Pages

Friday, July 17, 2015

రాజమండ్రి - 10


పుష్కర ప్రారంభంలో


చందమామలో ఎప్పుడో ఒక కథ చదివాను.. మీకూ గుర్తుండే ఉంటుంది....


బ్రతుకుతెరువుకోసం ఒకామె పాలమ్ముకుని జీవిస్తోంది.. ఆ పాలమ్ముకునే స్త్రీ గంపలో పాలతో ఉన్న చెంబులు పెట్టుకుని నగరంలో అమ్మడానికి తీసుకువెళ్తోందోసారి.  ఆ పాల చెంబులపై పల్చటి వస్త్రం కప్పిఉంది.. ఇంతలో వచ్చిన గాలికి ఆ పైనున్న వస్త్రం తొలగి కొన్ని పాలచెంబులకు ఆచ్చాదన తొలగింది. అదే సమయంలో పైన ఆకాసంలో ఒక గ్రద్ద ఆహారంకోసం ఒక పామును కాళ్లతో పట్టుకుని ఎగురుతోంది. ప్రాణ భయం చేత ఆ విషనాగు నోరుతెరచి గరళం క్రక్కుతుంది.. అది సరిగా అచ్చాదన తొలగిన  పాలచెంబులో పడింది. ఆ పాలు కొనుక్కున్న వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు..
ఇప్పుడు ఆ పాపం ఎవరి ఖాతాకు వెయ్యాలి.. బ్రతుకుతెరువుకోసం పాలమ్ముకుని జీవిస్తున్న  ఆ స్త్రీకా... గాలిని వీచి వస్త్రం తొలగజేసిన తన ఉనికి చేత లోకరక్షణ చేస్తున్న వాయుదేవుడికా... భయంతో విషం కక్కిన విషనాగుకా.. తన పొట్ట నింపుకునే కనీసధర్మంతో ఆహారాన్ని పట్టుకుపోతున్న గరుత్మంతుడికా అని..దేవలోకంలో సంబంధిత దేవతలు క్రిందామీదా పడుతున్నారు.. ధర్మశాస్త్రాలు తిరగేస్తున్నారు.


ఈ విషయం గురించి దేవలోకానికి చెందిన రెండు పక్షులు భూలోకంలో ఓ చెట్టు మీద కూర్చుని చర్చించుకుంటున్నాయి.. ఆ చెట్టు నీడలో ఇద్దరు వ్యక్తులు విశ్రమిస్తున్నారు.. అందులో ఒకనికి పక్షి భాష తెలుసు. అతను విషయం విని పెద్దగా నవ్వి మిత్రుడికీ విషయం తెలియజెప్పి చేతకాని దేవతలని దేవతలను నిందించాడు. దేవదూతలొచ్చి అతన్ని పట్టుకుపోయారు... ఇతన్ని నిలదీశారు..నోటికొచ్చిన సమాధానం చెప్పి గేలిచేసాడు ఈ వ్యక్తి.. అంతా విన్న ఆ సమవర్తి "ఇతని సమాధానం ధర్మ బద్ధంకాదు..దేవతలనే ధిక్కరిస్తున్న ఈ అతితెలివిమంతుడిఖాతాలో ... ధిక్కరించిన పాపం, ప్లస్ మనకు తెగని సమస్యకు సంబంధించిన పాపం జమకట్టండి" అని తీర్పు ఇచ్చాడు...


