Pages

Thursday, April 19, 2012

రాజమండ్రి ఊసులు..ఉస్సూరుమంటూ...4



రాజమండ్రి గురించి మళ్ళీ అప్పుడే వ్రాయొద్దు.. కొంతకాలం తర్వాత అనుకున్నాను.. ఈ నాడు "ఈనాడు" పేపరు చూసాక మనస్సు ఏదోలా అయిపోయి ఆ బాధ కొంతైనా మీతో పంచుకోవాలనిపించింది..  కళ కళ లాడుతూ సందడి సందడిగా సాగిపోయే గోదారమ్మ నడక మందగిస్తోంది..  తల్లి ఉనికి సందేహాస్పదమౌతున్నది.. రాబోవు కొద్దికాలంలోనే నది కనపడకుండా పోయే పరిస్థితి వచ్చేస్తోంది. మనకున్న జీవనదుల్లో ముఖ్యమైన ఈ నది ఎడారిగా మారబోతోంది.. ఎక్కడ చూసినా ఇసుకమేటలే కనిపిస్తున్నాయి. ఎక్కడచూసినా అడవిమొక్కల దుబ్బులు కనిపిస్తున్నాయి. నిజానికి ఆధ్యాత్మిక క్షేత్రంగా రాజమండ్రి అలరారుతున్నదంటే గోదావరి నదే ప్రథాన కారణం. గోదావరి లేని రాజమండ్రిని ఊహించలేము.  ఈ చల్లటినీళ్ళలో పవిత్ర స్నానాలు చేయాలని  ఎక్కడెక్కడినుంచో వస్తారు.. ఇక్కడ వేంచేసివున్నపురాణప్రసిద్ధమైన  వేణుగోపాలస్వామిని, మార్కండేయస్వామిని తనివితీరా దర్శించాలని దూరదూరాలనుంచి వస్తారు...తీర్థవిధులు ఈ నదీ తీరంలో చేస్తే పితరులు తరిస్తారని ప్రగాఢవిశ్వాసంతో వచ్చేవారు కొందరు..వీరందరికీ కావలసినవి సమకూరుస్తూ ఎన్ని కుటుంబాలు జీవిస్తున్నాయో ?..... ఈ మధ్య గౌతమఘాట్ ప్రాంతాన్ని వివిధ దేవాలయాల సముదాయాలతో, ఆశ్రమాలతో....అందంగా తీర్చిదిద్దుతున్నారు.  పెరుగుతున్న రద్దీకి తార్కాణంగా అక్కడ ఒక పోలీసు చెక్ పోస్ట్ కూడా ప్రారంభించారు. భారత్ వికాస్ పరిషద్ (వివేకానంద శాఖ) నిర్వహణలో ప్రతి పున్నమి సాయంసంధ్యలో గోదావరిమాతకు హారతి ఇచ్చే కార్యక్రమం గత ఐదు సంవత్సరాలగా జరుగుతున్నది. పున్నమి హారతీయాలని ఈ చైత్రపున్నమికి రేవుకెళ్తే మెట్లదాకా ఉండే నీరు లోపలకెక్కడికో పోయింది..బాధనిపిం చింది....వాణిజ్యపరంగా ఆలోచిస్తే గోదావరిలో రవాణాకు అనుకూలమని కలపవ్యాపారం ఇక్కడ అభివృద్ధి చెందింది... క్రూసిబిల్ తయారీకి ఈ మట్టి ముఖ్యవస్తువు. అంచేత క్రూసిబిల్ ఇండస్ట్రీకి ఈ నగరం కేంద్రం.. అలాగే అల్యూమినియమ్.. వీటి అవసరాలకు అనుగుణంగా ఎన్నో వ్యాపారాలు, కార్మిక కుటుంబాలు... అనేక రంగాలలో అభివృద్ధిపథంలో పయనిస్తున్న రాజమండ్రి నగరానికి ప్రత్యక్షంగానూ పరోక్షంగాను గోదావరి ఉనికే కారణమన్నది నిర్వివాదాంశం. అలాంటీ గోదావరి మాతను కాపాడుకోలేని దుస్థితి... రేపటి విషయం ఆలోచించని ప్రభుత్వాలు.. అధికారదాహంతో , వచ్చే ఓట్లు తప్ప మరొకటి అక్కరలేదు అనుకునే ఆ నాయకమన్యులకు.. ఓట్లొస్తాయంటే...