావు.
ధరల నిలకడ సంఘం నిపుణిగా వున్నవు. ఒక్క
పని చేయగలిగావా? చౌకరాజ్యం తేవడమే
ధ్యేయమన్నావు కుదిరిందా?
వెంక:: ప్రచ్ఛన్నయుద్ధంవచ్చి మా పథకాలని పాడు చేసిందిరా శంకరం...

అయినా వుప్పు ధరని అదుపులో పెట్టింది
మేము. గాలిని అమ్మే ప్రయత్నాలను వమ్ము చేసింది
మేము.
శంక:: ఊఁ..ప్రస్తుతం ధరలని అరికట్టలేం...ఎందుకు వచ్చిందిలే
బాబూ...ఇదంతానూ?
వెంక:: ఆఁ అలా అనకు శంకరం! పెద్దా చిన్నా దేశాలు కలిస్తే
ధరలు పడిపోతాయి. కట్ట చుట్టలు పైసా...వంద పెసరట్లు
రెండు పైసలు. నా కళ్ళలో చూడు నువ్వు..
శంక:: విదేశీ సుందరులు కనపడతాయా...వెంకట్రావుబావా?
వెం:: మహా సంక్షేమరాజ్యం కనబడుతుంది. కారు చౌకరాజ్యం
కనబడుతుంది. నేను కలలుకన్న రాజ్యం. అతిచౌకరాజ్యం
కనబడుతుంది చూడు. చూడు నా కళ్ళతో చూడు.
(చూస్తున్నట్లు దృశ్యం.)
దండోరా::: రండిసార్ రండి కొనండి. మంచి దుస్తులు సార్ !
మంచి మంచి వస్త్రాలు సార్ ! మీటరు క్లాతు రెండు పైసలు.
ఓన్లీ టు పైసే. ఫారిన్ నైలక్స్ చీర అర్థరూపాయి. పిల్లల
డ్రాయర్లు వంద మూడు పైసలు. పది జేబురుమాళ్ళూ ఒక్క
పావలా సార్ ! ట్వినుఫూల్సు వెడ్డింగు సూటింగ్ మీటరు
పదిపైసలు సార్ ! ఓన్లీ పదిపైసలు సార్ ! బెనారస్ పట్టుచీర
ఒకేఒక్క రూపాయి.....ఇంకా ఆరణి పావలా...ధర్మవరమ్ దస్
పైసా......అమ్మా ! రండి ... అయ్యా ! రండి. కారు చౌక ... కారు
చౌక........
(కారు స్పీడు తగ్గి ఆగుతుంది)
శంకరం: ఒరేయ్ అచ్యుతం..ఆరు రూపాయలు తగలేసి ఈ పెయ్యమూతి
చిన్నకారు కొనేకంటే పదిరూపాయలు తగలేసి పందిమూతి
కారు కొంటే బాగుంటుందికదరా.?
అచ్యుతం:: ఇంకా ధరలు తగ్గుతాయిరా....ఆ పెద్దకారు మూడురూపాయలకే
వస్తుందట. అదిసరేకాని ముందు ఈ రెండుపైసలు పెట్టి రెండు
బాల్కనీ టిక్కట్లు కొను.
ప్యూన్:: సార్! బియ్యం నాలుగు బస్తాలు ఇంటిదగ్గర వేయించాను సార్!
నాలుగు రూపాయలు అయింది. అర్థరూపాయి పెట్టి బస్తా పంచదార
కొన్నానండి. అయిదు పైసలు పెట్టి ఇరవై కేజీల కాఫీగుండ
కొన్నానండి. పదిపైసలు పెట్టి వెయ్యి బత్తాయిలు కొన్నాను సార్!
అచ్యుతం:: మిగిలిన ఇరవై పైసలు బ్యాంకులో వెయ్యి. నువ్వు పో....
ఆనందం:: హల్లో అచ్యుతం..ఇల్లు కొన్నావటగా? ఎంతయింది.
అచ్యుతం:: అవును ఆనందం...గవర్నర్ పేటలో ఒక మేడ కొన్నాను. వంద
రూపాయలు. రెండువేల గజాల స్థలం. మేము వుండగా రెండు
రూపాయలు వస్తుందనుకో.
ఆనందం:: అబ్బా..అంత పెద్దదా?
అచ్యుతం:: ఆఁ సరేకాని మీ అమ్మాయి పెళ్ళి
కుదిరిందటగా. ఎంత కట్నం?
ఆనందం:: అవును బ్రదర్..కుర్రాడు డాక్టరు.పది రూపాయలు కట్నం.
ఆఁ కొంచెం యెక్కువే అనుకో. పై ఖర్చులు మరో అయిదు
రూపాయలు వేసుకొంటే నీ ధర్మమా అని గట్టెక్కి పోతము.
అచ్యుతం:: మంచివాడవే..ఆఁ అవునుకానీ...ఈ బొమ్మ యెలా వుందంటావు.
ఆనందం:: పిక్చర్ కలర్ లో తీసారు. అంతా కలిపి రెండు వేలయిందట.
బంపర్ కలక్షన్. రోజుకి పద్దెనిమిది రూపాయలు. హౌస్ ఫుల్.ఆఁ..
(కల అయిపోయిన ధ్వనులు)
వెంక:: నాలోకం అంత కారు చౌకగా వుంటుంది. ఆఁ ఎండ ఎక్కువగా
వుంది గొంతు తడారిపోయింది. కాస్త బత్తాయి రసం త్రాగుదాం.
ఆ కొట్టుకు పద...
శంక:: పదమరి....
వెంక:: రెండుగ్లాసులు బత్తాయి రసం ఇయ్యి నాయనా!
కొట్టువాడు: మూడురూపాయలు సార్ !
శం:: అదేమిటయ్యా?
కొ.వా:: బత్తాయిలు దొరకటంలేదండీ
వెంక:: అయితే రెండు కూల్ డ్రింకులీయి పోనీ..
కొ.వా:: అయిదు రూపాయలు సార్
శం:: ఏమిటయ్యా
వెంక:: పోనీ గ్లాసెడు మంచినీళ్ళియ్యి.
కొ.వా. దొరకవండి...పొరుగువారికి ఎగుమతి చేయాలని
వాడకం ఆపేసారండి.
-----ooooOOOoooo-----
నీతి: {నాకు తోచినది:} నిన్న అయినా, నేడయినా, రేపు అయినా;
అక్కడయినా, ఇక్కడయినా, మరెక్కడయినా
అప్పుడయినా, ఇప్పుడయినా, మరెప్పుడయినా
మనందరికీ ధరలు ప్రి య ము.
------

