దసరాకు హైదరాబాదు వచ్చాడు....ప్రసాదరావు. పేరు పూర్తిగా చెప్పకపోతే ప్రసాదరావుకు చాలా కోపం వస్తుంది. ఎంచేతనంటే బామ్మ స్వయంగా రికమెండు చేసి ప్రసాదరావు వాళ్ల నాన్నచేత ఆ పేరు పెట్టించింది. పూర్తి పేరు ఏమిటంటే సత్య వేంకట సూర్య మల్లిఖార్జున వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర వర ప్రసాద రావు. ఇందులో బామ్మ దర్శించిన పుణ్యక్షేత్రాలలో వేంచేసివున్న ముక్కోటి దేవతల పేర్లూ..అన్నీ కాకపోయినా కొంతవఱకైనా వున్నాయి అంటే అలా పొందుపఱచిన ఘనత బామ్మకే దక్కుతుంది. అంతేకాదు..శ్రీ వెంకటప్పయ్యగారు కూడ కొంతవఱకు చోటు చేసుకున్నారు. శ్రీ వెంకటప్పయ్యగారంటే గం.భా.స.బామ్మగారి పెనిమిటి. శ్రీ వారు మనకిప్పుడు లేరు. ఆయన పూర్తిపేరు పెట్టలేదన్న విషయంలో మాత్రం బామ్మకు కొంచెం అసంతృప్తి వుంది. బామ్మగారంటే ప్రసాదరావుకు బాగా గురి. ఎంచేతనంటే చిన్నప్పటి నుంచి ఆమె పెంపకంలోనే పెరిగాడు..అలా అని ఆవిడ ఏమీ తేడాగా పెంచలేదు. బి.ఏ వఱకు చదువుకున్నాడు. ఎటొచ్చీ శకునంచూస్తేకాని క్షవరం చేయించుకుందుకుకూడా ప్రసాదరావుని పంపేది కాదు బామ్మ. బామ్మకు రొంపపట్టినప్పుడు మాత్రం ప్రసాదరావుకు కాలేజీకి వెళ్లడం చాలా కష్టమయ్యేది. వాల్తేరునుంచి విజయవాడదాకా ఆగని కోరమాండల్ ఎక్స్ ప్రెస్సులాగా అడ్డూ ఆపూ లేకుండా అరగంటవఱకు తుమ్ముతూ ఉండడం బామ్మ స్పెషాలిటీ..బామ్మని కాదని వెళ్లినా ఫర్వాలేదుకాని ఆమె తుమ్మునీ, ఆ ప్రభావాన్ని కాదని వెళ్లడం ఇష్టంలేని పని ప్రసాదరావుకి. ప్రసాదరావు కాలేజీకివెళ్తున్నప్పుడుకాని, ఆ మాటకొస్తే మఱెప్పుడైనా సరే...ఎవరైనా "ఎక్కడికి ?" అని అడిగారంటే ఇంతే సంగతులు....ప్రసాదరావైతే మామూలుగానే ఆగిపోతాడు కాని అలా అడిగిన సదరు వ్యక్తి బామ్మగారి ధాటికి రెండుమూడు రోజులుదాకా నిద్రలో కూడా ఉలిక్కిపడి లేవాల్సిందే...పరీక్షల్లో మాత్రం ప్రసాదరావు చాలా జాగ్రత్తలు తీసుకునేవాడు.. ముందరి రోజునుంచి బామ్మను కాకా పట్టేవాడు..అందుబాటులో విక్స్ ఇన్హేలర్ ఒకటి బామ్మకోసంఉంచేవాడు, అత్యవసర పరిస్థితినుంచి కాపాడ్డానికి. బామ్మకూడా ముందఱిరోజే ఓ బిందె నిండా నీళ్లు పట్టి ఉంచేది. ఆ నీళ్లబిందె తీసుకుని కోడలు (అంటే ప్రసాదరావు వాళ్ల అమ్మ) ప్రసాదరావుకి ఎదురు వచ్చేది.. అప్పుడు ప్రసాదరావు, బామ్మ చెప్పినట్టు కుడికాలు ముందు పెట్టి, ఠీవీగా పరీక్షలకు వెళ్లేవాడు. మఱీ కాలేజీకి ఫస్టు అవీ వచ్చేయలేదుకాని మంచి మార్కులతోనే బి.