దీనివల్ల తమ జేబులు నిండుతాయంటే... నీరులేకపోయినా గోదావరికి ఉత్సవాలుమాత్రం ఘనంగా చేస్తారు. సంస్కృతి అంటే ఓ న మ లు  తెలియని ప్రభృతులు అనర్గళంగా గొంతు చించుకుని మరీ మాట్లాడతారు.. అప్పుడుకూడా  గోదావరి మాత తనబిడ్డ గొంతెండితే గొంతుతడపలేని అశక్తతకు  విలవిల్లాడిపోతుందే తప్ప.. ఈ పరిస్థితికి కారణమైన వారిపై కన్నెర్రజేయదు..  ఆ అమ్మతనం  తప్పుచేసిన బిడ్డనైనా ద్వేషించదు.. సంస్కృతి గురించి ప్రగల్భాలు పలికేవారు ముందుతరాలవారికి ఆ సంస్కృతిని పదిలంగా అందజేస్తున్నారా అని ఒక్కసారికూడా ఆలోచించటంలేదు.. గోదావరిలో నియమవిరుద్ధంగా ఇసుకతవ్వుకుని పోవడానికి రహదారులు నిర్మిస్తున్నారు... అవకాశం వస్తే... ఆ ఉన్న నీరూ ఎండిపోతే ఆ స్థలాలు కూడా కబ్జాచేసి బిల్డింగులు కట్టడానికి సిద్ధమయ్యే ప్రభృతులకు కొదవలేదు... ప్రజలకు ఏ విషయం పట్టదు.. పట్టినా ఏమీ చేయలేని నిస్పృహ.... కనీసం గోదావరి భగవత్ ప్రసాదమైన ఒక వరం  ... ఆ నీటి సిరికి భక్త్యా అంజలి ఘటిద్దామనే కనీస మర్యాదకూడా తోచని దుర్బలత్వం.. ఒక విహారస్థలంగా భావిస్తాము.. ఆ అమ్మమీద ఉమ్ముతాము.. స్నాన ఘట్టాలలో కూడా మల మూత్ర విసర్జన చేస్తాము. పాపప్రక్షాళన చేసే పవిత్ర జలాలలో అడ్డమైన కాలుష్యాన్ని కలుపుతాము.. పవిత్ర భావం లేదు.. ప్రకృతి కన్నెర్రజేస్తే కనుమరుగయిపోతాము అన్న స్పృహ లేని బ్రతుకులు బ్రతుకుతున్నాము. భగవంతునిలా చూడలేకపోయినా ప్రకృతిని కాపాడుకొంటేనే మన మనుగడ అనే స్పృహ కనీసం విద్యాధికులలో కూడా లేకపోవడం మనదురదృష్టం...  భగీరథుడు తపస్సుతో దివినుండి భువికి తెచ్చాడు గంగమ్మను.. తపస్సంపన్నుడు గౌతమమహర్షి గోదావరిని తెలుగునేలకు తెచ్చాడు... ఆ తపశ్శక్తి ఇప్పుడు లేకపోవచ్చు.. కనీసం ఆ స్పృహతో మనసారా ఒక్క నమస్కారం చేసినా ప్రకృతి పల్లవిస్తుంది.. అలా చేస్తే నదీ నదాలు స్వాదుజలాలతో మనదప్పిక తీరుస్తాయి... అప్పుడు ఈ నేల సస్యశ్యామలం అవుతుంది. విజ్ఞానగంగతో మనమస్తిష్కాలు నిండుతాయి... విజ్ఞులారా.. దయయుంచి ఆలోచించండి. రాజమండ్రి ఉనికికి మనికికీ కారణమైన ..... మనకు జీవనాధారమైన గోదావరి మాతను కాపాడండి...