Tuesday, October 26, 2010

అంతటా వున్న చైతన్యస్వరూపం


ప్రభాతసమయం....శారదరాత్రినాటి వెన్నెలకాంతులు...అరుణోదయపు పసిడి వెలుగులో మమేకమౌతున్నాయి. నిర్మలమైన ఆకాశం....బాలభానుని లేలేత బంగరు కిరణాలు నులివెచ్చగా శరీరాలను తాకుతున్నాయి. అప్పుడప్పుడే ప్రకృతి వళ్ళు విరుచుకుంటోంది. పక్షుల కిలకిలారావాలు వింత వింత సంగీత స్వరాలు పలికిస్తున్నాయి.లేత నీలపురంగు ఆకాశంలో వుదయపుటెండ ప్రతిఫలిస్తోంది... ఏ చిత్రకారుడూవేయలేని కొంగ్రొత్త రంగుల కలయికతో ఆకాశపు కాన్వాస్ పై ప్రయోగాలు జరిగిపోతున్నాయి. నిత్యనూతనత్వంతో ప్రకృతి పులకరించి పోతోంది.మనసు ఆనంద పరవశమౌతుంటే...యేవేవో ఆలోచనలు...యేవేవో ఙ్ఞాపకాలు..యెక్కడో చదివినవి, యేమహనీయుని నోటనో విన్నవి.....

అయోధ్యా నగరం....రాజప్రాసాదం....శ్రీ రామచంద్రుని శయన మందిరం....సీతాపతీ, రఘుకులదీపకుడూ, అరవిందదళాయతాక్షుడూ, అప్రమేయుడూ, ఆజానబాహుడూఅయిన శ్రీరామచంద్రుడు హంసతూలికా తల్పంపై శయనిస్తున్నాడు. తటాలునమేల్కాంచి...తల్పం మీదనుండి దిగి బయల్దేరాడు. సీతమ్మకు చెప్పక...కోదండాన్నీ గైకొనక,పరివారమూలేక,,,హనుమనూ గమనింపక, అలా వున్నవాడు వున్నట్టు బయల్దేరాడు.
మునివాటిక....ఆశ్రమవాతావరణం....లేళ్ళూ, నెమళ్ళూ మగతలో వున్నాయి....గోశాలల్లోఆవులు నెమరు వేస్తున్నాయి...పచ్చటి చెట్లు వెచ్చగా నిద్రిస్తున్నాయి....రంగవల్లులతో శోభిస్తూ...వేదనాదాల శబ్దతరంగాలతో పవిత్రమైన ఒక అందమైన పర్ణశాల ముంగిట రఘురాముడు నిలబడి తలుపుకొట్టాడు..."ఎవరది?" లోనుండి కులగురువు వశిష్ఠులు ప్రశ్నించారు"నేను""అంటే?""అది తెలియకనే స్వామీ..కంగారుగా మీ దగ్గరకు వచ్చాను."అని దశరథనందనుడు వినయంగా సమాధానమిచ్చాడు..సమాధానందొరకని మనస్సును వూరడిస్తూ....
మానవదేహం దాల్చిన కారణాన శ్రీరాములంతటివారికి 'నే' నంటే సమాధానందొరకలేదు. ఇక మనమెంత ?రోజూ చూసుకునే మామూలు అద్దం...దానిముందు కొంచెం సమయం వెచ్చిస్తే క్రొత్త పాఠాలు చెప్తుంది.నిదానంగా శ్రద్ధగా మనముఖం అలా చూస్తూవుంటే... కాసేపటికి ఈ కనబడే అందం పోతుంది. ఆలోచన ప్రారంభమవుతుంది.కనబడ్తున్న ఆ వ్యక్తి యెవరు? ఎక్కడనుంచి వచ్చాడు? ఎక్కడికి పోతాడు ? రాక యేమిటి, పోక యేమిటి ? అన్నీ ప్రశ్నలే,అంతా అయోమయమే. సమాధానంనాకైతే దొరకదు....యేదో తెలియని తనం....మీ స్థాయి బహుశా వేరేమో...

ఈ సృష్టిలో వున్నా అనేకానేక సౌరమండలాలలో యీ కనిపించే సూర్యకుటుంబం...ఒకటిట...అందులో యీ భూగోళం...అందులో మనమనుకునే ప్రపంచం....అందులోఆసియా ఖండం...భారతదేశం....మేరోర్దక్షిణ దిగ్భాగం....ఆంధ్రప్రదేశ్...జిల్లా....వూరు....పేట....ఇల్లు.....గది....అందులో సుమారు ఆరుఅడుగుల పొడుగున్న 'నేను' అనబడేఒక శాల్తీ.....ఆలోచిస్తే, ఈ అనంత సృష్టితో పోలిస్తే యీ ఆరడుగుల శాల్తీ వునికి యెంత?అంచేత ఈ సృష్టిలో యేమీకాని 'నువ్వు' అంటే 'నేను'...నాకు తెలియనిది యేదీలేనట్టుఓ ప్రగల్భాలు...అంటే ముందు నిన్ను నీవు...అదే నన్ను నేను తెలుసుకోవాలి.అయితే ఈ సృష్టిని నడుపుతున్న యేదో అగోచరశక్తి ..యేమిటది...అదే పరమాత్మఅంటోంది వేదం...ఆ పరమాత్మ చైతన్యమే ...స్థావరజంగమాత్మకమైన ఈ జగత్తంతానిండివుంది....
దానికోసం యెక్కడ వెతకాలి? ఏ గుడికి వెళ్ళాలి...ఏ స్వామిజీని కొలవాలి..అక్కరలేదు....
तेरे साई तुझ मे जो पुहुपन मे भास
कस्तूरी मृग जॊ है फिर फिर ढूँढॆ घास
పుష్పంలో పరిమళంలా---వికసనంలా, నీ దేముడు నీలోనే వున్నడు. కస్తూరి మృగం తనలోంచి వస్తున్నపరిమళం యెక్కడనుండి వస్తుందో తెలియక వనమంతా వెదుకుతుందట. అలాగవుంది మనపరిస్థితి.
ఎక్కడ చూసినా...ఎక్కడ భావించినా భగవంతుని తత్త్వం మనకు గోచరిస్తూనేవుంటుంది.రంగు రంగుల హరివిల్లు, జలజల పారే సెలయేరు, పచ్చటి పైరులు, దృఢమైన పర్వతాలు, నిండు గంభీర అనంత సాగరాలు, అంచనాకు అందని అనంత ఆకాశం.అమృతజలాలు వర్షించే మేఘాలు...పంచభూతాత్మకమైన ప్రకృతినిండా ఆ'మహత్' తత్త్వమే...ఆ మూల తత్త్వాన్ని భావించు...ఆ సర్వాంతర్యామిని ధ్యానించు.ఎక్కడ నుంచి..
నువ్వున్నచోటునుంచే...సంసారాలు వదలక్కరలేదు...కాషాయాలుకట్టక్కరలేదు...యెక్కడికో పోనక్కరలేదు....బురదలోవున్నా కమలానికి బురద అంటదు. సంసారంలో వుంటూ రాగద్వేషాలకు చలించకుండా..చిత్తం భగవంతునియందే వుంచి...చేసే ప్రతికర్మనూ భగవదర్పితంచేస్తూకర్మచేయువాడు తనను చేరుతాడని గీతాకారుని వచనం.
భగవంతుడెక్కడున్నాడు ? వైకుంఠములోనా....మునీశ్వరుల చెంతనా...కాదట.
భక్తితో యెక్కడ తనని గానం చేస్తారో అక్కడే తాను బసచేస్తాడట...గానానికి భక్తే ప్రధానం. అయ్యో! నాకు సంగీతం రాదే అనే బాధే వద్దు. హృదయంలోవున్న పరమాత్మను మనసారా కీర్తిద్దాము...
అన్ని 'నేను' లకు 'నేను' అయిన ఆ మహా 'నేను'లోకలసిపోదాం.