రాజమండ్రి ఆహ్వానిస్తే వచ్చారు భక్తితో యాత్రీకులు.. వారికు రాజమండ్రి సరియైన సదుపాయాలు చేయడంలో విఫలమైంది..
ముఖ్యమంత్రా, అతనికి  సరియైన ఆలోచనలు అందీయలేకపోయిన మంత్రిగణమా, రక్షణ వైఫల్యమా, బాధలు పడేవాళ్లు దొరికితే చాలు, ఓదార్చేద్దామని మాటా ముల్లూ సర్దుక్కూర్చున్న విపక్ష పార్టీలా .. బాధ్యతారహితంగా విస్తృత ప్రచారం కల్పించే న్యూస్ మాధ్యమాలా… తమ వంతు క్రమశిక్షణ తాము పాటించక ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన క్రమశిక్షణ లేని ప్రజలా… గోదావరికి పుష్కరకాలం 12 రోజులూ  పవిత్రమని ముందే చెప్పని జ్ఞానులా…ఎప్పుడూ లేని విధంగా ఒక ముహుర్తం చెప్పి అదే పవిత్రమంటూ విశేష ప్రచారం చేయడమా … ఎవరిదీ తప్పిదం.
రాజమండ్రి గృహస్తుగా నాదే తప్పేమోననిపిస్తోంది … చాలా బాధ కలుగుతోంది…. శిరస్సు వంచి బాధాతప్త హృదయంతో సోదర ప్రజానీకానికి క్షమార్పణలు తెలుపుకుంటున్నాను.. జరిగిన నష్టం దీనివలన తీరదని తెలుసు… మిగిలిన రోజులు యాత్రికులకు ఆనందకరమైన అనుభవాన్ని కలిగించమని ఆ గోదావరీ మాతను కోరుకుంటున్నాను. పైనున్నదేవతలను ప్రార్థిస్తున్నాను.

Monday, July 13, 2015

రాజమండ్రి - 9

రాజమండ్రి - 9
 
అర మహా పుష్కరాలు

రచన: డి.వి.హనుమంత రావు.


రేపట్నించి ప్రారంభమయ్యే గోదావరీ పుష్కరాలు… అందరికీ మహా పుష్కరాలట. 
అయితే నాకు అర మహా పుష్కరాలు. అందరూ దీన్ని మహా పుష్కరమంటున్నారు …
అంటే 144ఏళ్ల క్రితం పుష్కరాలు లేవా.. గోదావరి లేదా.. ఆ చర్చ జోలికి మనం పోవద్దు. 
సరే - ఇది మహా పుష్కరమయితే నాకు ఇది అర మహా పుష్కరం. ఎలాగా…? 
చదివితే మీకే తెలుస్తుంది. చడవండి.


1943వ సంవత్సరంలో నేను పుట్టానండి. అప్పుడో పుష్కరమొచ్చిందటకదా ? నాకు గుర్తు లేదు. ఎందుకంటే నాకు పళ్లు లేవు .. అబద్ధాలాడే వయసు కాదన్నమాట. కాని అప్పుడు ప్రపంచ యుద్ధం టైమన్నమాట. నా జాతక చక్రంలో గంటో, గంటన్నరో కలుపుకోవాలి ఆర్ తీసేయాలి.

1955లో నేను హైస్కూల్ లో చదువుతున్నాను. భారత్ స్కౌట్ లో ఉన్నాను. శ్రీ కలగా కృష్ణమూర్తి గారు మా స్కౌట్ మాష్టారు. ఆయనని విత్తనాల మేష్టారనేవారు. ఎందుకంటే ఇంట్లో పండించుకునే బెండ,బీరా,చిక్కుడు లాంటి విత్తనాలు అడగకపోయినా ఇచ్చి పాదులు పెంచమనేవారు.వాళ్లింట్లో  తేనెటీగల పెంచే  పరిశ్రమ ఉండేది. మంచి మేష్టారు . పుష్కారాలకు నాకు డ్యూటీ వేసారు. కోటిలింగాల రేవు లోనే డ్యూటీ, ఉమా కోటి లింగేశ్వర స్వామి వారి ఆలయం వెనకాల దేవస్థానం వారి ఆఫీస్ ఉండేది. మేము మెడలో స్కార్ఫ్, చేతిలో కర్ర, నడుందగ్గర బెల్ట్ కి ఓ తాడు అన్నీ పెట్టుకుని, డ్యూటీకి వెళ్లగానే, దేవస్థానం ఆఫీసులో టిఫిన్, కాఫీ ఇచ్చేవారు. అక్కడనుంచి రేవులోకి వెళ్లేవాళ్లం. కర్రతో చెత్త ప్రక్కకు లాగుతూ, పెద్దవాళ్ళకి చెయ్యి పట్టుకొని రేవులో సాయం చేయడం ఇలా ఏవో చేసేవాళ్లం. అప్పుడు పిండ ప్రదానాలు అవీ గట్టు మీదే పెట్టేవారని గుర్తు. కళావెంకట్రావుగారు, అప్పుడు మంత్రి అనుకుంటా, వచ్చి రేవును చూస్తూ నాకు దగ్గరగా నించున్నారు. అది ఒక థ్రిల్. నాన్నగారికి ఆయన మంచి ఫ్రెండ్. అది తెలుసు. కానిఅలా అని చెప్పి పరిచయం చేసుకోడానికి ఏదో  బెరుకు. గట్టుమీంచి మెట్లు దిగాక ఎడమ వైపు ఒక బురుజులా ఉండేది. దానిపైన పోలీసులు అబ్సర్వేషన్ పోస్ట్ అని పెట్టి రేవు పరిశీలిస్తూ హెచ్చరికలు చేసేవారు. సీతంపేట నుంచి కోటిలింగాల రేవు వైపుకు పెద్ద పెద్ద కంపార్ట్మెంటులు వెదురుతో కట్టి క్రౌడ్ ను కంట్రోల్ చేయడం గుర్తు. అప్పుడు కూడా పుష్కరాలు రెండు పంచాంగాల పద్ధతిలోనే వచ్చినట్టున్నాయి.. ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నానంటే .. స్కౌట్ డ్యూటీ కి రోజుకి పావలా ఇచ్చేవారు. నాకు 22 పావలాలు వచ్చాయి. అంటే అయిదు రూపాయల ఎనిమిదణాలు. అవి పెట్టి నేను ఒక బేబీ గొడుగు కొనుక్కున్నాను. చాలా కాలం వాడాను.