10 comments:

Subramanya Shastry said...

హనుమంతరావు గారు,

మీరు ప్రస్తావించిన 'ఈనాడు' ఆర్టికల్ నేను చదవలేదు కానీ - ఇలాంటి ఆవేదనలు మీతోబాటు మరెందరో సగటు మనుషులు అనుభవిస్తున్నవే! మొన్నీమధ్య ఒక ప్రయాణం చేస్తూ పెన్నా, తుంగబద్ర నదులు దాటుతున్నప్పుడు, నదుల మీద వంతెనలున్నాయి కానీ, వాటి కింద చుక్కైనా నీరు లేదు.
.
గోదావరి విషయానికి వస్తే, గోదావరి జిల్లాలలో పరిస్థితి చాలా మెరుగ్గా ఉంటుంది. జగిత్యాల పట్టణానికి దగ్గిరలో NH16 మీద ధర్మపురి అనే నారసింహ క్షేత్రమొకటుంది. ఎండాకాలంలో అక్కడ గోదావరి కనబడితే ఒట్టు. ఓ దశాబ్దం కిందట కూడా అంతే!
.
ఇక కారణాల విషయానికొస్తే, మీడియాలో చూపినట్టు 'ప్రభుత్వ వైఫల్యాలు' ఎంతమటుకు కారణమో ఒక్కోసారి అనుమానం కలుగుతుంటుంది. ఒక తప్పిదానికి ఎవరినో ఒకరిని కారణంగా చూపి వారిని దుమ్మెత్తి పోస్తుంటాయి వార్తా మాధ్యమాలు. ఎవరూ కనబడకపోతే 'అధికారుల నిర్లక్ష్యం' అనే filler పదమొకటి ఉండనే ఉన్నది.
.
నా లెక్క ప్రకారం జరుగుతున్న-జరుగబోయే విపరీత పరిణామాలకు అసలు కారణం ఎలుక జాతితో పోటీబడుతున్న మనుష్య జనాభా! మన భారతీయులకు ఏఁవొచ్చినా రాకపోయినా, ఇబ్బడి ముబ్బడిగా సంతానాన్ని కనడం మాత్రం బాగా వచ్చు.
.
2011 లో చైనా బారత దేశాల జనభా 1346000000+, 1241000000+ అయితే, గణాంకాల ప్రకారం, 2050 కల్లా మనం చైనాను అధిగమించిపోతాం. అంచనాల ప్రకారం అప్పుడు మన జనాభా వచ్చి 1692000000+ అయితే, చైనా జనాభా తిరుగుముఖంపట్టి 1313000000+ కు తగ్గుతుంది.
.
ఆలోచించండి - తప్పెవరిదో?

Anonymous said...

"తెలుగు భావాల" అభిప్రాయంతొ ఏకీభవిస్తున్నాను. కానీ మీరు చెప్పినట్టు మలమూత్ర విసర్జనకి కూడా ప్రభుత్వాన్ని తప్పుపడితే ఎలా?

హనుమంత రావు said...

తెలుగుభావాలు.. చాలా చక్కగా ఆలోచించారు.. కేవలం ప్రభుత్వానిదే బాధ్యత అని నేను అనలేదన్నవిషయం మీ దృష్టిలోనికి వచ్చిందనే భావిస్తున్నాను.. ప్రభుత్వం అనగానే ప్రభుత్వమంటే ఎవరు అన్న ప్రశ్నా ఉంటుంది.. వైజాగ్ లో రోడ్లు వెడల్పు చేస్తూ రోడ్డు ప్రక్క చెట్లు పెంచారు... సెంట్రల్ మార్జినులో పూల మొక్కలు పెంచారు... ఆ చెట్లు పెరుగుతుండగానే నరుక్కు పట్టుకుపోయారు.. మళ్ళీ కార్పరేషను వాళ్ళు చెట్లు నాటించి చుట్టూ ఫెన్సింగ్ వేసారు .. ఇప్పుడు బాగా పెరిగాయి. మధ్యలో ఉన్న మొక్కలపూలు ఇలా పూస్తుండగానే కోసుకు పోతారు.. ఎవరంటే ... అదే నేను నా పోస్ట్ లో వ్రాసాను.. యస్ యస్ వై లో చెప్తారు.. ప్రతీ తప్పుకు నువ్వే బాధ్యుడివి అని.. ఆ భావం అందరిలోనూ రావాలి.. అప్పుడు ఎవరివంతు కర్తవ్యం వాళ్ళు చేసే అవకాశం ఉంటుంది.. నా బాధ పంచుకోవడానికే ఇందులో వ్రాసాను కాని ఎవర్నీ తప్పు పట్టడానికి కాదు...