ఆత్మా - పరమాత్రం

ప్రభాతసమయం....శారదరాత్రినాటి వెన్నెలకాంతులు...అరుణోదయపు పసిడి వెలుగులో మమేకమౌతున్నాయి. నిర్మలమైన ఆకాశం....బాలభానుని లేలేత బంగరు కిరణాలు నులివెచ్చగా శరీరాలను తాకుతున్నాయి. అప్పుడప్పుడే ప్రకృతి వళ్ళు విరుచుకుంటోంది. పక్షుల కిలకిలారావాలు వింత వింత సంగీత స్వరాలు పలికిస్తున్నాయి.లేత నీలపురంగు ఆకాశంలో వుదయపుటెండ ప్రతిఫలిస్తోంది... ఏ చిత్రకారుడూవేయలేని కొంగ్రొత్త రంగుల కలయికతో ఆకాశపు కాన్వాస్ పై ప్రయోగాలు జరిగిపోతున్నాయి. నిత్యనూతనత్వంతో ప్రకృతి పులకరించి పోతోంది.మనసు ఆనంద పరవశమవుతుంటే ...యేవేవో ఆలోచనలు...యేవేవో ఙ్ఞాపకాలు..యెక్కడో చదివినవి, యేమహనీయుని నోటనో విన్నవి.....
అయోధ్యా నగరం....రాజప్రాసాదం....శ్రీ రామచంద్రుని శయన మందిరం....సీతాపతీ, రఘుకులదీపకుడూ, అరవిందదళాయతాక్షుడూ, అప్రమేయుడూ, ఆజానబాహుడూఅయిన శ్రీరామచంద్రుడు హంసతూలికా తల్పంపై శయనిస్తున్నాడు. తటాలునమేల్కాంచి...తల్పం మీదనుండి దిగి బయల్దేరాడు. సీతమ్మకు చెప్పక ...కోదండాన్నీ గైకొనక,పరివారమూలేక,,,హనుమనూ గమనింపక, అలా వున్నవాడు వున్నట్టు బయల్దేరాడు.



***మునివాటిక....ఆశ్రమవాతావరణం....లేళ్ళూ, నెమళ్ళూ మగతలో వున్నాయి....గోశాలల్లోఆవులు నెమరు వేస్తున్నాయి...పచ్చటి చెట్లు వెచ్చగా నిద్రిస్తున్నాయి....రంగవల్లులతో శోభిస్తూ...వేదనాదాల శబ్దతరంగాలతో పవిత్రమైన ఒక అందమైన పర్ణశాల ముంగిట రఘురాముడు నిలబడి తలుపుకొట్టాడు..."ఎవరది?" లోనుండి కులగురువు వశిష్ఠులు ప్రశ్నించారు"నేను""అంటే?""అది తెలియకనే స్వామీ..కంగారుగా మీ దగ్గరకు వచ్చాను."అని దశరథనందనుడు వినయంగా సమాధానమిచ్చాడు..సమాధానందొరకని మనస్సును వూరడిస్తూ....****** ************ ************** ************ ********** ************ ******** మానవదేహం దాల్చిన కారణాన శ్రీరాములంతటివారికి 'నే' నంటే సమాధానందొరకలేదు. ఇక మనమెంత ?రోజూ చూసుకునే మామూలు అద్దం...దానిముందు కొంచెం సమయం వెచ్చిస్తే క్రొత్త పాఠాలు చెప్తుంది.నిదానంగా శ్రద్ధగా మనముఖం అలా చూస్తూవుంటే... కాసేపటికి ఈ కనబడే అందం పోతుంది. ఆలోచన ప్రారంభమవుతుంది.కనబడ్తున్న ఆ వ్యక్తి యెవరు? ఎక్కడనుంచి వచ్చాడు? ఎక్కడికి పోతాడు ? రాక యేమిటి, పోక యేమిటి ? అన్నీ ప్రశ్నలే,అంతా అయోమయమే. సమాధానంనాకైతే దొరకదు....యేదో తెలియని తనం....మీ స్థాయి బహుశా వేరేమో...