1967లో నాకు బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. చేస్తున్న ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ ఉద్యోగం రిజైన్ చేసి, ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో -  పలాసాలో ఉద్యోగం. చేరి ఆరునెలలవకుండానే పుష్కారలొచ్చాయి. సెలవడిగితే ఏజెంట్ (అప్పుడు ఏజెంట్ అనేవారు )గారిని సెలవడిగితే, ఇంకా ప్రబేషన్ అవలేదు. ఇప్పుడిస్తే మీ సర్వీస్ కు ఇబ్బందవుతుందన్నారు. కాని మంచాయన,భగవత్ చింతన ఉన్నాయన, మిత్రులుకూడా నా అభ్యర్థనకు మద్దత్తిచ్చారు. ఆదివారము కలసొచ్చేటట్టు రెండు రోజులు సెలవిచ్చారు. పరుగెత్తుకుని రైలు బండిలో వచ్చేసాను. సుబ్రహ్మణ్య మైదానంలో స్టేజి మీద ఏవో సాంస్కృతిక కార్యక్రమాలు. అప్పుడే వేదాంతంవారి స్త్రీ వేషధారణ చూసాను. టి.టి.డి. వాళ్లు అతి చవకగా పుస్తకాలమ్మారు.  మునిసిపల్ స్టేడియం లో ఎగ్జిబిషన్. లోపల డాన్స్ చేస్తున్న అమ్మాయి, బయట స్క్రీన్ పై కనపడడం ఒక వింత. అప్పుడే అనుకుంటా పది రూపాయలకో అయిదు రూపాయలకో విమానం నగరసౌందర్యాన్ని చూపేది. ఆఫ్ కోర్స్ నేనెక్కలేదు..

1979లో ఆఫీసర్ గా ప్రమోషన్, పాయకరావుపేటలో ఉద్యోగం. ఇనప్పెట్టి తాళాలు  పట్టుకునే ఉద్యోగం. సెలవంటే ప్రాబ్లం .. మొత్తం మీద ఒక రోజో రెండురోజులో వచ్చి వెళ్లాను. అప్పటికి పెళ్లయింది. ముగ్గురు పిల్లలు. ఆనందం, ఉత్సాహం - నాకున్న ఉద్యోగ బాధ్యతల బరువుతో  అణగింది. యువభారతి, జంట నగరాల సాహితీ సంస్థ బుక్ స్టాల్ పెట్టింది. నాకున్న పరిచయం దృష్ట్యా కొంత మాట సాయం చేసాను ఉన్న రెండురోజులూ .