ఏ పాసయ్యాడు...మఱీ బామ్మ వెనకాల తిరిగే కూచి ప్రసాదరావు అనుకుంటున్నారా ? చాలా పొరపాటండి...బాల్ బ్యాట్ మెంట్ లో రైటుఫ్రంట్ బాగా ఆడ్తాడు... ఎటొచ్చీ బంతి కొట్టేటప్పుడు ముందర ఆంజనేయుణ్ణి తర్వాతబామ్మను తలచుకున్నాకనే బంతికొడ్తాడు... బ్యాట్ మెంట్ కోర్టులోకి వెళ్లేటప్పుడు ముందు కుడి కాలు పెట్టడం తప్పనిసరి..అన్ని రకాల పుస్తకాలు చదువుతాడు...అందఱితోనూ చక్కగా మాట్లాడతాడు... ఎవరైనా తుమ్మితే మాత్రం అసంకల్ప ప్రతీకార చర్యలాగా కాసేపు ఆగిపోతాడు...తర్వాత మళ్లీ పుంజుకుంటాడు....దసరాకు రైల్లో హైదరాబాదు వచ్చేటప్పుడు పరుగెడ్తున్న రైల్లోకూడా గుమ్మం దగ్గఱ కాసేపు నించున్నాడు ధైర్యంగా...ఇంకాసేపు నించునును కాని ఎవరో ముసలాయన "ఎందుకు బాబూ ? అక్కడ నుంచుంటావు..లోపలికి వచ్చేయమ్మా!" అన్నాడు..ఆయన ముఖంలో బామ్మో, వెంకటప్పయ్యగారో కనపడ్డారులా వుంది..వెంటనే వెనక్కి వచ్చేసాడు..స్టేషనుకు మామయ్యగారబ్బాయి సారథి వచ్చాడు...ఇద్దరూ ఆటోలో మామయ్యగారింటికి వెళ్ళారు..మామయ్య "కొన్నాళ్ళుండరా..ఏదైనా ఉద్యోగం చూద్దాం " అన్నాడు.. సారథితో ఊరంతా చూడ్డం మొదలెట్టాడు ప్రసాదరావు...బస్సులూ---ఆటోలు; రిక్షాలు---అమ్మాయిలూ అన్నీ కొంచెం వింతగా వున్నాయి ప్రసాదరావుకి. పరుగెత్తే బస్సు వెనకాల పరిగెత్తి బస్సెక్కడం, కదుల్తున్న బస్సుల్లోంచి స్టాపు కానిచోట కూడ దిగడం వింతల్లోకి వింతగా కనిపించింది ప్రసాదరావుకి."ప్రసాదూ! గమ్మున ఇక్కడ దిగరా, ఇక్కడనుంచి హాలు దగ్గర.." అని కదుల్తున్న బస్సులోంచి సారథి బస్సు దిగేస్తున్నాడు. వెనకాలే ముందు ఆంజనేయస్వామినీ, తర్వాత బామ్మనీ, తలచుకుని కుడికాలు ముందు పెట్టి, పరుగెత్తే హైదరాబాదు సిటీ బస్సులోంచి దిగేసాడు సత్య వేంకట సూర్య మల్లిఖార్జున వల్లీ సుబ్రహ్మణ్యేశ్వర వర ప్రసాదరావు...ఆ కాలు చుక్కల అరటిపండు తొక్కమీద పడింది. అది వేరే విషయం.తర్వాత ఆసుపత్రినుంచి నర్సుచేత బామ్మకి నీతి వాక్యం రాయించాడు ప్రసాదరావు...."పరిగెత్తే హైదరాబాదు సిటీ బస్సులోంచి దిగేటప్పుడు కుడికాలు ముందు పెట్టకే బామ్మా!!!!"*******