ఈ సృష్టిలో వున్నా అనేకానేక సౌరమండలాలలో యీ కనిపించే సూర్యకుటుంబం...ఒకటిట...అందులో యీ భూగోళం...అందులో మనమనుకునే ప్రపంచం....అందులోఆసియా ఖండం...భారతదేశం....మేరోర్దక్షిణ దిగ్భాగం....ఆంధ్రప్రదేశ్...జిల్లా....వూరు....పేట....ఇల్లు.....గది....అందులో సుమారు ఆరుఅడుగుల పొడుగున్న 'నేను' అనబడేఒక శాల్తీ.....ఆలోచిస్తే, ఈ అనంత సృష్టితో పోలిస్తే యీ ఆరడుగుల శాల్తీ వునికి యెంత?అంచేత ఈ సృష్టిలో యేమీకాని 'నువ్వు' అంటే 'నేను'...నాకు తెలియనిది యేదీలేనట్టుఓ ప్రగల్భాలు...అంటే ముందు నిన్ను నీవు...అదే నన్ను నేను తెలుసుకోవాలి.అయితే ఈ సృష్టిని నడుపుతున్న యేదో అగోచరశక్తి ..యేమిటది...అదే పరమాత్మఅంటోంది వేదం...ఆ పరమాత్మ చైతన్యమే ...స్థావరజంగమాత్మకమైన ఈ జగత్తంతానిండివుంది....దానికోసం యెక్కడ వెతకాలి? ఏ గుడికి వెళ్ళాలి...ఏ స్వామిజీని కొలవాలి..అక్కరలేదు....तेरे साई तुझ मे जो पुहुपन मे भासकस्तूरी मृग जॊ है फिर फिर ढूँढॆ घास పుష్పంలో పరిమళంలా---వికసనంలా, నీ దేముడు నీలోనే వున్నడు. కస్తూరి మృగం తనలోంచి వస్తున్నపరిమళం యెక్కడనుండి వస్తుందో తెలియక వనమంతా వెదుకుతుందట. అలాగవుంది మనపరిస్థితి.ఎక్కడ చూసినా...ఎక్కడ భావించినా భగవంతుని తత్త్వం మనకు గోచరిస్తూనేవుంటుంది.రంగు రంగుల హరివిల్లు, జలజల పారే సెలయేరు, పచ్చటి పైరులు, దృఢమైన పర్వతాలు, నిండు గంభీర అనంత సాగరాలు, అంచనాకు అందని అనంత ఆకాశం .అమృతజలాలు వర్షించే మేఘాలు...పంచభూతాత్మకమైన ప్రకృతినిండా ఆ'మహత్' తత్త్వమే...ఆ మూల తత్త్వాన్ని భావించు...ఆ సర్వాంతర్యామిని ధ్యానించు.ఎక్కడ నుంచి..నువ్వున్నచోటునుంచే...సంసారాలు వదలక్కరలేదు. ..కాషాయాలుకట్టక్కరలేదు...యెక్కడికో పోనక్కరలేదు....బురదలోవున్నా కమలానికి బురద అంటదు. సంసారంలో వుంటూ రాగద్వేషాలకు చలించకుండా..చిత్తం భగవంతునియందే వుంచి...చేసే ప్రతికర్మనూ భగవదర్పితంచేస్తూకర్మచేయువాడు తనను చేరుతాడని గీతాకారుని వచనం.భగవంతుడెక్కడున్నాడు ? వైకుంఠములోనా....మునీశ్వరుల చెంతనా...కాదట.భక్తితో యెక్కడ తనని గానం చేస్తారో అక్కడే తాను బసచేస్తాడట...గానానికి భక్తే ప్రధానం. అయ్యో! నాకు సంగీతం రాదే అనే బాధే వద్దు. హృదయంలోవున్న పరమాత్మను మనసారా కీర్తిద్దాము...అన్ని 'నేను' లకు 'నేను' అయిన ఆ మహా 'నేను'లోకలసిపోదాం.

Wednesday, October 20, 2010

                                పొట్టాటోపం
                                                                                       ---డి.వి.హనుమంత రావు

చాలామంది నన్ను బాలూలా వుంటానని అంటూ వుంటారు.
అదేనండీ యస్ పి గారిలాగా అనే. నా మానరిజమ్స్ అలా వుం
టాయని కొందరు మిత్రులు, బంధువులూ కూడా అంటూ
వుంటారు. ఇది తెలియని వారికెవరికైనా యిది చెప్తే అయితే ఓ పాట
పాడమంటారు. ఆ పాడు మాటలేమిటి చెప్పండి. (తప్పట్టుకోకండి.)
అపాటగాడ్ని పాడమనడం, జ్వరబాధితుడ్ని విందుభోజనం
చేయమనడం లాంటివి యిబ్బందికరం కదండీ. బాలూలా
వున్నానని అన్నారంటే బాలూ లావున్నానని అన్నది కూడా వారిభావమై
వుండవచ్చు. చాలా సందర్భాలలో అంటే 'పాడుతా తీయగా' లాంటి
కార్యక్రమాలలో బాలూగారు తనమీద తానేజోక్ చేస్తూ చాలా
చమత్కారంగా మాటలాడుతూవుండడం మనం చూస్తూనే
వున్నాము. ఆయన గొప్పపాటకారే కాదు మాటకారి కూడా.
అంచేత నే చెప్పొచ్చేదేమంటే ఆయన గాత్రం కాదు కాని ఆయన
గాత్రంతో కొంచెం సామ్యం నా పట్లకొందరి పరిశీలన అనికూడా అనుకోవచ్చు.
నా ఈ లావు తీయనిది...తీయలేనిది. 'లావొక్కింతయు లేదు'
అనే పద్యాలు రాగయుక్తంగా పాడే మాట దేవుడెరుగు ..మరే
యుక్తంగానూ పాడేసాహసం చేయను. ఒక విషయం మాత్రం నిఝం.
'అన్యథా శరణం నాస్తి...యస్ పీ గారూ! త్వమేవశరణం మమ'.
నేను కూడా నామీద జోకులు వేసుకుని,అప్పుడప్పుడు కోపం
వస్తున్నా నిగ్రహించుకుని, ఆ యాపరిస్థితులనించి బయట పడే
ప్రయత్నం యథాశక్తి చేస్తున్నాను....కొంచెం వివరిస్తాను, అవధరించండి...

"ఏంటి గురూగారూ పొట్ట అలా పెంచేస్తున్నారు" అని చాలామంది
ప్రశ్నిస్తూ వుంటారు. "పొట్ట యిలాగేకదండీ మరి పెంచాలి" అని నా
సమాధానం. అదేమిటో కడవంత పొట్ట కూసింతవాడిక్కూడా లోకువండి.
ఏంచేస్తాం చెప్పండి...ఒక్కోప్పుడు వేదాంతం చెప్పేస్తా...."అయినా నే పెంచే
దేముందండీ, అదే పెరుగుతుంది పిచ్చిముండ. నేను నిమిత్తమాత్రుణ్ణి"
అంటా. కొన్ని సందర్భాలలో చిన్న సైజు లెక్చరు యిచ్చేస్తూ వుంటా...
మీరూ చదవక తప్పదు. (నా పొట్టమీద సానుభూతితో మరి యింత
దూరం వచ్చిన సహృదయులు మీరు.) -- "బుర్రలు తీసి బుర్రలు పెట్టి
రాజకీయాలలోకి వచ్చి చెలామణీ అవుతూ, అడ్డమైనదారులూ త్రొక్కి
డబ్బుసంపాయించినా; పగలంతా గొడ్డు చాకిరీ చేసి (పోనీ అలా
తృప్తిపడి) సాయంవేళ, అదే స్వర్గమనుకుంటూ మద్యంలో పరవళ్ళు
త్రొక్కినా; కూర్చొని బంతి భోజనాలుచేసినా, నిలబడి బఫే(లో)భోజనాలు
చేసినా..... వీడి జుట్టుముడి వాడికి, వాడి జుట్టు ముడి వీడికి వేసి
మంత్రాంగాలు చేసినా: ఆ మాట కొస్తే ఏ గడ్డి కరచినా, ఏ నడ్డి వంచినా
ఈ పాడు(పాటల 'పాడు' కాదని మనవి)పొట్ట కోసమే కదండీ.
అలాంటప్పుడు నా యీ పొట్టపై మీకేల(మీకంటే మీకని కాదండీ)
అంత అసూయ ఈర్ష్య, జుగుప్స,యెన్వీ, మత్సరం" అని
ఆవేశంగా చెప్పి ఆయాస పడి పడీ, వూగిపోయి పోయి,
నిలబడిపోతాను.