1991లో రాజమండ్రికి దగ్గరగా ఇందుకూరుపేటలో బి.యమ్ గా వేసారు. ప్రొద్దున్న పోతే సాయంత్రమే తిరిగి రావడం. అయినా వచ్చాక ఉత్సాహం తెచ్చుకుని ఊరు చూసేవాణ్ణి. మా మేనమామగారబ్బాయి శ్రీరామనగర్ లో ఇల్లు తీసుకుని వచ్చిన వాళ్లందరికీ భోజానాలు ఏర్పాటు చేసాడు. మా ఆవిడా పిల్లలూ వడ్డనలో  సాయపడేవారు. నాకు ఆదివారాలలాంటి శలవుదినాలలో కుదిరేది. అప్పుడు పాల్గొని ఆనందాన్ననుభవించాను. ఇంతకు ముందు పుష్కరాలకు హోటల్ వాళ్లు చాలా సొమ్ము చేసుకున్నారట. మనుషులు నడచే రాంప్ మీదకూడా ఆకులేసి పెట్టేసే వారట. అయితే నాకు తెలిసి 1991 పుష్కారాలలో రాజమండ్రి ఒక అన్నపూర్ణ -- ఒక డొక్కా సీతమ్మ అందరిళ్లల్లోనూ భోజనాలు యథా శక్తి పెట్టేవారు. అప్పుడు మేం రాజా టాకీస్ ప్రక్క నూనె మిల్లు కాంపౌండ్ లో ఉండేవాళ్లం. శ్రీకాకుళం జిల్లాలనుంచి ఒక కాంట్రాక్టర్ బస్సు వేసి ఒక batch జనాన్ని తీసుకొచ్చి ఇంకో batchని తీసుకువెళ్ళే వాడు. అందులో వచ్చిన ఒకరిద్దరు బ్రాహ్మణులు మా ఇంటికొచ్చి భోంచేసారు. స్కూల్ పిల్లల చేత అన్య మత  ప్రచారం. ఓ రోజు నేను నదీ స్నానం చేసి భస్మ ధారణ తో ఇంటికొస్తుంటే అన్య మత సాహిత్యం పట్టుకొచ్చి చేతిలో పెట్టబోయాడు. వెనక్కి త్రిప్పమన్నాను. చూస్తే అర్థంఅయిపోయింది. చాలాకోపం వచ్చి, అసలు నీకు బుద్ధుందా, ఇదేం పనంటే .. విదేశీ పైసలతో ఆత్మ ద్రోహం చేసుకుంటున్న ఆ ఆసామీ.. థాంక్యూ సర్ అంటూ పారిపోయాడు. ఇలాంటివి చూస్తుంటే చాలా బాధ కలిగేది.. ఇవన్నీ ప్రక్కనెట్తే ఆ పుష్కరాలు చాలా ఆనందాన్నిచ్చాయి.  ఈ ఆనందానుభవం నాతో 2003 పుష్కరాలదాకా ప్రయాణం చేసింది.    

ఇక 2003 పుష్కరం. 2003 జనవరిలో నాకు షష్ట్యాబ్ది పూర్తి. 2001లో వి.ఆర్.యస్ తీసుకున్నాను. అప్పటికి వైజాగ్ లో ఉన్నా పుష్కరాలకు రాజమండ్రి చేరాలని గట్టిగా నిర్ణయించుకుని, రాజమండ్రి మకాం మార్చేసాను. నేనూ మా మేనమామ గారబ్బాయి కలసి ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాము. అంతా అయ్యాక ఆ ఇంటివారు అద్దె ఏమీ తీసుకోకుండా తమ సౌజన్యం చూపారు. వైజాగ్ నుంచి ఒక చక్కని వంటాయన (చక్కదనం వంటలో) మాకు తన నైపుణ్యం చూపాడు .. రోజుకి మిత్రులు, బంధువులు 100కి తక్కువకాకుండా భోంచేసారు. ఆచార్య తిరుమల, అక్కిరాజు సుందరరామకృష్ణ, వడ్డె శ్రీకృష్ణ వంటి ప్రముఖులు తమ పుష్కర స్నానం చేసి, తీర్థ విథులు పూర్తి చేసుకుని, మా తావులో భోంచేసి వెళ్ళేవారు. అప్పటి పరిచయాలు కొన్ని ఇప్పటికి కొనసాగుతున్నాయి అంటే అది మా దంపతుల అదృష్టం. రోజూ మా చిన్న ఇంటిలో 15మందైనా విశ్రమించేవారు. రాత్రి వారికి ఫలహారం మా శ్రీమతి ఏర్పాటు చేసేది. ఉదయం కాఫీ మా ఇంట్లో, పుష్కరస్నానం, తరువాత మా తావులొ భోజనం. మరొక ఇల్లు అద్దెకి తీసుకుంటే దూరాలనుంచి వచ్చిన పురోహితులు మకాం చేసి, వారు కార్యక్రమములు నిర్వర్తించి నాలుగు రూకలు సంపాదించుకునేవారు. సమయం దొరికినప్పుడు ఊరు చూసేవాళ్లం. తెలుగుదేశం నేతృత్వంలో ఊరు సర్వాంగ సుందరంగా తయారైంది. అప్పుడే ఘాట్లన్నింటికి టైల్స్ వేసారు. రోడ్లన్నీచదును చేసారు. పచ్చటి మొక్కలు పాతారు. ఎన్నో స్వచ్చంద సంస్థలు టిఫిన్స్, భోజనాలు ఉదారంగా పంచారు. యాత్రీకులు ఎంతో తృప్తి పడ్డారు.
పుట్టుకనుంచి, షష్టి పూర్తి దాకా ఆరు పుష్కరాలు … అర మహా పుష్కరాలు. మొదటిది పాపం చిన్నపిల్లాడ్నని వదిలేస్తే ఇది ఆరవ పుష్కరం..