[ఆకాశవాణి, హైదరాబాదు'బి' నుండి...'యువభారతి' (జంటనగరాల సాహితీ సంస్థ) వారి సాహిత్యకార్యక్రమంలో 1981 అక్టోబర్, 7 న ఈ స్వీయ రచన ప్రసారం చేయబడింది...నేనే చదివా... ]
మంగళదాయకం మహవీర రూపంధ్యానయోగ్యం సంజీవనోద్ధారక సుందర రూపంఈప్సితార్థ ప్రదాయని ఆ శ్రీరామ దాస రూపంపర్వతధారీ పవనపుత్ర ! జై జై శ్రీ సుందర హనుమ ||వైశాఖ బ||దశమి హనుమజ్జయంతి..27.05.2011 శుక్రవారం...హ ను మ...అ--ఉ--మ=ఓం-----ప్రణవం.----ప్రణవస్వరూపుడు హనుమ.హనుమ తలపే రక్షణ...ధైర్యం....బుద్ధిలో, బలంలో, తేజస్సులో, పరాక్రమంలో, ధైర్యంలో నీతో సరితూగే వ్యక్తి ఈ ప్రపంచంలో లేడు..అంత పరాక్రమ సంపన్నుడవైన నీవే సముద్రలంఘనం చేయగలవు, సీతమ్మ జాడ తెలుసుకోగలవు అని సముద్రతీరాన జాంబవంతుడు హనుమను పరిపరివిధాల ప్రేరేపిస్తాడు...హనుమ త్రివిక్రముడిలాగా విజృంభిస్తాడు...సింహగర్జన చేస్తాడు...తన గంభీరమైన వాక్కు వినిపిస్తాడు.....పావనమూర్తి రామనరపాలకుపంపున నబ్ధి దాటెదన్దేవవిరోధి దొంగిలించిన దేవిని జూచెద గానకుండినన్లావున గడ్డతో బెఱికి లంకయ తెచ్చెద నట్లు గానిచోరావణు బట్టి తెచ్చెదను రాముని సన్నిధి కెన్నిరీతులన్........(కవయిత్రి మొల్ల)తాను తప్పక జానకీమాతను చూడ గలనంటాడు హనుమ...ఏ కారణం చేతనైనా సీత కనపడకపోతే లంకానగరాన్నే పెఱకి తీసుకువస్తానంటాడు....వేగాన్ని యోగంగా మార్చుకుని ఆ హరిసత్తముడు అప్పటికే లంకా నగరం మానసికంగా జేరిపోతాడు...మొదట శ్రీ రాముని చూచినప్పుడు తన వాగ్వైభవంతో శ్రీరాముని మెప్పు పొందిన హనుమ...........ఇప్పుడు తన వాక్పటిమతో మానసికంగా లంక చేరిపోయాడు.......ఆ వాగ్వైభవం శ్రీరామానుగ్రహం.పరమాత్మకు చేరువలోనేవున్న ఆత్మ--పరమార్థప్రదమైన పదార్థాలను బుద్ధికి అందిస్తుందిట.. ఆ బుద్ధి మనస్సును ఆలోచింపజేస్తుందిట..అలా ఆలోచించిన మనస్సు అగ్నిని ప్రజ్వలింపజేస్తుంది...దానివల్ల వాయువు ప్రేరేపింపబడుతుంది..ఆ వాయువు హృదయంలో ప్రవేశించి పైకి ప్రయాణించి రకరకాల స్వరాలను, నాదాలను, నినాదాలను పుట్టిస్తుంది...అంటే ఈ సకల వాగ్విలాసానికి అనల, అనిల సంయోగమే మూలం..అదే అంజనీ దేవీ, వాయుదేవుల కలయిక...ఫలితంగా ఉద్భవించినవాడు వాగ్విదాంవరుడు ఆంజనేయుడు...అతని వాక్కుకి తిరుగులేదు...ఇది శాస్త్ర వాక్యం..---( శ్రీ ఇలపావులూరి పాండురంగారావుగారి, 'అనుదినరామాయణం' ఆధారంగా....)రామానుగ్రహం కావాలి అంటేశ్రీ రాముని పాదాలు పట్టుకోవాలి...శ్రీ చరణాలు పట్టుకోవాలంటే.........మారుతి చరణాలొదలడు...........పవమానసుతుడు పట్టిన పాదారవిందాలకోసం........... ...పవమానసుతుని పాదారవిందాలు పట్టుకోవాలి ఎప్పుడు...........ఎప్పుడోనా.................ఇప్పుడే........ఈ రోజే...... హనుమజ్జయంతి.