నాలా పొట్టలతో భారపడేవార్ని చూస్తే నాకు బోల్డుపొట్టానుభూతి.
కొందరు పొట్టల స్వంతదారులు నా ముహం చూసో, నా పొట్ట
చూసో (అనుమానంగా యెందుకు చెప్తున్నానంటే, వారు ఏమీ
తెలియని అమాయకత్వం ముఖానికి పులుముకునివుంటారు
అన్నమాట)... 'ఏమిటోనండీ, ఈ మధ్య లావెక్కిపోతున్నాను.
చాలామంది పొట్ట పెంచేస్తున్నావ్ అంటున్నారు.' అంటారు.
అలాంటివార్ని 'నా ప్రక్కన నిలబడండి,యిప్పుడు చూడండి,
కావాలంటే ఫోటోలు తీయించుకోండి.' అనిఆహ్వానిస్తాను.
ఇలా చేయడంవలన, నా పొట్ట ముందు వారి పొట్ట చిన్నది అని
తాత్కాలికంగానైనా ఆనందం కలుగుతుంది.ఫలితంగా యింకొంచెం
ఆస్తి అదేనండి పొట్ట పెంచుకునే ధైర్యం తెచ్చుకుంటారు.

పొట్టలలో కూడా కొన్ని అంతర్ముఖాలు, కొన్ని బహిర్ముఖాలు. మొదటి
రకం యెంతతిన్నా కనపడవు. అదే రెండోరకమైతే కొంచెం తింటేనే
ఆయాసమూ ఆకారమూ రెండూ పెరుగుతాయి. ఓ యింత
తినేసాడేమో అనిచూసేవారికి అపోహకూడా కలగవచ్చు....
పోనీ తినేసాక ఓ మూల నిశ్శబ్దంగా కూర్చుంటారా అంటే...సంగీతఙ్ఞానం
ఒకటి వీరికి.....సరళీస్వరమో జంట స్వరమో(యిద్దరూ or plus
ఒకచోట చేరితే) వారి వారి స్థాయిలబట్టి స్థాయీబేధాలతో
సహా నిద్రాకచ్చేరీతో అలవోకగా విందు చేసేస్తారు. సంగీతానికి
గురకకూ పోలికేమిటనకండి...కావాలంటే యిద్దర్ని కాని యెక్కువకాని
గురకవిద్వాంసుల్ని ఓ గదిలో పరుండబెట్టి అప్పుడు వినండి....
వారి వారి గురకల్లో ఓ క్రమం, ఓ లయ,ఓ రిథమ్...అనుమానముంటే
ప్రయోగించండి.

పొట్టలవల్ల అన్నీ కష్థాలేనా...కాదు, కొన్ని వుపయోగాలు
కూడా వున్నాయి. జంతికలో చేగోడీలో పళ్ళెంలో పెట్టుకుని,
ఆ పళ్ళెం పొట్టమీద పెట్టుకుని, ఓ పడక్కుర్చీలో పవ్వళించి,
యెక్కువదూరం ప్రయాణశ్రమ లేకుండా వంగకుండా యిట్టే అలా నోటిలో
వేసుకోవచ్చు.... ఆ పళ్ళెం తీసేసి... యింట్లో పేచీ పెడ్తున్న
మనవడ్ని పొట్టమీదపడుకోబెట్టుకుని, ఇన్ నో టైమ్, నిద్రపుచ్చి
అంతఃపురస్త్రీల మెప్పుపడయవచ్చు.(మీరు ఆ సమయంలో
నిద్రలోకి జారుకుంటే...మీ సంగీతకచేరీ పిల్లవానికి నిద్రాభంగం
కలిగితే, ఆ సదరు పిల్లవాడు పాతబకాయిలతో సహా రోదించవచ్చు.
ఫలితంగా మరి.....తస్మాత్ కొంచెం జాగ్రత్త అవసరం). ఏదైనా రష్ గా
వున్నబస్సులో యెక్కి నించోవలసివస్తే మీ పొట్టయిచ్చేకుషన్ యెప్ఫెక్ట్ తో
మీ ముందువాడు స్టాప్ వచ్చినా రిలాక్స్ అవుతూనేవుండవచ్చు.
ఆలోచనలు తట్టాలంటే గోక్కోడానికి మీకు బుర్ర. మాకు బొర్ర(తెలంగాణా).

కొన్ని సంఘటనలు...నేను ఎంజాయ్ చేసినవి...
ఓ సారి ఓ ప్రయాణంలో నేనూ, శ్రీమతీ, మా తోడల్లుడూ, మరదలు
కాకినాడ వెళ్తున్నాము. దారిలో ఓ జంట కలిసారు. వారూ కాకినాడ
వచ్చి పనిచూసుకుని మరల సామర్లకోట వచ్చి వైజాగ్
వెళ్ళాలి. దానికివీలుగా సామర్లకోటలో కారు చేయించుకున్నాము.
భోజనాల టైమ్ కదా ...యింకొకాళ్ళని యేం యిబ్బంది పెట్తామని
కాకినాడలో హోటల్లో భోంచేసి మళ్ళీ కారెక్కాము గమ్యం చేరడానికి.
అప్పుడు నాకు ఆ భగవంతుడెంత కరుణామయుడో అనిపించింది.
అన్నంతిన్నాక పొట్టలు ముందుకే పెరిగే యేర్పాటు చేసాడా
శక్తిమంతుడు....అలా కాకుండా ప్రక్కలకు పెరిగివుంటే కారు
సరిపోకపోనుకదా....ఆ విషయమే కూడావున్నవారికి చెప్తే--
క్రొత్తవారిద్దరికీ నవ్వాపుకోలేక పొలమారింది. ఆవిడైతే
'అన్నయ్యగారూ! యింక జోకులొద్దండి...నవ్వాపుకోవడం
చాలా కష్టమయిపోతోంది.' నవ్వులోకలిపి
మరీఅంది. వారి సెన్సాఫ్ హ్యూమర్ కి హాస్యాంజలి.... ఆ సందర్భాన్ని
మీరూ భావిస్తే యెంజాయ్ చేయగలరని నేను భావిస్తూ మీతో
ప్రస్తావిస్తున్నానిక్కడ.
బొజ్జదేముడు మనందరికీ దేముడు. ఈ మధ్యనే బొజ్జగణపయ్యకు
పూజలు చేసి ఆయన అనుగ్రహం పొందాం కూడా. గతంలో
ఓ వినాయక చవితి ముందరి రోజు నేనూ మా ఆవిడా ఓ మిత్రు
డింటికి వెళ్ళాము. మా ముగ్గురాడపిల్లలకూ పెళ్ళిళ్ళై వారి వారి
అత్తారిళ్ళల్లో వున్నారు. అంచేత యేపండుగయినా మేమిద్దరమే...
ఆ నేపధ్యంలో.... ఆ మిత్రుడికి నలుగురు మగపిల్లలు. పెద్దాడికి
పదేళ్ళుంటాయేమో. అతడు నన్నడిగాడు...
"అంకుల్! వినాయకచవితి సామాన్లు కొన్నారా?"
"కొన్నానయ్యా, కాని బొమ్మ యింకా కొనలేదు."
"ఇంకా కొనలేదా! రేపేకదా వినాయకచవితి? యింకెప్పుడు
కొంటారు?"
"ఫర్వాలేదులే, రేపు కొంటాను"
"రేపైతే బొమ్మలు దొరకవేమో అంకుల్"
అతని కుతూహలంలోని అమాయకత్వానికి నవ్వుకుంటూ
"దొరకవంటావా...సరే యేంచేస్తాం...దొరికితే కొంటాను...లేకపోతే
బనీనువిప్పేసి పూజామందిరంలో నేనే కూర్చుంటాను....."అన్నా
బొజ్జ నిమురుకుంటూ.
ఆ చిరంజీవి యిక నవ్వాడూ....తలచుకు తలచుకు ...నే వూహించిన
దానికన్నా యెక్కువ నవ్వాడు. ఇప్పటికీ గుర్తువచ్చినప్పుడు
నవ్వుకుంటూనే వుంటాడట.. ఇపుడు అతను యస్.సి.రైల్వేలో
టికెట్ కలక్టర్.