2015 .. 6 x 12 = 72 పూర్తి అయ్యాక వచ్చిన పుష్కరం. ఇది అరమహాపుష్కరం … పనులు లేట్ గా మొదలయ్యాయి, విపరీతమైన ఎండలు, అకాల వర్షాలు పనుల వేగాన్ని తగ్గించాయి. కోటిలింగాల ఘాట్ పెద్దది చేయడం, నిత్య గోదావరి హారతి కొన్ని విశేషాలు. గోదావరి హారతి అన్నది క్రితం పుష్కరాలలో ప్రారంభమైంది. కాని మ్రొక్కుబడి. అప్పుడు మేమున్న సంస్థద్వారా, ప్రతి పున్నమికి పుష్కర ఘాట్ లో హారతి  2005లో మే లో ప్రారంభించాము. సామవేదం వారు హారతి పాట కూడా వ్రాసారు. అయితే ఆత్మీయంగా, నిరాడంబరంగా సాగేది. రాజకీయనాయకుల ప్రవేశం లేదు. ఆ తర్వాత ప్రస్తుతం చేస్తున్న సంస్థ అదే రేవులో అదే పున్నమి నాడు భారీగా కార్యక్రమం మొదలెట్టారు. రాజకీయ నాయకులు ఓహో అద్భుతమైన ఆలోచన అన్నారు, మాది తగ్గింది.. ఇప్పుడు అందరూ ఆనందించేవిధంగా నిత్య హారతి గా గోదావరీ మాత నీరాజనాలు అందుకోవడం శుభ పరిణామం. విషయ పరిజ్ఞానంతో మహనీయులు  తమ ప్రవచనాల ద్వారా ఆధ్యాత్మికత సామాన్య జనులలో పెంచడం వలన, పెరిగిన సాంకేతిక పరిజ్ఞానం వలన లక్షల్లో యాత్రీకులు వస్తారని అంచనా..
పన్నేండేళ్లకోసారి వచ్చే ఈ పండుగకు,,
కడియం మొక్కల పచ్చదనంతో, విద్యుత్ కాంతుల ప్రకాశంతో, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వాతావరణంలో  
ఊరు సన్నధ్ధమైంది. యాత్రీకులను ఆహ్వానించడానికి, అట్టహాసంగా --

హృదయాలు తెరిచి యాత్రీకులను ఆహ్వానిస్తున్నాము ఆత్మీయంగా ….  

Friday, July 3, 2015

పుష్కరాలు… వచ్చాయి, వస్తున్నాయి…


రాజమండ్రి - 7

గోదావరి హారతి.

                                                                        రచన డి.వి.హనుమంతరావు. 