ఉదయం ఏడయ్యింది..ప్రక్క మీద బద్ధకంగా దొర్లుతున్నాడు విజయారావు..."ఇంక లేవండి! బారెడు పొద్దెక్కింది."ఆవిడ కచేరీ ప్రారంభించింది..ఉలిక్కిపడి మంచం దిగబోయాడు"ఆగండాగండి!..అలా దక్షిణానికి దిగకూడదుట..నిన్న పురాణంశాస్త్రుల్లుగారు చెప్పారు. ఉత్తరానికి దిగి తూర్పు వైపుకు రండి."ప్రస్థానం చెప్పిందావిడ. అర్థంకాక ఇంకో ప్రక్కకు దిగబోతే"అటుకాదండి ఇటూ.""అబ్బా అటు గోడవుందికదే?".."మంచిమాట చెప్తే విసుగెందుకుట?" జయమ్మకు చాలా కోపం వస్తుందలా విసుక్కునేవాళ్ళని చూస్తే...తను విసుక్కున్నప్పుడులేదు కాని ...తను విసుక్కుంటే ఎందుకంతయిదయిపోతుందని విజయారావు ప్రశ్న...మొత్తానికి మంచావరోహణ (గమనిక: గ్రామరులో ఈ రచయిత పాపం వీక్) ప్రకృతి పలకరింపులు అయి....బద్ధకంగాలేచి గుమ్మంలో పడేసినన్యూస్ పేపరు తెచ్చుకుని తలుపేసి వచ్చిసోఫాలో కూర్చున్నాడు విజయారావు.కాలింగ్ బెల్ మోగింది..లేచి తలుపు తీయబోయాడతను...అప్పుడే కాఫీగ్లాసుతో వస్తున్న శ్రీమతి జయమ్మ"ఏమండీ!!ఏమిటా దూకుడు? చొక్కా స రి గ తీసుకోండి..బొజ్జ కనపడుతోందిఅస్సయ్యంగా" అని గాత్రం మొదలెట్టింది....సన్నాయి నొక్కులు నొక్కుతూ.."నే తీస్తాలెండి తలుపు" అని తనే తలుపు తీసింది...ప్రక్క వాటాలో దిగిన క్రొత్త జంటలోని 'మంచి భాగం' లోపలికివచ్చింది."రా అమ్మా.." అని సాదరంగా ఆహ్వానించబోయాడు విజయారావు....వెనకనించి సప్రెస్డ్ వాయిస్ లో ఆవిడ"ఇక్కడ నే నేడిసానుగా....మీరు లోపల కూర్చోండి(.. ఏడవండి అన్నట్టే వుంది).....గృహస్థుగా తనకామాత్రం స్వతంత్రం లేదా అని ఇదయిపోయాడు విజయరావుమర్యాద కోసం ఆ అమ్మాయిని పలకరించ బోయాడు....జయమ్మకు నచ్చలేదు"మిమ్మల్ని ప ద మ న్నాగా" అని నొక్కిపలికింది...తిరుగు టపాలో లోపలికిపోయాడు విజయారావు....వాళ్ళబ్బాయి పుట్టిన రోజట..అందుకని వీరిజంటను భోజనానికిపిలవడానికి వచ్చిందా అమ్మాయి. క్రింద ఫ్లోర్ లో వున్నగురునాధంగారి జంటను;వీరినీ మాత్రమే పిలిచామని చెప్పింది."