Sunday, October 17, 2010

విజయదశమి శుభాకాంక్షలు

...........మన పురాణ గ్రంథాలు, మంత్రశాస్త్రాలు
విశ్వశక్తిని అనేకంగా రూపావిష్కరణ చేసాయి.
వాటిని ఆరాధించే పద్ధతుల్లోనూ మహాశాస్త్రవేత్తలు
మొదలుకొని, సామాన్యులవరకు అన్నివర్గాల
వారికీ, వివిధ బౌద్ధికస్థాయులు కలవారికి తగినట్లుగా
సాంప్రదాయాలు ఏర్పడ్డాయి.

యఙ్ఞయాగ మంత్రదీక్షలేకాక--గ్రామదేవతల పూజలు,
జాతరలు, బతుకమ్మ పండుగలువంటి సత్కర్మలు,
చిందులు, పాటలు, సంబరాలు....ఇవన్నీ ఒకే పరాశక్తిని
ఆరాధించే అనేకమైన అందమైన పరంపరలు.
ఇన్ని వైవిధ్యభరితమైన శక్త్యారాధనా ధారలను సిద్ధం
చేసుకున్న హైందవధర్మంలోని అద్భుతానికి
జో హా రు లు.తేటదనానికి సంకేతమైన శరదృతువు
--- ఆరంభంలో --తేటమనస్సుతో ఆ మహాచైతన్యాన్ని
'అమ్మా' అంటూపిలిచే నవరాత్రి వేడుకలలో
...దేశమంతా పునీతమవుతున్నది.
హిమవత్పర్వతం జ గ దం బ పుట్టినిల్లయితే, మధ్యదేశాన్ని
విం ధ్య వా సి ని కి నెలవుగా, చివరి భాగమైన మలయాళ
ఖండాన్ని మ ల యా చ ల వా సి ని - భగవతికి తావుగా
భావించిన శక్తి సాంప్రదాయం.....ఈ దేశపు ఆది, మధ్య, అంతాలను
జ గ దం బ స్థానాలుగా పూజించడమేకాక, అడుగడునా
"శక్తి పీఠాల"ను ప్రతిష్ఠించుకుంది. ఈ కారణంచేతనే ఈ
దేశాన్ని తలచుకోగానే జగన్మాతృ భావన పొంగుకువచ్చి
'వం దే మా త రం' అని మోకరిల్లుతాం. విశ్వజనీనమైన
వి శ్వ జ న నీ భావానికి వం ద నా లు....
(శ్రీ సామవేదం షణ్ముఖశర్మగారు
'ఈనాడు' అంతర్యామిలో విజయదశమి నాడు వ్రాసిన దానినుండి.)

Thursday, October 14, 2010

పండగ స్పెషల్

దసరా కోసం ఓ స్కిట్టు.

అన్నయ్య యిచ్చిన వంద


లక్ష్మి: ఏమండీ....

రావ్: ఏమిటి లక్ష్మీ...

లక్ష్మి: వరలక్ష్మీ వ్రతానికి కుదరదన్నారు... పోనీ దసరా నాటికైనా....

రావ్: ఏమిటోయ్ ?

లక్ష్మి: అదేనండీ..ఓ కాసు బంగారం...

.రావ్: అమ్మో ! బంగారమా ! --- కాసా.....

లక్ష్మి: పోనీ....ఓ తులం...తులం చాల్లెండి, సర్దుకుంటాను.

రావ్: బాగుందోయ్--బాగుంది. తులమంటే కాసు కన్న యెక్కువ తెలుసా ? యేమిటో ... నీకంతా వేళాకోళంగా వుంది....

లక్ష్మి: (కళ్ళల్లో నీళ్ళు)..పోనీలెండి, నే నేమన్నా మీకలాగే వుంటుంది.

రావ్: నేనేమన్నానోయ్ ?

లక్ష్మి: మొన్నటికి మొన్న, మా అన్నయ్య వచ్చి వెళ్తూ.. "చెల్లీ ! గాజులేయించుకో" అని వంద రూపాయలిచ్చాడు.---యిచ్చాడా? - అది కాస్తా 'బ్యాంకులో వేస్తాను, వడ్డీ వస్తుంది' అని పట్టికెళ్ళారు. పట్టికెళ్ళారుకదా ? పోనీ..చెప్పినట్టు బ్యాంకులో వేసారా ? లేదే..."వచ్చేవి శ్రావణ భాద్రపదాలు..అప్పుడు పనికొస్తుంది" అంటూ గొడుగు కొన్నారు. అది కొని వూరుకున్నారా... లేదే....అది పట్టుకుని సిటీబస్సేక్కారు. - దిగేటప్పుడు ఆ గొడుగుకాస్తా సిటీ బస్సులో వదిలేసారు. అది దొరుకుతుందేమోనని రానూ పోనూ ఎనభై...ఎనభై రూపాయలు యిచ్చి, ఆ బస్సు డిపోకు ఆటోలో వెళ్ళి చేతులూపుకుంటూ తిరిగి వచ్చారు....(ముక్కు చీదుకుంటూ).. అన్నయ్య యిచ్చిన ఆ వందా నా చేతిలోనే వుంటే... తులం బంగారంకోసం మిమ్మల్నీ మిమ్మల్నీ అడిగే బాధ తప్పేది కదా...(నిష్క్రమణ)

*********

లక్ష్మి: (పాట)

రావ్: యేమిటోయ్...హుషారుగా వున్నావు?... ఓ కప్పు కాఫీ యిస్తావేంటి ?