పెళ్లివారొచ్చేటప్పటికి తొమ్మిది దాటుతుందని వార్త వచ్చింది. ఆడపెళ్లివారిలో ఉన్న ఓ పెద్దాయన కన్యాదాతను పిలిచి 
“ఒరేయ్ నాన్నా! వాళ్లొచ్చేదాకా మనవారందర్నీ టిఫిన్స్ లేకుండా ఉంచేయకు. షుగర్ వాళ్లూ, బి.పి లవాళ్లూ ఉంటారు కదా. వీళ్లకు ఆ టిఫిన్స్ కాస్తా పెట్టేస్తే షుగర్ మాత్రలవాళ్లు ఆమాత్రలూ, బి.పి.ల వాళ్లు వాళ్ల మాత్రలు మింగుతారు. అంచేత మనవాళ్ళకి పెట్టించేయ్!” అన్నాడు.
“అలాక్కాదు బాబాయ్, మనం తినేస్తే బాగోదేమో, అదీకాక, మగపెళ్లివారి తాలూకు వారు కొందరు వేరే ఊళ్లనించి వచ్చి విడిదిలో ఉన్నారు, వాళ్లకి తెలిస్తే బాగోదు…”
“మరి చెప్పవేం.. వాళ్లనీ వచ్చేయమను, మీ వాళ్లలో పెద్దలూ పిల్లలూ ఉండలేరేమో అని పెట్టించేసాం, అని చెప్పొచ్చు”
అన్నాడు పెద్దాయన.
“మరి బాబాయ్.. “ .. 
“ఒరేయ్ అలా నసక్కు, వీళ్లందరూ టిఫిన్ తినేసి వాళ్లు  బస్సు దిగేటప్పటికి
నీరస ముఖాలు లేకుండా … స రస ముఖాలు వేసుకుని కళ కళ లాడుతూ నించుంటే ఎంత బాగుంటుందిరా….” అని ఉత్సాహ పరచారు బాబాయి గారు..


ఇంతకీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే …
ఒక సిద్ధాంతం ప్రకారం గోదావరికి పుష్కరాలొచ్చేసాయి. మరో లెక్కప్రకారం 14 జులై నుంచి ప్రారంభమవుతాయని అంటున్నారు.
ఆ నాటికి  చాలా మంది వచ్చేవారున్నారని అంచనాలున్నాయి. అలాంటప్పుడు మా రాజమండ్రీ జనాభాకూడా మీతో పాటు స్నానాలకి వస్తే రష్షూ పెరుగుతుంది, అటూ ఇటూ తిరుగుతూ మిమ్మల్నీ సరిగా రిసీవ్ చేసుకోలేం. అందుకని మాకిక్కడ ఓ పెద్దాయన చెప్పారు కనుక, అదీకాక  చాలా రేవులు ఖాళీగా ఉన్నాయి కనుక చాలామంది స్నానాలు చేసేస్తున్నారు. పుష్కర ఏర్పాట్లు ఎలా వున్నాయో ముందే చూడ్డం మంచిది కనుక,  మీరొచ్చాక మీతో పాటు మునగ కలిగితే మరో మునక వేస్తాము. లేదా ఇదే పుష్కర స్నానంగా ఆ పైవాడు జమేసు కుంటాడు. అన్నది ఒక భావన. చెప్పినవారు దైవజ్ఞులు, బ్రహ్మవేత్తలు ..కనుక ఇదే పుష్కర ప్రారంభం అని ఇంకో భావన. . అప్పుడూ, ఇప్పుడూ అయితే మరీ లాభం. అధికస్య అధికం ఫలం అని మరో భావన.
ఈ భావనాత్రయానికి మా శ్రీమతి భావన తోడై నేను ఈ రోజు పుష్కర ఘాట్ కు బయల్దేరాను. అధికం కాకపోతే ఈ పున్నమి గురు పూర్ణిమ .. గురువారం .. ఇంకేం …
అక్కడ పరిచయమున్న పురోహితులు కలసి శాస్త్రీయంగా మా దంపతులచేత సంకల్పం చెప్పించి, స్నానం చేయించారు.. విశాలమైన గోదావరి నది పరవళ్ళు త్రొక్కుతూ ప్రవహిస్తుంటే మనసు ఆనందంతో పరవళ్ళు తొక్కింది. ఈ గోదావరీ తీరంలో ఉన్నందుకు.. గర్వం, ఆనందం కలిగాయి. అఖండ గౌతమి, రాజమండ్రి వాసుల ఆస్తి. ఈ నీటిసిరి మనందరికి అన్నం పెట్టే అన్నపూర్ణ.