అంకుల్ కు చెప్పండి..ఆయనకూడా వచ్చి మళ్ళీ చెప్తారు.." అంది."ఫర్వాలేదమ్మా...నే చెప్తాగా" అని జయమ్మ ఆవిడ్ని పంపించేసింది."బాగుందోయ్ ఆ అమ్మాయి సంసారపక్షంగా" అని సర్టిఫికెట్ యిచ్చాడు..జయమ్మమౌనరాగం.అర్థమయి పోయింది ఆ అనుభవఙ్ఞుడికి....ఎందుకో అంత కోపం...తనేమన్నాడు...అమ్మాయి బాగుందన్నాడు...అంతమాత్రానికే....ఏమిటో ఈ ఆడోళ్ళు. అనుకున్నాడు విజయరావు.....తర్వాత షేవ్ చేసుకుని...బ్రష్ అవీ కార్నర్ టేబిల్ పై పెట్టబోయాడు.."అక్కడ పెట్తారేమిటి అయ్యప్పస్వామి ఫోటో కనపడ్డంలేదూ..లెంపలేసుకోండి...పాపం మా పద్మగారిచ్చారు..ఆయన శబరిమలై వెళ్ళరుట/""ఇంటినిండా అన్ని కీలకస్థానాల్లోనూ నీ ఫోటోలే రకరకాలఅవతారాల్లో వున్నాయి పరంధామా ! నీవైతే మూడోకాలుకోసం స్థలం వెతికావుకానినాకు మొదటి కాలుకే డౌటొచ్చేస్తుంది త్రివిక్రమా...కిం కర్తవ్యం?" అని వాపోయాడా దీనుడు.స రి గ వాటిని పెట్టి తర్వాత స్నానం కానిచ్చి...వచ్చి తడిపిన లుంగీ దణ్ణం మీద ఆరేస్తుంటే..."కొంచెం పిండండి...ఎలా నీళ్ళోడుతున్నాయో చూడండి"మళ్ళీ చెకింగ్..వళ్ళు మండిపోతోంది...పీక్కుందామంటే జుట్టు అంతంతమాత్రం...ఆ కాస్త జుట్టూ దువ్వుకుని, దువ్వెన్న పెట్టేటప్పుడు దేముడు చూడకుండా దేవుడి బొమ్మవెనక్కి త్రిప్పి అపుడు దువ్వెన్న భద్రపరచి తువ్వాలు బెడ్రూమ్ తలుపు మీద ఆరేసాడు..."తడీ పొడి తువ్వాళ్ళు తలుపులమీదవేస్తారు...పాడు అలవాటు.పాడు అలవాటా అని"...bad habit..not singing habit....పాఠకులు అపోహపడకుందురుగాక.."అంకుల్! వంటంతా నేనే చేసా...తిని ఎలా వుందో చెప్పండి" అని వడ్డనకుపక్రమించింది...వీణ, (అమ్మాయి పేరు,) టమోటా పప్పు వడ్డించబోయింది..వెంటనే జయమ్మ"వీణా! రాత్రిళ్ళు మీ అంకుల్, పప్పేసుకోరు" అని బ్రేకేసింది...విజయరావుకిమండింది...పప్పూ టమోటా చాలా ఇష్టం పాపమతనికి...ఈ క్రొత్తరూలెప్పుడు శాసన సభలో చట్టమైందో అంతుపట్టలేదతడికి.గుత్తివంకాయకూర వద్దు కాశిలో వదలేద్దామనుకుంటున్నారంది..బంగాళా దుంప, నెయ్యి, మీగడ ...కొలస్ట్రాల్ పెంచుతుంది..ఇవేవీ వద్దంది:రాత్రిళ్ళు మజ్జిగ నజ్జు చేస్తుంది పోసుకోవద్దంది....కొబ్బరి పచ్చడి దగ్గొస్తుంది వద్దంది...ఐస్ క్రీమ్ జలుబు, కిళ్ళీ వేడి....అన్నీ వద్దంటూంటే తిన్నానో లేదో అన్నట్టు తిని లేచాడు విజయరావు...