లక్ష్మి: ఎందుకివ్వనూ..(లోపలికి వెళ్ళింది)

రావ్: లక్ష్మీ! యిక్కడ బ్యాంకు పాస్ బుక్ వుండాలి, నువ్వు కాని చూసావా?

లక్ష్మి: (కాఫీ కప్పుతో వస్తూ) ..ఏమిటండీ..

రావ్: అదేనోయ్ ... బ్యాంకు పాస్ బుక్...

లక్ష్మి: ఏమో నాకేం తెలుసు... అప్పట్నించీ కనపడలేదా ?

రావ్: ఎప్పట్నించి...

లక్ష్మి: అదేనండి...ఆ మధ్య మా అన్నయ్య వచ్చి, వెళ్తూ వెళ్తూ 'గాజులేయించుకో చెల్లీ' అని వంద రూపాయలు యిచ్చాడు... యిచ్చాడా? ..అది కాస్తా 'బ్యాంకులో వేస్తాను వడ్డీ వస్తుంది' అని పట్టుకెళ్ళారు. పోనీ బ్యాంకులో వేసారా...లేదే...'వచ్చేవి శ్రావణ భాద్రపదాలు అప్పుడు పనికొస్తుంది' అనిచెప్పేసి గొడుగు కొన్నారు. పోనీ కొని వూరుకున్నారా లేదే... అదిపట్టుకుని సిటీ బస్సెక్కారు....దిగేటప్పుడు ఆ గొడుగు కాస్తా సిటీ బస్సులో వదిలేసారు. అది దొరుకుతుందేమోనని, రానూ పోనూ ఎనభై....ఎనభై రూపాయలు యిచ్చి ఆటోలో బస్సుడిపోదాకా వెళ్ళి చేతులూపుకుంటూ తిరిగి వచ్చారు..... ఆ వందా నా చేతిలోనే వుంటే తులం బంగారం కోసం మిమ్మల్నీ మిమ్మల్నీ దేవురించే బాధ నాకూ తప్పివుండేది....ఈ రోజు పాసుబుక్కు కోసం మీ బుర్రమీద వున్న ఆ కాసిని వెంట్రుకులూ పీక్కునే బాధ మీకూ తప్పివుండేది. ఇదంతా నా ఖర్మండీ...ఖర్మ.....ఖర్మ....

రావ్: అబ్బబ్బా...మళ్ళీ మొదలెట్టావ్...చంపేస్తున్నావోయ్...

లక్ష్మి: అవున్లెండి...నే నేమన్నా మీ కలాగే వుంటుంది..

రావ్: సర్లే, నే నేదో మేనేజ్ చేస్తాను కాని...యేమన్నా డబ్బులుంటే జేబులో పెడ్తావా?

లక్ష్మి: డబ్బులా? నాకు డబ్బులేమన్నా వుంచుతున్నారా యేమిటి మీరు....ఆ రోజు అన్నయ్య వెళ్తూ వెళ్తూ...గాజులేయించుకో చెల్లీ అంటూ ఓ వంద రూపాయలు యిచ్చాడు...యిచ్చాడా?...అది కాస్తా...

రావ్: తల్లీ యిక ఆపు....అరే! ఏం మాట్లాడినా-ఆవు కాంపోజిషన్ లా మళ్ళీ అన్నయ్య యిచ్చిన వందకే వచ్చేస్తావ్....సర్లే జీతం రాగానే నీ వందా నీకిచ్చాస్తానులే....నన్ను చంపకు.

లక్ష్మి: వున్న విషయం చెప్తే మీ కలాగే వుంటుంది....ఆ రోజు అన్నయ్య వెళ్తూ వెళ్తూ 'గాజు లేయించుకో చెల్లీ' అంటూ వంద రూపాయలిచ్చాడు....యిచ్చాడా...అది కాస్తా బ్యాంకులో వేస్తే వడ్డీ వస్తుందని పట్టికెళ్ళారు.....ఆ వందా నా దగ్గరే వుండి వుంటే...మీరిచ్చే వందతో రెండొందలయ్యేది...మిమ్మల్నీ మిమ్మల్నీ దేవురించకుండా యెంచక్కా నాలుగైదు తులాల బంగారం కొనుక్కునేదాన్ని..ఏంచేస్తాం... అంతా నా ఖర్మండీ...ఖర్మ...ఖర్మ...

రావ్: హతోస్మి....

------------


( మా హాసం క్లబ్ కార్యక్రమాలలో ప్రదర్శింపబడి ప్రేక్షకుల ఆమోదం పొందింది. ఇందులో మాశ్రీమతి.. విజయలక్ష్మి, నేనూ నటించాము.)

Saturday, October 9, 2010

దసరా కదండీ

శరదృతువు. ప్రకృతిలో ఓ పులకరింత. వసంతంలో పల్లవించిన జగత్తు, గ్రీష్మంలో తపించి, వర్షర్తువు ప్రభావంతో జలదరించి, శరత్తులో పులకరిస్తుంది. నిన్నటిదాకా వరదల బురదతో నిండిన జలాశయములలోని నీరు విరిగి, తేటపడి, స్వచ్ఛమై, స్వాదు జలాలతో ఆహ్లాదం కలిగించే ఋతువీ శరదృతువు. అంతా నిర్మలమే. నిర్మలమైన నీలి ఆకాశం. పిండి ఆరబోసినట్లు తెల్లని శరత్కాలపు సిరి వెన్నెల. వికసించిన పూల సౌరభాలు. ఏదో తెలియని ఆనందంతో పులకరించిపోయే నిండు మనస్సుతో శరదృతువుకు స్వాగతమందాము.
నక్షత్రాలలో మొదటి నక్షత్రం అశ్వని. అది పూర్ణిమతో కూడిన మాసం ఆశ్వీయుజం. ఆ కారణంచేత ఈ పాడ్యమితోనే సంవత్సరారంభమనే ఆచారముంది. మాసాలలో మొదటిది చైత్రము కనుక చై.శు.పాడ్యమి సంవత్సరాది అనడం కూడా మనకు తెలుసు. అప్పుడు వసంత నవరాత్రులు, యిప్పుడు శరన్నవరాత్రులు జరపడం సాంప్రదాయంగా వస్తున్నది. పంచభూతాత్మికమైన ప్రకృతితో - పంచభూత తత్త్వాలతో కూడిన మన ఈ శరీరాన్ని సరిపోల్చుకుంటూ - ప్రకృతినే పరమాత్మగా ఆరాధించడం మన హైందవ సాంప్రదాయం. అవే యీ నవరాత్రి సంబరాలు. ఆశ్వీయుజం, కార్తీకం - ఈ రెండూ మనకు పవిత్రమైనవే.