హరెఫలగారు;;;మీరు కూడా అర్థంచేసుకున్నారనే భావిస్తున్నాను.

Subramanya Shastry said...

హనుమంతరావు గారు,

మీ ఆవేదన మా అందరిదీనూ! మీరు రాసిన ఏ విషయంతోనూ విభేదించటం లేదు. మీరు వార్తా పత్రికలోని వార్తను చదివి ఆవేదన పడ్డ కారణానికి సమాధానంగా రాసాను. అంతే!!!

Krishna said...

గోదావరి మాత పరిస్థితి మరీ దీనంగా ఉంది. గత వందేళ్ళళ్ళో లేనంత దుస్థితి.

వేణుగోపాల స్వామి ఆలయం ఎక్కడుందో చెప్పగలరా?

Anonymous said...

అక్షరమక్షరమూ సత్యమే.. గతంలో గంట సమయం దొరికితే గోదారికి వెళ్ళిపోయే వాళ్ళం. ఇప్పుడు ఆర్నెల్లకో సారి రాజమండ్రీ వచ్చినా గోదారికి వెళ్ళాలని అనిపించడం కూడా లేదు. ఏదో తెలీని బాధ.

హనుమంత రావు said...

తెలుగుభావాలు: ధన్యవాదాలు.

krsnaగారు.. గోదావరి గట్టు మీద మార్కండేయ స్వామి ఆలయం దాటి రాజమండ్రి స్టేషనువైపు కూసింత దూరం వెళ్తే, పెట్రోల్ బంకు, తర్వాత వేణుగోపాలస్వామి ఆలయం ప్రవేశద్వారం గోదావరి నదికి అభిముఖంగా ఉంది. ఇదివరలో ఈ ద్వారం లేక పోవడం వలన కంభంవారి సత్రం తర్వాత ఎడమ వైపుకి తిరిగి మొదటి ఎడమ సందులోకి తిరిగితే ఆలయ దర్శనం అయ్యేది.. అదీ ఇప్పుడు ఉంది అనుకోండి.వేణుగోపాలస్వామి రాజమండ్రి క్షేత్రపాలకుడు. ప్రాచీన దేవాలయం. లోపల శిలా శాసనాలు కూడా కనపడ్తాయి..మెయిన్ రోడ్ లోఉన్న పెద్దమశీదు ఉన్న చోట ఈ ఆలయం ఉండెడిదట. ఆ గుర్తులు ఇప్పటికీ అక్కడ ఉన్నాయి అని చెప్తారు.. తప్పక ఆలయాన్ని దర్శించండి.

పురాణపండ వారు.. నాలో కలిగిన ఆ బాధే ఇలా అక్షరాలుగా మారింది..

DNS Siva Kumar said...

It was a great shock to read the facts. Right from the days i remember, Godavari, crossing the bridge - and the affection of 'MY' people and an attachment to my birth place were the great internal memories. The article is an alarm for many important things happening around us - and we keep busy in things that are actually immaterial for us. I am sorry for my comments in English, as telugu version was not available to me. It is a sad and helplessness glooming our lives, our families, our nature and our own existence. DNS Siva Kumar, London, UK

హనుమంత రావు said...

dear siva kumar, the concern of kind people like you go as a prayer to the Almighty and He only setright things.

Krishna said...

హనుమంత రావు గారు,

మీరు చెప్పిన ఆనవాల ప్రకారం వెళ్ళి ఈరోజు స్వామి వారి దర్శనం చేసుకున్నాను. కోవెల చాలా బాగుంది. పూజారి గారు ఊరికి కొత్త అని కూడా అడిగారు అన్ని పరిశీలిస్తుంటే. ఆకడ గోడకి పెట్టిన శాసనాలు చదవడానికి ప్రయత్నించాను. మీ వల్ల ఈ రోజు మంచి దర్శనం అయ్యింది. సంతోషం. ప్రస్తుతం అక్కడ రోజూ తిరునక్షత్ర పూజలు జరుగుతున్నాయి అంట.

ధన్యవాదాలు