భోజనాలు అయ్యాక మిత్రులు బయటి బాల్కనీలోనూ ఆడవాళ్ళు లోపలాకబుర్లు చెప్పుకుంటున్నారు."మీ అంత అనుభవఙ్ఞుడిని కాకపోయినా నా అనుభవాలు నావి." అంటూమొదలెట్టాడు శేఖర్"మొన్నామధ్య మాకొలీగ్ పెళ్ళికి ఫామిలీస్ తో వెళ్ళాము...మగాళ్ళంతా ఒకచోట;ఆడవాళ్ళంతా ఒకచోటా చేరి కబుర్లు చెప్పుకుంటున్నాము...ఇంతలో మేం వున్నదగ్గరికి మా స్టెనో వచ్చి కబుర్లు మొదలెట్టింది..తనకింకా పెళ్ళి కాలేదు..ఒక ఆఫీసులోవాళ్ళంకదా కొంచెం హుషారుగాసాగింది సంభాషణా పర్వం....ఆ తర్వాత భోజనాలు....అందరూ ఇళ్ళకు బయల్దేరారు ఇక ఇంటికి వస్తున్నంతసేపూ స్కూటర్ మీద ఈవిడఒక్క మాట మాటాడలేదు....ఇంటికొచ్చాక ఎడమొహం పెడమొహం...మర్నాటిఉదయానికి తుఫాను తీరం తాకింది."ఇంటి దగ్గర ఒక్క మాట స రి గ మాట్లాడరు...పరాయివాళ్ళతోఏమిటో ఆ జాజ్ సంగీతాలు. మాకూ వినిపించవచ్చు కదా సంతోషిస్తాము" అనివాయించింది...మాట్లాడినంతమాత్రాన ఆడవాళ్ళంతా మన వెనుక పడ్డానికి మనమేమీ'నవమన్మధులమా' చెప్పండి...ఓ వారం రోజులు నిరసన వ్రతం...." శేఖర్ అనుభవంచెప్పాడు."మా ఆయనా అంతే వీణా" అక్కడ గుర్నాధంగారి భార్య చెప్తోంది వీణకి.... "ఇప్పటికీ మా వారు నాకేదో పాఠాలు చెప్తారు...నేనెక్కడికైనా వెళ్ళివస్తే వెయ్యిఆరాలు తీస్తారు..పెళ్ళిలో క్రొత్త జంటకు అక్షింతలువేసేటప్పుడు నా ప్రక్కనవుండండినే నెవ్వరి ప్రక్కనో వుంటే బాగోదు...వీడియో తీస్తారుకదా అంటే తప్పు...అక్కడికితన్నేదో శాసిస్తున్నట్టు ఫీలయిపోతారు."మా ఆవిడా శ్రుతి కలిపింది...."ఫోనుల్లో తమ స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఎక్కడలేనిహుషారూ వచ్చేస్తుంది...బజారులో ఫ్రెండు కలిస్తే చాలు వో ఆనందం...అక్కడ మనంఏదైనా కావాలని అడిగామా...ఇక చూడూ....ఆ ఆనందం::హుషారూ ఏమైపోతాయో ....రుసరుసలూ విసుగులూ. మనమేమైనా అంటే తప్పు....మనమేదీ చెప్పడానికి పనికిరాముపిన్నిగారూ" సంసారంలో స రి గ మ లు ఇవే.భోజనాలయ్యాక యేమో కాని...కడుపునిండా కబుర్లు చెప్పుకున్నాక తృప్తిగా అందరంఇళ్ళకు కదిలాము...తెల్లారితే ఏ ఇంటా ఏ సంగీతకచ్చేరీకి ఏ విద్వాంసుడు/విద్వణ్మణిశ్రుతి స రి చేయను...న్నాడో/...న్నదో ఎవరికెరుక ?స రి గ మ ప ద ని స అంటూ సంగీత శిక్షణస రి గ ప ద మ ని అని సంసారంలో క్రమశిక్షణవర్ణాలవే.......క్రమ బేధం ~~~~~౦౦౦~~~~~~.