నిన్నటి రోజు నుండి గోదావరికి నిత్య హారతంటూ ప్రియతమ ముఖ్య మంత్రిగారు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పుష్కర ఘాట్ రేవులో పరిచయమైన వారు కలిస్తే  “మొత్తానికి గోదావరికి నిత్య హారతి జరగబోతోంది .. చాలా సంతోషంగా ఉంద”న్నాను. వారు వెంటనే స్పందించి.. “ఇది మీరు నాటిన బీజం” అన్నారొకరు, “మహావృక్షమయిం”దన్నారు మరొకరు. “మన కందనంత ఎత్తుకు ఎదిగిం”దన్నాను నేను. వారే కాదు నిన్న హారతి చూచివచ్చిన మిత్రులు, “మీరే గుర్తొచ్చారు.. మీరు మొదలెట్టిందే కదా” అన్నారు, ఎవరో ఫోన్ చేసి అదే అభిప్రాయం వెలిబుచ్చారు. అంటే నేనే మొదలెట్టానని కాదు, మొదలెట్టినవాళ్లలో నేనూ ఒకణ్ణి అని ….  

నేపధ్యంలో కొక్కసారి రండి .. గత పుష్కరాలలో గోదావరి హారతి ప్రభుత్వం ప్రారంభించింది. అయితే అది కేవలం ఒక మొక్కుబడిగా జరిగేది. కనీసం జరుగుతున్నదన్న బోర్డు కూడా ఎప్పుడూ కనబడ లేదు. నేను అక్కడున్న ఉద్యోగులతో ప్రస్తావించాను. కాని వారు మాత్రం ఏం చేయగలరు. తర్వాత  ఒక సేవా సంస్థతో నాకు అనుబంధం ఏర్పడింది. .. నేను దాని కార్య నిర్వాహక వర్గంలో ఉన్నప్పుడు మేమంతా ఆలోచించి ప్రతి పున్నమికి గోదావరికి హారతి పుష్కరఘాట్ లో ఈయడానికి సంకల్పించాము. 2005 మే పున్నమినాడు అద్భుతంగా ప్రారంభించాము. దానికి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మగారు చక్కటి హారతి పాటను అప్పటికప్పుడు వ్రాసి ఇచ్చారు. దానితో హారతిచ్చేవాళ్లం. . హారతికి ముందు మహిళామణులు లలితాసహస్రనామ  పారాయణ, గంగహారతి పాటలు కూడా పాడేవారు. లబ్ధ ప్రతిష్టులైన కవి పండితులు గోదావరి ప్రాశస్త్యము పై చక్కటి ప్రసంగాలు చేసేవారు. వారి ప్రసంగంలో గోదావరి ప్రాముఖ్యతను తెలుపడమే కాకుండా, పవిత్ర నదిపట్ల మనం పాటించవలసిన ధర్మాలను చెప్పేవారు. ఇదేకాకుండా ప్రాతఃకాలంలో మేము కొంతమంది, మహిళామణులతో సహా వెళ్లి రేవు శుభ్రపరచడమే కాకుండా, పరిశుద్ధంగా రేవును ఉంచాలని యాత్రీకులకు అవగాహన కల్పిస్తూ, మైకులో చెప్పెవాళ్లం. అయిదారేళ్ళు ఆ విధంగా ప్రతి పున్నమికి, ఏ రోజూ మానకుండా గోదావరికి హారతి యీయడం ఒక హంబుల్ వే లో జరిగింది. చాలామంది ఈకార్యక్రమంలో పాల్గొని హర్షం ప్రకటించేవారు. ఆ తర్వాత బుద్ధవరపు వారు వచ్చి గోదావరికి హారతి  భారీ స్థాయిలో ప్రారంభించారు. అప్పుడు మేము గౌతమ్ ఘాట్ కు మారాము. అక్కడకూడా చాలాకాలం హారతి కార్యక్రమం జరిగింది. తర్వాత కొనసాగించలేకపోయాము. అయితే అప్పణ్ణించి చాలా సంస్థలు ఆయా సందర్భాలలో గోదావరి హారతి తమ కార్యక్రమములలో కలపి నిర్వహించేవారు.. ఎవరు చేసినా … ఎలా చేసినా… రాజమండ్రి ఉనికికి, మనికికి కారణమైన గోదావరి మాతకు కృతజ్ఞత చూపడం మన కర్తవ్యం. అదే  జరుగుతోంది. ఆనంద దాయకం కదా?