దసరాలో అమ్మను పూజిస్తాము. దసరా అనడంలోనే ఒక సరదా. పట్టు పరికిణీలతో, విరిసిన పూలతో చక్కగా సింగారించిన వాలుజడలతో ఘల్లు ఘల్లుమంటూ మువ్వల సవ్వడితో తిరిగే బాలా స్వరూపిణిగా.... పసుపుపారాణితో, రంగురంగుల గాజులతో శోభించే కోమల హస్తాలతో, చంద్రుని బోలు నిండు మోము పై యెర్రని కుంకుమ బొట్టుతో, కురుల విరులు అలంకరించి మందగమనంతో నిండుముత్తైదువగా శోభించే సువాసినీ రూపంగా ..... మంజీరధ్వనులు వేదధ్వనులు తలపిస్తుండగా భవునితో కూడి ఆనందంగా నడయాడే భవాని......అంతటా దర్శనమిస్తుంది.

మునుపటి రోజులలో .. దసరా అంటే పిల్లలకి గొప్ప సరదా. వేడినీళ్ళ పొయ్యిలు,,,, వాటి చుట్టూచేరి వేడి నీళ్ళకోసం అక్క చెల్లెళ్ళతో అన్నదమ్ములతో పోటీపడుతూ చేసే తలంటుస్నానాలు,పండుగనాటికి నాన్న కొన్న క్రొత్తబట్టలు, అమ్మచేతి కమ్మటి భోజనాలు,.....ఇవి యిప్పుడులేవా అంటే వున్నాయి... గీజరు నొక్కితే వేడి నీళ్ళు, బాత్రూములలో షాంపూలతో మూగ స్నానాలు. క్రొత్త బట్టలు యిప్పుడు నిత్యం. అంచేత ఆ ఆనందం క్షణికమే....బర్గర్లూ,పిజ్జాల కమ్మతనంఅలవాటుపడ్డాక అమ్మతనం యెంతమందికి కావాలి? ఇప్పటివారు యిదిఆనందదాయకమే అనవచ్చు.....కాని పండుగ ప్రత్యేకత లేదేమో అని మా భావన....అయ్యో! మన అభిమాన హీరో హీరోయిన్లు బుల్లితెర పై చెప్తారుగా పండగల గురించి ముద్దు ముద్దు మాటలతో...వారి మాటాలే మనకి విఙ్ఞాన సర్వస్వం....కదా?

అప్పట్లో రేడియోలో ...'శారద రాత్రులు వచ్చాయి-పండు వెన్నెలలు తెచ్చాయి' అంటూ ఓ పాట వచ్చేది.(నాకు పాట సరిగా గుర్తు లేదు). అందులోనే 'అట్లతద్దోయ్...ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్...పిల్లల్లారా,జెల్లల్లారా! లేచిరండోయ్ !'....అట్లతద్ది అనగానే మా బాబాయి గారి పిల్లలూ, మేమూ, పేటలో పిల్లలూ అంతా తెల్లారగట్టే లేవడం... మా పిన్ని గోంగూర పచ్చడి+పేరిననెయ్యి, నూపొడి, వుల్లిపాయ పులుసు, గడ్డపెరుగు వేసి చద్దన్నాలు పెడ్తే లాగించేసి.....పుచ్చపూవులాంటి వెన్నెలలో తెల్లారేదాకా ఆటలే. కొంచెం వయస్సువచ్చిన మగ పిల్లలు చిలిపి అల్లర్లు చేసేవారు. సెలూన్ బోర్డు లాయరు గారింటికి...డాక్టర్ గారి బోర్డ్ లాండ్రీ షాపుకీ ,,, అలా. ఆ వెన్నెలలో ఆ ప్రకృతి మాత ఒడిలో ఆ ఆనందానుభవం ప్చ్! అమ్మఒడి ఒక రక్షణ...ఓ భద్రత....ఈ కాంక్రీట్ జంగిల్లో ఆకాసమే కనుమరుగై పోయింది. చూడాలంటే ప్లానిటోరియంకు వెళ్ళాలి. తారలతో నిండిన ఆకాశం చెప్పేపాఠాలు...పండువెన్నెలలు పలికించే కవితావేశాలు...మనసును రసప్లావితం చేసే పిల్లతెమ్మెరలు...యే కోనసీమల్లోనో....యేకొబ్బరిఆకుల చాటునో...యే పంటకాలువల నీటి తరగల్లోనో....యింకా వున్నయేమో...ప్రగతిగా భావించే నాగరికతల ప్రభావం ఆ పల్లెలలోపడనంతకాలం రసహృదయాలు స్పందిస్తూనేవుంటాయి.

జయీ భవ! దిగ్విజయీ భవ...అంటూ...విల్లంబులు ధరించి.... ఆ బాణాలలో పూవులు పెట్టి...యింటింటికీ మేష్టరుగారి సారధ్యంలో వెళ్ళి దసరా పద్యాలు పాడి అక్కడ తలిదండ్రుల మీద పూలు జల్లి బహుమానాలు తెచ్చుకొనే సరదాలు చరిత్రలో కలసిపోయాయి...."దసరాకు వస్తిమని రుసరుసలు పడక..బహుమానముల నిచ్చి పంపండి వేగా..." అని "యేదయా మీ దయా మా మీద లేదూ...పావలా యిస్తే పట్టేది లేదు, అర్థరూపాయి అయితేను అంటేది లేదు" అని కండిషను పెట్టి "అయ్యవారలకు చాలు అయిదు వరహాలు..పిల్లవారికి చాలు పప్పుబెల్లాలు." అంటూ గురువుగారి పట్లగల భక్తి ప్రపత్తులనీ, తమ నిర్మలప్రేమనూ వ్యక్త పరుస్తారు. అలాంటి దసరా పద్యాలు యిప్పుడు కనుమరుగై పోయాయి.కార్పరేట్ స్కూల్స్....ఎ.సి.బస్సులు....ఎ.సి.క్లాసులు....అంతా క్లాస్....
గతం కొద్దో గొప్పో చూసాము కనుక మారే కాలంలో వున్నాము కనుక ఏదో వ్రాయడం....మార్పు అనివార్యం. ఏదీ తప్పుకాదు. యాంత్రికజీవనంలో మమతానురాగాలు దూరమై పోతున్నాయేమో అని ఆవేదన. అయితే ఆలోచించేవాళ్ళను కోరేది ఒకటే మనదైన సంస్కృతిని రాబోవుతరాలకు అందీయవలసిన పవిత్రబాధ్యతను మరచిపోకండి. మనవంతు కృషి మనం చేద్దాం.
దసరా పండుగ శుభాకాంక్షలు ....
మీకూ మీ కుటుంబములోని వారికీ.
............ది న వ హి